Gujarat | లక్నో: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్లో జరిగిన దారుణాలను మరువక ముందే తాజాగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, గుజరాత్లో కుల జాడ్యం వెలుగుచూసింది. కుల వివక్షతో ఓ గ్రామంలోని ఉన్నత వర్గానికి చెందిన వారు మూకుమ్మడిగా దళితుడి దుకాణంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు నిరాకరించారు. ఈ ఘటన పటాన్ జిల్లాలోని సరస్వతీ తహసీల్ పరిధిలో ఉన్న కనోసన్లో చోటుచేసుకుంది. కుల వివక్షను రూపుమాపాల్సిన జిల్లా కలెక్టర్ అర్వింద్ విజయన్ ఉన్నత వర్గం వారికే కొమ్ముకాసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నత వర్గానికి చెందిన సుమారు 436 రేషన్కార్డులను పక్క గ్రామాలకు బదిలీ చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.
గుజరాత్లోని కనోసన్లో 90 శాతం మంది ఉన్నత వర్గం వారే. దళితుడైన కాంతి పార్మర్ ఆ గ్రామంలో రేషన్ దుకాణాన్ని నడుపుతున్నారు. గత ఏడాదిన్నరగా ఆ గ్రామంలోని ఉన్నత వర్గం వారు కాంతి వద్ద సరుకులు తీసుకోవడం లేదు. గ్రామంలోని 268 కుటుంబాలకు గానూ 260 కుటుంబాలు కాంతి వద్ద సరుకులు తీసుకునేందుకు విముఖత చూపించాయి.