గాంధీనగర్: ‘వ్యవసాయానికి కరెంటు అవసరమని గుర్తించి, రైతులకు 8 గంటల నిరంతరాయ విద్యుత్తు అందజేయాలని నిర్ణయించినందుకు రాష్ట్రంలోని రైతుల తరఫున ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్, ఆర్థికమంత్రి కాను దేశాయ్కు కృతజ్ఞతలు’.. గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి రాఘవ్జీ పటేల్ బుధవారం మధ్యాహ్నం 1.10 గంటలకు చేసిన ట్వీట్ ఇది. దీనర్థం.. గుజరాత్ రైతులకు 8 గంటల నిరంతరాయ విద్యుత్తు అందుతుందని. అదే.. తెలంగాణలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందుతున్నది. గుజరాత్లో మాత్రం అందేది 8 గంటలపాటే. అది ఉచితమా? కాదా? అన్నదీ తెలియాల్సి ఉన్నది. తెలంగాణలో ఉచితంగా 24 గంటల విద్యుత్తు అందితే, గుజరాత్లో 8 గంటలే. ఇదీ గుజరాత్ మోడల్. ఇదీ డబుల్ ఇంజిన్ ఎఫెక్ట్. ఇదీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో పరిస్థితి. ఇందులో ఏది బాగున్నది? ఇందులో ఏది సంక్షేమ పాలన? అన్నది ప్రజలే తేల్చుకోవాలి.