న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 వేరియంట్ కరోనా తొలి కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదివారం నిర్ధారించింది. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4 సోకినట్లుగా తొలి కేసును గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఎన్ఎస్ఏసీవోజీ ధ్రువీకరించింది. అలాగే తెలంగాణకు చెందిన 80 ఏండ్ల కరోనా పాజిటివ్ మహిళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.5ను తొలి కేసుగా గుర్తించినట్లు తెలిపింది. ఈ వేరియంట్ కేసులు దేశంలో ఇవే మొదటివని పేర్కొంది. ఈ ఇద్దరు రోగుల్లో స్వల్పంగా కరోనా లక్షణాలున్నాయని, వారు పూర్తిగా టీకాలు తీసుకున్నారని, విదేశాల్లో ప్రయాణించలేదని వివరించింది. అయితే ముందు జాగ్రత్తగా ఈ కొత్త వేరియంట్ల కరోనా సోకిన రోగులను కలిసిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
మరోవైపు ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 వేరియంట్ల కరోనా వైరస్ను తొలిసారి దక్షిణ ఆఫ్రికాలో గుర్తించారు. అనంతరం ఈ సబ్ వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న దక్షిణ ఆఫ్రికా ప్రయాణికుడిలో బీఏ.4 వైరియంట్ను ఇటీవల గుర్తించారు. అయితే ఈ వేరియంట్ కరోనా వల్ల ముప్పు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగడం వంటివి పెద్దగా లేవని ఆ కేంద్ర సంస్థ తెలిపింది.