న్యూఢిల్లీ : భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్కు 17 తుపాకులతో వందనం సమర్పించారు. ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్న బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో రావత్ దంపతులకు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. అయితే అంత్యక్రియలను పూర్తిగా సైనిక లాంఛనాలతో నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో త్రివిధ దళాలు 17 గన్ సెల్యూట్ సమర్పించాయి. ఇంకా సుమారు 800 మంది త్రివిధదళాలకు చెందిన సిబ్బంది దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.
అయితే ప్రోటోకాల్ ప్రకారం సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు ఆర్మీ గన్ సెల్యూట్ సమర్పిస్తోంది. తుపాకీ వందనం సమర్పిస్తున్నారంటే ఆ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగున్నట్టు అర్థం. రాజకీయం, సాహిత్యం, న్యాయ, విజ్ఞాన, కళా రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి తుపాకీ వందనం సమర్పిస్తారు. మరి 17 గన్ సెల్యూట్ ఎవరికి సమర్పిస్తారు? ఎందుకు సమర్పిస్తారు? అనే ప్రశ్నలు పలువురిని పలుకరిస్తున్నాయి.
భారత రాష్ట్రపతి, మిలిటరీ, సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు.. 21 గన్ సెల్యూట్ నిర్వహిస్తారు. అంటే గాల్లోకి 21 సార్లు కాల్పులు జరిపి వందనం సమర్పిస్తారు. త్రివిధ దళాల్లో పని చేసిన సీనియర్ ఆఫీసర్లు మరణిస్తే 17 గన్ సెల్యూట్ సమర్పిస్తారు.
21 గన్ సెల్యూట్ సంప్రదాయాన్ని భారతదేశం బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి వారసత్వంగా పొందింది. బ్రిటీష్ కాలంలో అంటే స్వాతంత్ర్యానికి ముందు అత్యధికంగా 101 గన్ సెల్యూట్ ఉండేది. రాయల్ సెల్యూట్గా పిలిచే ఈ వందనాన్ని కేవలం బ్రిటీష్ క్రౌన్కు మాత్రమే సమర్పించేవారు. దీని తర్వాత వచ్చిన 31 గన్ సెల్యూట్ను రాణి, రాజ కుటుంబాలకు సమర్పించేవారు. ఇదే పద్ధతిని వైస్రాయ్, భారత గవర్నర్ జనరల్కు కూడా పాటించారు. దేశాధినేత, విదేశీ సార్వభౌమాధికారులు, వారి కుటుంబ సభ్యులకు 21 గన్ సెల్యూట్ సమర్పించేవారు.
భారత రాష్ట్రపతికి పలు సందర్భాల్లో 21 గన్ సెల్యూట్ సమర్పిస్తారు. రాష్ట్రపతి ప్రమాణం చేసిన రోజున కూడా తుపాకీ వందనం స్వీకరిస్తారు. ఇక ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు.. 21 తుపాకీ వందనం స్వీకరిస్తారు.