Emergency Landing | దర్భంగా నుంచి ముంబయి వెళ్తున్న విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న వృద్ధురాలు ఆరోగ్యం పరిస్థితి విషమించింది. పైలట్ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దింపారు. ఆ తర్వాత మహిళను వెంటనే ఆసుప్రతికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వృద్ధురాలు కళావతి దేవి (85) తన మనవడితో కలిసి ముంబయికి వెళ్తున్నది. దర్భంగా విమానాశ్రయం నుంచి ముంబయికి ఎస్జీ 116 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలు ఆరోగ్యం క్షీణించింది.
దీంతో సిబ్బంది ఏటీసీని సంప్రదించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరారు. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో ల్యాండింగ్ తర్వాత వృద్ధురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినప్పటికీ వృద్ధురాలి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణంగా విమానం ఒకటిన్నర గంట ఆలస్యంగా ముంబయి విమానాశ్రయానికి చేరుకుంది.