Udaipur : తన కుటుంబంతో కలిసి ఫైవ్ స్టార్ హోటల్లో పది రోజులు బస చేసిన ఢిల్లీ వాసి.. లక్షల రూపాయల బిల్లు ఎగ్గొట్టి పరారయ్యాడు. ఈ ఘటన రాజస్తాన్లోని ఉదయ్పూర్లో జరిగింది. దీంతో సంబంధిత హోటల్ యాజమాన్యం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. ఢిల్లీకి చెందిన అనురాగ్ యాదవ్ అనే వ్యక్తి ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఉదయ్పూర్లోని ద ఒబెరాయ్ ఉదయ్విలాస్ అనే ఫైవ్స్టార్ హోటల్లో రూం బుక్ చేసుకున్నారు. అనురాగ్ యాదవ్, అతడి భార్య, ఇద్దరు పిల్లలు కలిసి ఆగష్టు 14 నుంచి 23 వరకు హోటల్లో ఉన్నారు. ఈ పది రోజుల సమయంలో హోటల్ నుంచి అనేక సేవలు పొందారు. లంచ్, డిన్నర్తోపాటు ఇతర సేవలు పొందారు. దీనికిగాను మొత్తం రూ.5.74 లక్షల బిల్ అయింది. అయితే, ఈ బిల్ చెల్లించకుండానే ఆ కుటుంబం ఆగష్టు 24న వెళ్లిపోయింది.
దీనిపై ప్రశ్నిస్తే తనకు రూం బుక్ చేసిన ట్రావెల్ ఏజెన్సీనే డబ్బులు చెల్లిస్తుందని చెప్పాడు. అయితే, బిల్లు చెల్లించేందుకు ట్రావెల్ ఏజెన్సీ నిరాకరించింది. ఈ విషయంలో అతడితో ఎలాంటి ఒప్పందం లేదని తెలిపింది. అటు.. అనురాగ్ బిల్లు చెల్లించలేదు. ట్రావెల్ ఏజెన్సీ కూడా తమకేం సంబంధం లేదని చెప్పింది. దీంతో రూ.5.74 లక్షల బిల్లు కోసం ఒబెరాయ్ హోటల్ మేనేజర్ రవీంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.