పైసా ఖర్చులేకుండా పేదలకు సీటీ స్కాన్ సేవలు
నేడు సిద్దిపేట జనరల్ దవాఖానలో సిటీ స్కాన్ సెంటర్ను ప్రారంభించనున్న మంత్రి
రూ. 2.40 కోట్లతో 20 పడకల ఐసీయూ ఏర్పాటు
సిద్దిపేట జోన్ (మార్చి 20) : జ్వరమొచ్చినా, ప్రమాదం జరిగినా, గాయపడిన దవాఖానలకు వెళ్తే మొదట వైద్యులు సిఫారసు చేసేది మెడికల్ టెస్టులకే. దీంతో సామాన్యులు, పేదలకు వైద్యం అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు, సామాన్యులకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి, వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్నది. నిత్యం వైద్య పరీక్షల కోసం అనేక మంది పడుతున్న బాధలను చూసిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు వారి భారాన్ని తగ్గించేందుకు సిద్దిపేటలో అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో రూ.2.1 5కోట్లతో సిద్దిపేట జనరల్ దవాఖానలోని క్యాజ్వాలిటీ పక్కన సీటీ స్కాన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేడు మంత్రి హరీశ్రావు సీటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
ప్రమాదం జరిగి తలకు, శరీరానికి గాయాలైనప్పుడు సత్వరం చేసే వైద్య పరీక్ష సీటీస్కాన్. ఈ పరీక్షలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తే రూ.4వేల నుంచి 6వేల వరకు ఖర్చవుతుంది. దీనిని గమనించిన మంత్రి హరీశ్రావు సిద్దిపేట జనరల్ దవాఖానలో సీటీ స్కాన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పేదలకు ఉచితంగానే సీటీ స్కాన్తో పాటు రిపోర్టు తీసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటికే డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా 54రకాలైన వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తుండగా, సీటీ స్కాన్ సెంటర్ సేవలు అందుబాటులోకి రానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీటీస్కాన్ ద్వారా హెచ్ఆర్ సీటీస్కాన్, సీఈ సీటీస్కాన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సీటీస్కాన్ కేంద్రంలో డ్రైలేజర్ కెమెరాలు, రిపోర్టుల ప్రింట్ ఇవ్వడానికి కలరు ప్రింటర్, కాంట్రాస్టు ఇంజక్టర్లను ఏర్పాటు చేశారు. ఈ సీటీస్కాన్ సెంటర్లో కార్డియో మినహా మిగతా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సీటీస్కాన్ సెంటర్ ద్వారా కరోనా రోగ నిద్ధ్దారణ కోసం ఊపిరితిత్తులను స్కాన్ చేయనున్నారు. అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ సీటీస్కాన్ సెంటర్లో చెన్నై నుంచి వచ్చిన బృందంతో యంత్రాలను ఏర్పాటు చేసి ట్రయల్ డ్రైవ్ చేసి అందుబాటులోకి తీసుకు వచ్చారు.
20 పడకల ఐసీయూ..
సిద్దిపేట జనరల్ దవాఖానలో రూ.2.40కోట్లతో నూతనంగా 20 పడకల ఐసీయూను ఏర్పాటు చేశారు. గతంలో 10పడకల ఐసీయూ ఉండగా, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ ఐసీయూను ఏర్పాటు చేశారు. దీనిని మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. రూ.40లక్షలతో జనరల్ దవాఖానలో రోగులను తీసుకెళ్లేందుకు 2వలిప్టును నిర్మిస్తున్నారు. ఒకేసారి ఈ లిప్టులో 15మందితో పాటు స్ట్రెచ్చర్ తీసుకెళ్లే సామర్థ్యంతో దీనిని నిర్మించారు.