న్యూఢిల్లీ, జూలై 28: భార్యాభర్తల మధ్య 21 ఏండ్లుగా ఎడతెగని పంచాయితీని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పరిష్కరించారు. వాద ప్రతివాదాలకు బదులు సూచనలు, సలహాలతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి ఉండటానికి అంగీకరించేలా ఒప్పించారు. పిటిషన్ దాఖలు చేసిన మహిళకు సులువుగా అర్థం అయ్యేందుకు, ఆమె తన అభిప్రాయాలను చెప్పేందుకు వీలుగా ఆయన తెలుగులో మాట్లాడారు. ఆమె చెప్పే మాటలను తోటి జడ్జికి అర్థమయ్యేలా ఇంగ్లిష్లోకి అనువదించి చెప్పారు. బుధవారం సుప్రీంకోర్టులో ఈ అసాధారణ దృశ్యం కనిపించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ జంటకు 1998లో వివాహం కాగా, 2001లో విడిపోయారు. భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఏడాది జైలు శిక్ష పడింది. భర్త హైకోర్టుకు వెళ్లగా శిక్ష ఆరు నెలలు తగ్గించారు. దీనిపై భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ సందర్భంగా భార్యాభర్తలిద్దరికీ జస్టిస్ ఎన్వీ రమణ నచ్చజెప్పారు. జైలుకెళ్తే ఉద్యోగం పోతుందని, అప్పుడు భరణం రాదని, ఏకైక కుమారుడి పోషణ ఇబ్బంది అవుతుందని వివరించారు. దీంతో మళ్లీ కలిసి ఉండటానికి భార్యభర్తలు ఇద్దరు అంగీకరించారు.