Blue ants : చీమలు సాధారణంగా నలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి. కానీ అరుణాచల్ప్రదేశ్లో అరుదైన నీలి చీమలు ఉన్నాయి. పరిశోధకులు సియాంగ్ లోయలో ఈ అరుదైన నీలి చీమలను కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ (అట్రీ), ఫెరిస్ క్రియేషన్స్లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది.
అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదం వివరాలను భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు.
వందేళ్ల తరవాత ఇప్పుడు బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్ లోయకు వెళ్లి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను గుర్తించింది. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం చేసింది. ఈ భూమ్మీద ఉన్న మొత్తం 16,724 చీమజాతుల్లో ఈ నీలి రంగు చీమలు అత్యంత అరుదైనవని తెలిపింది.