పాట్నా: బీహార్లో అధికారంలో ఉన్న జేడీయూపై బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా తన అక్కసను వెళ్లగక్కారు. జేడీయూ మటన్ విందు పార్టీ తర్వాత వందలాది కుక్కలు మాయమయ్యాయంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జేడీయూ కార్యకర్తలకు కుక్క మాంసంతో విందు ఇచ్చినట్లు పరోక్షంగా ఆయన ఆరోపించారు. అలాగే మద్యం కూడా సరఫరా చేసి ఉంటారని, దీనిపై దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు. జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు లాలన్ సింగ్ ఈ నెల 14న ముంగేర్లో పార్టీ కార్యకర్తలకు మాంసంతో కూడిన విందు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా కొందరు కర్రలతో కొట్టుకున్నారు.
కాగా, జేడీయూ కార్యకర్తలకు ఇచ్చిన ఈ విందుపై బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా బుధవారం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ విందు పార్టీ తర్వాత నగరంలో వందల సంఖ్యలో కుక్కలు మాయమైనట్లు చాలా మంది తనకు చెప్పారని అన్నారు. ఆ పార్టీ కార్యకర్తలకు వేలాది జంతువుల మాంసంతో విందు ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీని వల్ల ఏ వ్యాధి వ్యాపిస్తుందో అని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే జేడీయూ కార్యకర్తలకు విందు సందర్భంగా మద్యం కూడా సరఫరా చేశారా లేదా అన్నదానిపై దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై జేడీయూ స్పందించింది. మానసిక పరిస్థితి సరిగా లేక ఆయన ఇలా మాట్లాడుతున్నారని జేడీయూ అధికార ప్రతినిధి అభిషేక్ ఝా విమర్శించారు. తన ప్రజలకు ఇచ్చే విందులో ఏ జంతువు మాంసాన్ని వడ్డిస్తారో విజయ్ కుమార్ సిన్హా చెప్పాలని అన్నారు.