AAP : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున ఎంపికై బీజేపీ (BJP) లో చేరిన ఆ ఏడుగురు రాజ్యసభ సభ్యుల (Rajya Sabha Members) పై అనర్హత వేటు వేయాలని ఆప్ కోరింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ (Radha Krishnan) కు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన ఆప్ ఎంపీల చర్యలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఆప్ ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో చేరారని సంజయ్ సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలో వారి సభ్యత్వాలను రద్దు చేయాలని తాము రాజ్యసభ ఛైర్మన్ను కోరామని తెలిపారు. ఇలాంటి ఫిరాయింపులు ప్రజాతీర్పునకు ద్రోహం చేయడమే కాకుండా.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తాము రాజ్యాంగ నిపుణులను సంప్రదించామని, చట్టప్రకారం ఆ ఎంపీలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు.
ఇదిలావుంటే బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరైన హర్భజన్ సింగ్కు కేటాయించిన భద్రతను పంజాబ్ పోలీసులు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. 9-10 మంది పోలీసులతో కూడిన సెక్యూరిటీని తొలగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే జలంధర్లోని ఛోటీ బారాదరీ ప్రాంతంలో ఉన్న హర్భజన్ నివాసం వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లను మోహరించారు. బీజేపీలోకి వెళ్లడాన్ని నిరసిస్తూ శనివారం ఆప్ కార్యకర్తలు హర్భజన్ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు.