ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యేందుకు తోడ్పడింది ఖిలాఫత్.
ఖిలాఫత్ ఆందోళనతో కలిపి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని మహాత్మా గాంధీ తీసుకున్న నిర్ణయానికి హైదరాబాద్లో మంచి స్పందనే వచ్చింది. ఇక్కడి సర్కారు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ గాంధీ ప్రభావం మెల్లమెల్లగా విస్తరించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా స్వదేశీ ఉద్యమం జనాలకు బాగా ఎక్కింది. ఇళ్లల్లో చరఖాలు పెట్టుకుని నూలు వడికేవారు పెరిగిపోయారు.
ఖాదీ చొక్కాలు, గాంధీ టోపీలు వచ్చాయి. ఆ రోజుల్లో బహిరంగంగానే ఇంట్లోవడకిన నూలు అమ్మేవారు. తిలక్ స్వరాజ్ నిధికి కోరట్కర్, వామన్రావు నాయక్ చేపట్టిన విరాళాల సేకరణలో చురుగ్గా పాల్గొన్నారు. పుణె, బాంబే, అలీగఢ్ తదితర చోట్ల ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సంస్థాన యువకులు అనేకమంది సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు గానూ చదువులు వదిలిపెట్టారు. డాక్టర్ జయసూర్య బాంబేలోని మెడికల్ గ్రాంటు కాలేజీలో అభ్యసిస్తున్న వైద్య విద్యకు స్వస్తి చెప్పారు. వస్త్రధారణలోనూ మార్పు వచ్చింది. పైజమాలు పోయి ఖాదీ ధోవతులు వచ్చాయి.
నిజాం అధికారులు ఈ మార్పులపై అసహనం ప్రదర్శించేవారు. టర్కీని ముక్కలు చేసి కాలిఫేట్ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఖిలాఫత్ ఆందోళనలో చేరాల్సిందిగా నిజాంను ఆహ్వానించినా బ్రిటిష్ వారికి ఆప్త మిత్రుడైన నిజాం అందుకు ఎన్నడూ ముందుకు రా లేదు. హైదరాబాద్, గుల్బర్గా, ఔరంగాబాద్, రాయచూరు, కరీంనగర్, జనగాం, మెదక్ పట్టణాల్లో 1920 మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఖిలాఫత్ దినాలను పాటించారు.
ఈ ఆందోళన.. హిందూ, ముస్లిం నేతలను ఒక్కతాటిపైకి తెచ్చింది. ముస్లిం నేతలు ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో హిందూ నాయకులు ప్రసంగించేవారు. నాయకులు బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొని వస్తుంటే వారికి దారిపొడవునా ఘనస్వాగతాలు లభించేవి. వివేకవర్ధిని గ్రౌండ్స్లో 1920 ఏప్రిల్ 23న పరీక్షా దినం జరిపారు. ఈ సభలో హిందూ, ముస్లిం నాయకులు కలిసే పాల్గొన్నారు.
ఖిలాఫత్ ఉద్యమానికి ఈసభలో అప్పటికప్పుడు రూ.12,000 వసూలయ్యాయి. డాక్టర్ మహమ్మద్ హుసేన్ ఎఫండీ తన మోటార్కారును, సగం ఆస్తిని ఉద్యమానికి రాసిచ్చారు. మొత్తంమీద ఖిలాఫత్ ఉద్యమం హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ కార్యకలాపాలు విస్తరించేందుకు కారణమైంది. ఈ పరిణామాలు సహజంగానే నిజాం ప్రభుత్వానికి ఆందోళన కలిగించాయి. ఫలితంగా రాజకీయ సమావేశాలపై నిషేధాలు వచ్చాయి.