కవిత్వంలో వ్యక్తీకరణకు రకరకాల శైలులు ఉంటాయి. అయితే కవి తన వ్యక్తీకరణకు తగిన శైలిని ఎన్నుకున్నప్పుడు అతని కవిత్వం సఫలీకృతమై పాఠకుడికి చేరుతుంది. ఇక్కడ ఏటూరి నాగేంద్రరావు తాత్విక మార్మికతకు నైరూప్య వ్యక్తీకరణ శైలిని ఎన్నుకున్నారు. ఆయన కవిత్వంలో తాత్వికత, గాఢత, మార్మికత అనే మూడు లక్షణాలు ఇనుమడించాయి. వస్తువును అధిగమించే ఈ రకం శైలి ఆయన ప్రత్యేకత.
ఆయన కవిత్వంలో మరో లక్షణం..అలవోకగా కవితను చెప్పే తత్వం. ఇది మనలోని ప్రశ్నలను, నిద్రపోయిన బాధలను, మరుగునపడిన కలలను మళ్లీ మేల్కొలుపుతాయి. ‘ఒక అశాంతుడి స్వప్నం’ అలాంటి అరుదైన కవితా సంపుటి. ఇక్కడ అశాంతి ఒక భావోద్వేగం కాదు. అది జీవన స్థితి. కవి ప్రశాంతతను వెతకడం లేదు. అశాంతినే తన నివాసంగా చేసుకున్నారు. ‘ప్రేమించడం కవిత’లో..‘జీవితాన్ని ప్రేమించడం నేర్చుకున్నాక నిర్దయగా నీలో నువ్వు ఇంకిపోవాల్సిందే’ అని చెప్పినప్పుడు ప్రేమను వ్యక్తి నుంచి వ్యక్తికి మధ్య ఉండే సంబంధంగా కాకుండా, తనను తాను ఎదుర్కొనే సాహసంగా నిర్వచిస్తారు. జీవితం పట్ల నిజమైన ప్రేమ అంటే స్వీయ అన్వేషణ అని కవి చెప్పారు.
‘మౌన కోయిలలు’ కవితలో..‘ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి’ అనే పంక్తి నేటి సమాజపు అనుభూతి రాహిత్యాన్ని అత్యంత తీవ్రంగా ప్రశ్నిస్తుంది. మనిషి బాధ వార్తగా మారిపోతున్న కాలంలో, స్పందన కోల్పోతున్న మానవ సంబంధాలను కవి మన ముందుంచారు. ‘విషాద మాధుర్యం’ కవితలో కవి దుఃఖాన్ని శాపంగా కాకుండా అనుభవపు జ్ఞానంగా చూస్తారు. ‘విషాద మాధుర్యాన్ని అనుభవించడం అలవాటుపడ్డాక అగాధాల లోతులు కూడా సౌందర్య శిఖరాలుగా కనిపిస్తాయి’. ‘నాలో నేను నడుసూ’్త కవితలో..‘నిజం గరుకైన మొక్కున్నప్పుడు ప్రాణం ఒట్టి పోరాటమే ఉంటుంది’ అని చెప్పినప్పుడు, జీవితం అనేది బాహ్య విజయాల కంటే అంతరంగపు సంఘర్షణల సమాహారమని కవి గుర్తుచేస్తారు. ఏటూరి కవిత్వం ఆర్భాటమైన భాషను ఆశ్రయించదు. సాధారణ పదాల వెనుక అసాధారణ అనుభూతులను దాచిపెడుతుంది. ఆయన కవితల్లో తాత్వికత ఉంది. కానీ అది ఉపన్యాసంలా అనిపించదు. బాధ ఉంది. కానీ నిరాశగా మారదు. ఆశ ఉంది కానీ నినాదంగా వినిపించదు.
ఈ సంపుటి అశాంతిని అక్షరంగా, అక్షరాన్ని ఆత్మసాక్ష్యంగా మార్చిన కవి మన ముందుంచిన సున్నితమైన అనుభూతుల ప్రపం చం. పి. శ్రీనివాస్ గౌడ్ ముందుమాట ఈ సంపుటి ఆత్మను ఆవిష్కరించగా, ఏటూరి నాగేంద్రరావు కవితలు ఆ ఆత్మలోని గాయాలు, కలలు, నిశ్శబ్దాలను మనకు అనుభూతి కలిగిస్తాయి. ఒకటి పుస్తకానికి ముఖద్వారమైతే, మరొకటి ఆ ఇంటి అంతరంగం. చివరలో అట్ట మీద అఫ్సర్ బ్లర్బ్ ఆకట్టుకుంటుంది. ‘అశాంతి ఉన్నంతకాలం కలలు ఉంటాయి. కలలు ఉన్నంతకాలం కవిత్వం ఉంటుంది. ఆ కవిత్వానికి ఒక అశాంతుడి స్వప్నం ఒక సజీవ సాక్ష్యం’.
– ఎన్. లహరి 9885535506