చిన్న కవితల మిన్నతనం ఇటీవల తెలుగు సాహిత్యంలో బాగా రికార్డవుతున్నది. సంక్షిప్తత, స్పష్టత, ధ్వని, భాషాసారళ్యం, కొసమెరుపుతో కూడిన కవితా వాక్యాలు ఎంత మనోహరంగా ఉంటాయో ‘పూలపూల వాన’లో చూడవచ్చు. ఏనుగు నరసింహారెడ్డి ఈ మధ్య వెలువరించిన మినీ కవితల సం పుటి పూలపూల వాన. సామాజిక సత్యా లు, సౌందర్య రూపాలు, ప్రకృతి వర్ణన లు, లోతైన తాత్త్విక చింతన కళ్ల ముందు కదలాడే దృశ్యకావ్యం ఇది. ఇందులోని ఒక్కో కవిత.
ప్రతి కాలువా/ చంద్రునికి అద్దమే పారుతూ పారుతూ కూడా/అందమైన బొమ్మేస్తుంది.
అంటారు కవి. పూల పూలవానలోని చాలా కవితలలో ముందుగా దృశ్యాలే కనబడి తర్వాత వాటిని అక్షరాలుగా వెతుక్కుంటాం. సౌందర్య చిత్రణ, ప్రకృతి ఆరాధన, సామాజిక నిబద్ధత పరస్పర విరుద్ధాంశాలు కావని, పైగా అవి పరస్పర పూరకాలని ఈ సంపుటి పూర్తిగా చదివినవాళ్లు ఒక అభిప్రాయానికి వస్తారు. తత్త్వ చింతనకు ప్రకృతి వస్తువులను గొప్ప ఉపమలుగా ఉపయోగించుకొన్నారీ కవి. గిరిని, నదిని గురించి మాట్లాడినా, శ్రమ సౌందర్యాన్ని భావుకుల మెప్పు పొందేవిధంగా రాసినా, ఆమె సౌందర్యాన్ని అతని బాధ్యతను విపర్యయంగా కూడా వాడగలగడం ఈ కవి ప్రత్యేకత.
గిరిచుట్టూ నీళ్ళున్నా/ మునగదు
నదికెదురుగ రాళ్ళున్నా/ఆగదు
దీర్ఘ కవితలలోనో వచన కవితలలోనో మాత్రమే చెప్పగలిగే పశ్చిమానికి ప్రవహించే పసుపుటేరు, తాగునీటిని అందిం చే మంజీరా, పోచంపల్లి ఘనత మొదలైన అంశాలు అత్యంత కవిత్వ శిల్ప సౌం దర్యంతో పొందుపరచబడి ఈ మినీ కవితలను ప్రామాణికంగా నిలబెట్టాయి. 285 కవితలున్న ఈ సంకలనంలోని ప్రతి కవితా సమకాలీనతను కలిగి ఉండటాన్ని ప్రధానంగా గమనించవచ్చు. ముప్పిరిగొన్న ఉద్యమ నేపథ్యాల సాహిత్యంలోంచి ఉద్యమ ఛాయలలోంచి కూడా బయటికి వచ్చి కవిత్వం పూల పూల వానలో సాంత్వన పొందింది.
– డాక్టర్ కాచాపురం దుర్గాదేవి
78930 93495