Kaloji | దేశం, సమాజం, ప్రజల గొడవ ప్రజాకవి కాళోజీ లొల్లి. ఆయన ప్రజాస్వామిక తపస్వి. అందువల్ల ఏ అంచులూ, గోడలూ ఆయన మార్గానికి అడ్డుకాలేదు, అడ్డుగా రాలేదు. విశాల ప్రపంచం సంక్షోభాలన్నీ ఎందుకో ఆ హృదిని ఆవేదనతో అల్లకల్లోలం చేస్తే ‘ఒక సైనికుడు’ కొన్నిసార్లు, ‘ఒకే ఒక సైనికుడు’ అన్నిసార్లూ, ఇంతెందుకు చాలాసార్లు ‘అతడే ఒక సైన్యం’ లా కనిపిస్తాడు. ఫ్రెంచ్ కవి లూయీ ఆరగాన్లా ఒకే ఒక్కడై యుద్ధరంగంలో కవితాస్ర్తాలు దూస్తుంటాడు. పీడిత జన హక్కులు, పౌరహక్కులు, ప్రజాశ్రేయస్సు కోసం కవితా ఖడ్గాన్ని పటపటలాడిస్తూ కత్తి తిప్పిన ఆ కవి హృదయాన్ని మూగ జీవులైన తెలంగాణ ప్రజాశ్రేణులకు అంకితం చేసిన మానవతావాది, మనసున్న కవి కాళోజీ.
ఒక కంట కన్నీళ్ళనూ ఒక కంట మంటలనూ ఎగజిమ్మిన బోళాశంకరుడు కాళోజీ నారాయణరావు. మాటలెంత పదునుగా ఉన్నా అవి జలజలా కనుధారలై జాలువారుతాయి. ‘నోటి కస్సుబుస్సుకు కన్నీటి వింత జతగూర్చును/అంతరంగ నవనీతము ననారతము పంచియిమ్ము!’ అన్నట్టుగా ఉంటుంది కాళోజీ స్వభావం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాళోజీని ‘సూక్తులు శాసనములను పునరుక్తి దోషమందకుండ / జగత్తునభిశంసించుచు శతవత్సరములు దాటుము ! అని దీవెనార్తులతో కోరుకున్నారు. అంతేకాదు ‘కాలుడు మా కాళయ్యను కలకాలము మరచుగాక !’ అని వేడుకొన్నాడు.
‘ఆయన పండితుడూ, పారంగతుడూ అనలేము’ అంటారు దేవులపల్లి రామానుజరావు. కానీ కాళోజీ ప్రత్యేకమైన ముద్ర ఉన్న విశిష్టతల కవీ, రచయితా. పుట్టుకా తనదే.. చివరన చావూ తనదే… బతుకంతా దేశానిది ! అంటే సమాజానిదే అయ్యింది. డబ్బు, కీర్తి సంపదల ఆశ రవ్వంత లేని నిస్వార్థపు నిశ్చల మానవుడు. మంచికి తడిసిపోతాడు, చెడును ఉగ్రనరసింహుడై ఛిన్నాభిన్నం చేస్తాడు.
కాళోజీ దైనందిన కార్యక్రమం లొల్లి చేయ డం. కల్లబొల్లి కపట నాటకాల పెత్తందారుల నూ, వ్యాపారులనూ, రాజకీయ నాయకులనూ, పాలక ప్రభువుల దమనకాండలనూ ఎండగట్టడం, హెచ్చరిస్తూ హూంకరించడం.. విషయ అవగాహనలో వీరజ్ఞాని, జాతీయోద్యమంలోంచి సమకాలీన ఉద్యమాల్లో పాల్గొన్న వీరత్యాగి. కానీ నేటి పరిభాషలో నాయకుడు కాదు సుమా.. ఈ అద్వితీయుడైన కల్లోలిత హృదయు డు ప్రజల భాషలో ప్రజల కోసం ప్రజల జీవితాలనూ, హృదయ ఘోషలనూ పలికిస్తూ కలం కవాతు చేసిన తెలుగు కవి. కాళోజీ దేశాభిమాన మూ, భాషాభిమానమూ, ఉత్సాహమూ, ఉద్రేకమూ నిలువెల్లా పొంగిపొర్లే నిండుకవి. య వ్వన చైతన్యం తొణికిసలాడే అంతరంగ నిత్య యువకుడు, ప్రజా హృదయ పీఠమున చేరి ప్ర జా సంగ్రామం పీఠికలు రాసిన ముని రచనాకారుడు.. ‘కన్నీటిలో ఎన్నెన్నో కలవు అనే శాంతి సభలు సంధి చర్చ / సంఘర్షణ పూర్వావధి అ నే విచిత్ర భావనలను ఆయన కవిత్వంలో కనుగొంటాం.
ఆయన దీర్ఘ ప్రయాణం సత్యాన్వేషణకోసం. ఆయన అంతశ్చేతనలో సత్యం యోగాసనాలు వేస్తుంటుంది. హస్యగీతికలు, సూదంటురాయి గేయ వ్యంగ్యాలు, విమర్శనాయుత పద వీచికలతో స్తబ్ధ జగత్తును కదిలించి నవ విప్లవజ్వాలల్ని రగిలించాడు. ఒక విధంగా ఈ మహర్షి త్రికాలజ్ఞుడు. బతుకు వైరుధ్యాల పుట్టను, వేదనల తేనెతుట్టెను ఎదుర్కొని నిర్భీతితో ప్రమిదలు వెలిగించి చీకటిని తరిమికొట్టి జీవిత సమస్యలను వెనుకకు నెట్టేసిన ప్రజా ఇజంవాడు, జనపక్షపాతి జాగరూకూడు.
శాంతికై పరితపించే ప్రపంచ శాంతికాముకుడు కాళోజీ. కానీ యుగాలుగా తరాలుగా ఈ ప్రపంచంలో శాంతి ఎక్కడ నెలకొని ఉన్నది ? ‘శాంతి శాంతట గుండె మండిపోతుంటే / కండ కరిగిపోతుంటే / బతుకు చితికి పోతుంటే / ఎముక విరిగిపోతుంటే / శాంతి శాంతట శాంతి.. హింసల, అణిచివేతల, అఘాయిత్యాల లోకంలో శాంతి జపం, శాంతి తపం, శాంతి మంత్రోచ్చారణ ఫలిస్తాయా?’ కాళోజీ దృష్టిలో ఊరికే మనం వల్లించే హింస తప్పు. రాజ్యహింస చాలా పెద్ద తప్పు. దానికి ప్రతిహింస తప్పు కాదు. తన గొడవలో ఫాసిజం అంటే ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం అదంతా పెద్ద రాద్ధాంతం.
లౌకికవాదుల నోరూ పీకా నొక్కుతున్న ఉన్మ త్త పాలకుల, మతమౌఢ్యుల దౌర్జన్యాలు ఎదురవుతున్న ఈ కాలంలో కాళోజీ కాహళి ఎంత యదార్థంగా కనిపిస్తున్నది వినిపిస్తున్నది గమనించారా !
దేశం ఈ రోజున అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిని, మనిషిని మనిషి దోచుకునే, హతమార్చే దుస్థితిని కాళోజీ ‘చెల్లినోనికి నేరం చెల్లుబాటు అవుతుంటే/ చెల్లనోనికి నేరం చేయక తప్పక ఉంటే/ చట్ట విరుద్ధ చర్యల పుట్టయిపోదా దేశం. మలిన మానవుడు సమస్త సంఘ జీవనాన్నీ, దేశాన్నీ మలినం చేసే నీచానికి పాల్పడే హీన స్థితిని మానవుని మానవుడు మానవుని మాదిరిగ / మన్నించలేనంత మలినమైనది/ జగతి మలినమైనది /’ అంటూ గుండెలు బాదుకుని ఏడ్చే ఏడుపు కాళోజీ కవిత. అటు ఇజాల వైరుధ్యాలు, అహాల పోటీతత్వాలూ, అక్కరలు తీర్చుకునే వలల వంచనలూ.. ప్రతి విషయం లో, ప్రతి చోట కాట్లాటలు. ఇవన్నీ ‘నా’, ‘నేను’ లోనే నన్ను అణిచిపెట్టి అహంభావిని చేస్తాయి. నా‘నుంచి ‘మా’ వరకు, ‘మన’ వరకు వచ్చే ప్రయాణమే తన జీవన ప్రయాణం అని కాళోజీ తన అసమ్మతి, నిరసన, ధిక్కారం, తిరస్కారం తన లొల్లి లక్షణమని సెలవిస్తాడు. స్వవిమర్శలో కాళోజీది భేషజాలు లే ని, మర్మం అంటు సోకని మనసు దారి. అందు కే ‘నానా ఇజాల అడుగున జూడ /నా ఇజందే కనిపించును జాడ’ అని చెప్పుకొంటాడు.
పలాయనవాదం మూడో మార్గంగా మనుషులు ప్రవర్తిస్తుంటారు. కానీ కాళోజీది అన్నింటినీ పట్టించుకొని అరిచి గీపెట్టి న్యాయం కోసం ధ్వనించే, పూరించే శంఖారావం.. అందుకే కాళోజీ లొల్లి నిరంతరం విశ్వమానవ యుద్ధరంగంలో శాంతి గానం చేసే ఆకాశమంత ఆశయ ఘంటారావం.
1946 లో నిజాం ప్రభుత్వపు దౌర్జన్యాలనూ, దారుణాలనూ కమ్యూనిస్టు పార్టీ నిషేధాన్నీ నిరసిస్తూ కాళోజీ తీర్పు అనే కవిత రాశాడు. అది ప్యూడల్ పాలన.. నేడు 75 ఏండ్ల ప్రజాస్వామ్య పాలన అయినా తీర్పు కవిత ప్రాసంగికత, వాస్తవికత ఏ మాత్రం తగ్గలేదు. ‘ప్రజా సంస్థపై పగసాధించిన / ఫలితము తప్పక బయటపడున్/ నిక్కుచునీల్గే నిరంకుశత్వము / నిల్వలేక నేల కూలున్ / చిలిపి చేష్టకై చిల్లి పొడిచినను / స్థిరమగు కట్టయు శిథిలమగున్…ఎట్టకేలకు గట్టి గోడలును / తట్టుకొనక భూమట్టమగున్ / కూర్చొనియున్న కొమ్మను నరికిన / కూలదెట్లు కొమ్మయుతానున్.. తానితరులకై తవ్విన గోతిలో / తనకే తెలియక దబ్బునకూలున్ అని హెచ్చరించారు.
హిరణ్యకశ్యపుడనేవాడే ‘రాజ్యం’ తన నామ మే జపించాలని తన వారసుడైన ప్రహ్లాదునిపై చేసినది హింస అయితే. ఆ హింసను ప్రతిఘటిస్తూ ప్రహ్లాదుని కోసం నరమృగమై వచ్చి తలపడి హిరణ్యకశ్యపుని సంహరించినది ప్రతిహింస అని ఉగ్రనరసింహున్ని సమర్థించినవాడు కాళో జీ! అన్యాయాన్నెదిరించినోడే తనకు ఆరాధ్యుడని స్పష్టంగా చెప్పిన కాళోజీది ఉద్రేక స్వభావమే. ఆ అంతరంగము ఆవేదనలతో రగులుతుండేదే.. ప్రేమించే ఆ మనిషికి కోపం కూడా తెలుసు మరి. లోకాన్ని నిద్రలేపే ఆ లొల్లి లోక శ్రేయస్సుకై నడిసంద్రములను సైతం ఈదుతుంది. అన్యాయాలనూ అరాచకాల నూ నిలదీస్తూ ఆధిపత్యాలను నిరసిస్తూ.‘జీహుజూర్ తత్వాన్ని’ తిరస్కరిస్తూ ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా అప్రతిహతంగా కవిత్వ బావుటానెత్తి మనిషే జెండాగా ఆవిష్కృతమయిన కాళోజీ తన కలల నేల తెలంగాణను ‘తెలంగాణ దేశమ్ము’ అంటూ ఆరాధించాడు, తెలంగాణ ప్రత్యేక ప్రాంతీయ సంస్కృతిని అనుసరించాడు. తన ప్రజల మానవహక్కుల కోసం కనుపాపలకు తాను కనురెప్పగ ఉండి తల్లి కోడిలా తన ప్రజను పొదువుకున్నాడు. ఆ మానవోత్తమ కవి కారణజన్మునికి శతవందనాలు!
-అనిశెట్టి రజిత
98494 82462