ఇప్పటికి నాలుగు శతాబ్దాల కిందట, సరిగ్గా లెక్క చెప్పాలంటే 422 ఏండ్ల కిందట 1620 ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన కంచర్ల గోపన్న తెలుగు సాహిత్యంలో మొదటి వాగ్గేయకారుడిగా, భక్త రామదాసుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన రచించిన దాశరథి శతకంతో సహా అనేక రచనలు నేటికీ అజరామరం. ఆబాలగోపాలాన్ని అలరిస్తున్న ఆయన కీర్తనలలో భక్తి రసంతో పాటు సామాజిక స్పృహ కూడా ఉన్నది. రామదాసు కీర్తనలు అనగానే కేవలం భక్తికి సంబంధించిన కీర్తనలే ఉంటాయని అనుకుంటాము.
భక్తితో పాటు సమాజంలో, మానవ జీవితంలో పాటించాల్సిన ఉన్నత విలువల గురించి కూడా ఆయన కీర్తనలు రచించారు. ఆధ్యాత్మిక సామాజిక వాగ్గేయకారుడిగా కూడా ఆయనను అభివర్ణించవచ్చు. రామదాసు కీర్తనలలో చాలా పాపులరైన ‘ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనవంశోత్తమ రామా! నా తరమా భవ సాగరమీదగ నళిన దళేక్షణ రామా!’,‘ పాహి రామప్రభో పాహి రామప్రభో’, ‘దాశరథీ కరుణాపయోనిధీ’ లాంటి కీర్తనలు ఆబాలగోపాలాన్ని సంగీతంతో నిమిత్తం లేకుండా అలరించాయి. వాటికి తోడు ఆయన రాసిన బాగా ప్రాచుర్యం పొందిన చాలా కీర్తనలలో సామాజిక స్పృహ కనిపిస్తుంది. రామదాసు కీర్తనలలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే వ్యాసం ఇది.
భక్తి సంగీతానికి ముగ్గురు రాజులు
తెలుగు వాఙ్మయంలో భక్తి సంగీతానికి రాజులు ముగ్గురు. అందులో పోతరాజుగా పిలువబడే పోతన, గోపరాజుగా పిలువబడే భక్త రామదాసు, మూడవ రాజు త్యాగరాజుగా చెప్పుకోవచ్చు. పోతన, కంచర్ల గోపన్న, త్యాగయ్య వీరు ముగ్గురు భక్తి సంగీతానికి రారాజులు. త్యాగయ్య తల్లి రామదాసు కీర్తనలు ఆలపించేదట. చిన్నప్పటి నుంచే త్యాగరాజు తన తల్లి ద్వారా రామదాసు కీర్తనలు వినడం వల్ల త్యాగయ్య ప్రభావితమై భక్తి కీర్తనలు రాశారని చెప్తారు. అందుకే త్యాగయ్యకు భక్త రామదాసు మార్గదర్శి అని అంటారు. రామదాసు ప్రభావంతోనే త్యాగయ్య రచనలు చేశారనే విషయం త్యాగయ్య కీర్తనల ద్వారా మనకు తెలుస్తుంది.
మెరుగు మాయని మేలిమి ముత్యాలు-రామదాసు కీర్తనలు.
రామదాసు అంటే భద్రాచలం, భద్రాచలం అంటే రామదాసు. సంస్కృతంతో పాటు పారశీ, ఉర్దూ, తెలుగు, భాషలలో రామదాసుకు మంచి ప్రావీణ్యం ఉన్నది. తానీషా పరిపాలనలో మంత్రులుగా పని చేసిన రామదాసు మేనమామలైన అక్కన్న, మాదన్న సిఫారసుతో ఆయన పాల్వంచ పరగణాకు తాసిల్దార్ గా నియమించబడ్డారు. భద్రాచలం కూడా పాల్వంచ పరగణాలో భాగమే. అక్కడి ప్రదేశాలు, సంఘటనలు తాను రాసిన కీర్తనల్లో ప్రతిబింబించే విధంగా రచనలు చేశారు. ఎప్పుడైనా తెలిసిన ప్రాంతాన్ని గురించి తెలి సిన వ్యక్తుల గురించి సాహిత్యం వస్తే మనం ఆసక్తిగా చదువుతాము. అందుకే ప్రజల భాషలో తన సాహి త్యాన్ని అందించారు. సాహిత్యం సామాన్య ప్రజలకు దగ్గరయ్యేలా ఉంటే అది ప్రజల నాలుకల మీద నాట్య మాడుతుంది. ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది. అం దుకని నాలుగు వందల సంవత్సరాలైనా కూడా రామ దాసు సాహిత్యం ఆయన కీర్తనలు మెరుగు మాయని మంచి ముత్యాలు లాంటివి. ఆయన కీర్తనలు నేటికీ అజరామరం. రామదాసు కీర్తనలు ఒక రాగంలో పాడాలని ఏమీ లేదు. అందుకే బాల మురళీకృష్ణ ఒక పాటను ఖర హర ప్రియ రాగంలో పాడితే అదే కీర్తనను మరొకరు వేరే రాగంలో పాడారు.
రామదాసు కీర్తనల లో సామాజిక సందేశం.
భజన సంప్రదాయ శైలికి ఆద్యుడు రామదాసు. అందుకే ఆయనను ప్రజాకవి అని కూడా అంటారు. మూఢ విశ్వాసాలను దునుమాడుతూ సామాజిక స్పృహ కలిగిన మంచి సాహిత్యం రాశారాయన.
‘స్వార్థ చింతన కలిగి ఘోరమైన పనులు చేస్తూ బతికే బతుకు కూడా ఒక బతుకేనా’ అని ఆయన ఒక కీర్తనలో అలాంటివారిని ఈసడించుకున్నారు.ఎదుటివారి పట్ల హింస చేయకుండా ఉండాలని, పరుల ధనము దోచకుండా ఉండాలని ఆయన తన కీర్తనల్లో ఉపదేశించారు. ‘అతిథి వచ్చి అన్నమడిగినంత అన్నంబింత ఇచ్చిన చాలు’ అంటూ ఆకలికి అన్నము, వేదనకు ఔషధము ఇవ్వాలని చెప్తారు. సమాజంలో మన శక్తికొలదీ పరులకు సహాయం చేయాలని ఎదుటి మనుషులకు ఎలాంటి హానీ చేయవద్దని ఉపదేశిస్తారు.
తెలిసీ తెలియకపోయినా ఎదుటివారికి ఎలాంటి పరిస్థితుల్లో నష్టం చేయకూడదని మరొక కీర్తనలో చెప్తూనే ‘అతిథి వచ్చి అడిగిన అన్నమింత ఇచ్చిన చాలు క్రతువు చేయవలెనన్న కాంక్ష ఏల?’ అంటూ ప్రశ్నిస్తాడు. ఉపవాసాలు కఠినమైన నియమాలు పాటించవలసిన అవసరం లేదని, అనవసర క్రతు వులను చేయాల్సిన అవసరం లేనే లేదని, పైన చెప్పి న పనులు చేస్తే మోక్షం దొరుకుతుందని ఆయన తన కీర్తనల్లో సామాజిక స్పృహను వెల్లడించారు.
‘నారాయణ అనరాదా నీ నాలుకపై ముల్లు నాటి ఉన్నదా’ అనే కీర్తనలో సమాజంలో పనికిరాని గాలి వార్తలు, వదంతులు వ్యాపింపజేయకుండా ఉండా లని చెప్తారు. హరి భక్తితో మెలగాలని అనవసర విష యాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన ప్రజలకు చుర కలంటించారు. గాలి వార్తలు ప్రసారం చేయకూడద ని ఆయన చెప్పిన విషయం చూస్తుంటే నేటి సోషల్ మీడియాకు ఇది పూర్తిగా వర్తిస్తుందనిపిస్తుంది.
మరో కీర్తనలో రామదాసు ‘లెస్స సంసారి అ య్యుండి’ అనే పద ప్రయోగం చేస్తారు. అందులో ఆయన చెప్పిన నీతి ఏమిటంటే సంసారంలో ఉండే ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడాలని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే సందేశాన్నిచ్చారు. సమా జాన్ని అర్థం చేసుకోవడానికి పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలని ఆ కీర్తనలో రామదాసు బోధిస్తారు.
‘రామ రామ అనే నోట రవ్వంత సేపైనా’ అనే కీర్తనలో ఉత్తములు ఈ శరీరం అశాశ్వతం అని తెలుసుకుంటారని అంటారు. అలాంటివారు జీవి తాన్ని తెలుసుకొని జీవిస్తారని రామదాసు అంటారు. స్నేహం చేసిన వారికి ద్రోహం చేయకూడదని, స్నేహ ధర్మాన్ని కూడా ఈ కీర్తనలో వివరిస్తారు. నమ్మిన వారిని మోసం చేయవద్దని చెప్పే ప్రయత్నం చేస్తారు. అలా ఒకవేళ ఎవరైనా చేస్తే యమదూతలు వచ్చి వారిని శిక్షిస్తారని కర్మ సిద్ధాంతాన్ని ఉపదేశిస్తారు. భౌతికమైన ఈ శరీరాన్ని పోషించడానికి డబ్బు వెంట పడి అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఉపదేశిస్తారు.
శ్రీరామ నామం మరువాం! మరువాం!సిద్ధమే యమునకు వెరువాం వెరువాం!అనే కీర్తనలో విష్ణు కథలు చెవుల విందాం! విందాం! వేరు కథలు మాకు మందం! మందం! రామదాసులు మాకు సారామ్! సారామ్! కామ దాసులు మాకు దూరం! దూరం! అంటూ ఇహ లోక సుఖాలను మాత్రమే చూసుకునే వారిని దూరం పెట్టమని ఈ కీర్తనలో చెబుతారు.నారాయణుని మేము నమ్మాం నమ్మాం.భద్ర గిరీశుని భద్రతతో మనం ఉందాం! ఉందాం!అంటూ ముగిస్తారు.
అసమానతలు కలిగిన ఈ సమాజంలో అందరూ మంచివారో, అందరూ చెడ్డవారో ఉండరని రామదాసు వివరిస్తారు. మిశ్రమ సమాజంలో మంచివారికి దగ్గరగా చెడ్డవారికి దూరంగా ఉండాలని బోధిస్తారు. సమాజంలో ఉన్నటువంటి విభిన్న మనస్తత్వాల గురించి ఒక కీర్తనలో చెప్తారు. అంతిమంగా మనం ఎంచుకున్న లక్ష్యాన్ని మరిచిపోవద్దని ఈ కీర్తనలో ఆయన మార్గం చూపిస్తారు.
రామదాసు కీర్తనల్లో భావం, భాష ఒకదానితో ఒకటి పోటీపడుతూ సాగుతాయి. ఆయన వేదాంత తత్వం చెప్పేటప్పుడు ‘పోయేటప్పుడు ఒక పూచిక పుల్ల కూడా వెంట రాదని’ ఒక కీర్తనలో చెప్తాడు.
పన్నుల వసూళ్లకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న రామదాసు.
గ్రామాల్లో భజన మండలుల ఏర్పాటుతో పాటు, వివిధ కళా రూపాల ద్వారా ప్రజలను ఉత్తేజి తులను చేసి ప్రభుత్వానికి చెల్లిం చాల్సిన పన్నులను వసూలు చేసిన చరిత్ర కూడా రామదాసుకు ఉన్న ది. తాను తాసిల్దార్గా ఉన్న గ్రామా ల్లో తిరిగి తన ఆధ్యాత్మిక భజనల ద్వారా పన్నుల చెల్లింపునకు ప్రజ లను మానసికంగా సమాయత్తం చేశారు. మనం చివరికి వెంట తీసుకుపోయేది ఏమీ లేదని, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టవద్దని ప్రజలను పన్నులు కట్టడానికి మోటివేట్ చేస్తారు. గ్రామాల్లో భజన మండళ్లను స్థాపించి వాటి ద్వారా సామాన్య ప్రజల్లో సైతం నైతిక విలువలను పెంచే ప్రయత్నం చేశారు. లోకో భిన్నరుచి అని అంటారు. మనం చేసే పనులు కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అలాం టి వారితో స్థితప్రజ్ఞతతో వ్యవహరించి మంచి స్వీక రించమని, చెడును ఎలాంటి శషభిషలు లేకుండా తిరస్కరించమని మనల్ని కార్యోన్ముఖులను చేస్తారు.
రామదాసు తాను రాసిన మరొక కీర్తనలో మన తప్పులను ఎంచేవారు ఎప్పుడూ మనకు విరోధులు కారని చెప్తారు. మన లోపాలను ఎత్తి చూపు తున్నా రంటే మనల్ని మనమే సరిచేసు కోవడానికి అవకాశం వారు ఇస్తున్నారని అర్థం చేసుకోవాలని అంటారు. వారి విమర్శల వల్ల మనం మన జీవితాన్ని సరి చేసుకునే అవకాశం మనకు కలుగుతుందని చెప్తారు. అందుకే రామదాసు కీర్తనల్లో భక్తి మాత్రమే లేదు భక్తి మార్గం దారిలోనే అంతస్సూత్రంగా సామాజిక స్పృహను కూడా అంతర్లీనంగా జోడించి ఆయా కీర్తనల్లో మనకు సామాజిక సందేశాన్ని ఇమిడ్చి తన కీర్తనలు రచించారు.
యద్భావం తద్భవతి అన్నా రు పెద్దలు. మనం ఏ రకంగా భావిస్తామో అదే మనకు లభిస్తుంది. అలాగే రామదాసు కీర్తనల్లో భక్తిరసంతో పాటు సామాజిక అంశాలను కూడా మనం స్వీకరిస్తే నేటి తరానికి భక్త రామదాసు బోధనలు మరింత దగ్గరగా చేరవేయవచ్చు.
– బండారు రామ్మోహనరావు 98660 74027