ఒక శతజయంతి సంచికగా ప్రారంభమైనప్పటికీ ‘శతవసంతాల సీతారామం’ చదువుతుంటే అది కేవలం ఒక వ్యక్తి స్మరణ పుస్తకంగా మిగలదు. ఇది ఒక మనిషి చుట్టూ ఏర్పడిన ప్రేమ, విలువలు, సాహిత్య చైతన్యం, మానవ సంబంధాల సజీవసాక్ష్యంగా నిలుస్తుంది. ఈ సంచికలోని జ్ఞాపకాలు, కవిత్వం, కథనాలు, సంభాషణలు అన్నీ కలిసి ఆవంచ సీతారామారావు బహుముఖ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి.
ఈ సంచికకు జ్ఞాపక రచనలు ప్రధానమైన సాహిత్య బలం. ఇవి కేవలం గతాన్ని గుర్తుచేసుకోవటం కాదు, జ్ఞాపకాన్ని ఒక సృజనాత్మక అనుభూతిగా మలుస్తాయి. ప్రేమతో జీవించినవారు ఎప్పటికీ దూరం కారు. వారు తమ జ్ఞాపకాలు, విలువలతో అందరి హృదయాల్లో జీవిస్తూనే ఉంటారు అనే భావన ఈ పుస్తకంలోని అంతఃస్వరాన్ని తెలియజేస్తుంది. కుటుంబ సభ్యుల రచనల్లో ఆయన ఒక పెద్ద మనిషిగా మాత్రమే కాకుండా తండ్రిలా అండగా నిలిచిన వ్యక్తి, ప్రేమను పంచిన మార్గదర్శిగా కనిపిస్తారు.
కథన శైలి ఈ సంచికకు జీవాన్ని అందిస్తుంది. ఇక్కడ పెద్ద చారిత్రక సంఘటనల కంటే చిన్న చిన్న అనుభవాలే సాహిత్య విలువను పొందాయి. చెర్లపల్లి బాల్యజ్ఞాపకాలు, కుటుంబ సమాగమాలు, చిన్ననాటి అనుబంధాలు ఒక కాలపు కుటుంబ సంస్కృతిని పునర్నిర్మిస్తాయి. ఆ పిలుపులో గౌరవం, ప్రేమ, అనుబంధం ఉండేవి అనే భావం ఒక చిన్న సంభాషణను కూడా మానవ సంబంధాల ప్రతీకగా మారుస్తుంది. వ్యక్తిత్వ చిత్రణకు ఈ పుస్తకంలోని సంభాషణలు అత్యంత సహజమైన సాధనాలుగా నిలిచాయి. సీతారామారావు ఆలోచనల్లోని ఆధునికత ఒక చిన్న మాటలోనే వ్యక్తమవుతుంది
కవిత్వ దృష్టిలో ఈ సంచిక ఒక వ్యక్తిని స్తుతించటం కంటే, ఆయన జీవించిన విలువలకు అక్షర రూపం ఇస్తుంది. రచయిత, భావుకుడు, విలువల సారాంశ వ్యక్తిత్వంగా చూడటం ద్వారా ఆయన జీవితాన్ని తెలంగాణ సాంస్కృతిక చరిత్రతో అనుసంధానిస్తుంది. సాహిత్య విమర్శ దృష్టితో చూస్తే, శతవసంతాల సీతారామం గొప్పతనం ఒక వ్యక్తిని మహోన్నతుడిగా ప్రకటించడంలో లేదు. ఒక మనిషి ప్రేమ, వినయం, జ్ఞానం, మానవత్వం ద్వారా ఎన్ని హృదయాల్లో చిరస్థాయిగా నిలువగలడో చూపించటంలో ఉన్నది. అందుకే ఈ సంచిక ఒక జీవిత చరిత్ర కాదు, జ్ఞాపకాలు కవిత్వంగా, అనుభవాలు కథలుగా, మాటలు విలువలుగా మారిన మానవీయ సాహిత్య పత్రం.
– పండరినాథ్ ప్రభల