ఈ నెల 30న గుంటూరు శేషేంద్ర శర్మ వర్ధంతి
‘ఈ రక్త ప్రవాహం కావాలి.
కానీ అందులో కొందరు పడవలు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు.
కీర్తి శిఖరాలకు.
వాళ్ల లక్ష్యం కీర్తి శిఖరాలే గాని ఈ రక్తం ఎవరిదో, ఎవరి కోసం కారిందో వారి క్షేమం కాదు.
వాళ్లు తమ రక్తం ఒక్క బొట్టు కూడా కార్చరు.
పరాయివాళ్ళ రక్తం పారితే పాటలు రాస్తారు..
నేను చచ్చిపోవడం మంచిదే అయ్యింది.
చచ్చిపోతూ ఈ నీచుల తమాషా
చూస్తూ ఉండవచ్చు.
నాకేం కావాలి?
నా పాటల్ని పూలు పక్షులు గానం చేస్తాయి, గాలులు, ఆకాశాలు దూర తీరాలకు మోసుకుపోతాయి.’
‘ఆధునిక మహా భారతం’లోని మయూర పర్వంలో తన ఆవేదన, ఆవేశం అంటూ ‘నీచుల తమాషా’ గురించి పై విధంగా రచించారు శేషేంద్ర శర్మ. పాటలైనా, కవిత్వమైనా మనసు లోతైన ఆలోచన ఇస్తుంది. కాసేపు మనసులో చూసుకొని మనసునే మరోసారి అవునా, అవుననుకుంటా అని అనుకునే ఆలోచన కనబడుతుంది. ఈ సినీ గీతాన్ని వినండి, చదవండి.
‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది’
ఒకే ఒక్క సినీ గేయం రచించారు ఈ మహానుభావుడు. ఎంత లోతుకి దిగి ఆలోచన చేసుకుంటాడో. ఏమనుకుంటాడో. పాట ఒకటి వచ్చింది అంటే చాలు. అర్థం చేయడానికి. కమ్మటి కలం ఇచ్చింది అనే భావన కళ్లముందు కనబడుతుంది కదా.
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసిందీ
ముగ్గులు వేస్తుంది ఈ భావన. దీపమై వెలుగుతుంది. ఏ వేణువైనా శూన్యంలోనే ఉంటుంది కదా? కనుక ఆ శూన్యంలో స్వరాలు కలుపుతున్నాయి. ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది. ఆ మాటలు మాట్లాడుకుంటాయి. ఆశలు ఆకులు, దిగులు రాలిపోయేవి. ఆమనిని తెప్పిస్తుంది. అది అడవి. అందులో ఏదో ఆశ. ఆకాశంలో నుంచి నదికి దిగి అక్కడ నదీతీరాన నిలబడి ఒక పడవ వస్తుందని, ఎవరైనా వస్తారా అనీ, వస్తే బాగు అనుకుంటా వచ్చి తీరుతుందనే నమ్మకం…
విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా!
గగనంలో మబ్బుల్లారా!
నది దోచుకుపోతున్న నావను ఆపండీ!
రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ!
అక్కడే గుమ్మంలోనే కోర్కెలు వేళ్లాడుతున్నా యి. అవి విఫలమైనాయి. ఆశలు వస్తాయా రావా, వినబడతాయా లేదా. పక్షులారా అని పిలుస్తున్నాయి. మబ్బుల్ని రమ్మంటున్నారు. నది దోచుకుంటున్నది. నావను ఆపాలి. రేపు అక్కడే ఏడస్తున్నది బావురుమని. ఇది మేఘ సందేశం కాదు. నదీ సందేశం. నావకు సందేశం. భావగీతికా సందేశం. ఇంకా వస్తారు అనే ఆశే బతికిస్తుంది, రచయితను, గేయానికి స్వర రచయితకు. కథానాయికకు బతికిస్తుంది. ఎంత గంభీరమైన, స్పష్టమైన, లోతైన, గాఢమైన కనబడని, వినబడని, ఈ భూమి నుంచి ఆకాశం దాకా వినబడేట్టు అరుస్తున్నట్టు స్పష్టంగా చెప్పగలిగిన కవి ఎవరు?
మాడభూషి శ్రీధర్