ఈ అమ్మలు.. ఆదితాళం అంతరించిపోకుండా నడుంబిగించారు.అనాది వాయిద్య కళకు ప్రాణం పోసేందుకు గజ్జెకట్టి చిర్రె, చిటికెనతో బరిలోకి దూకారు. ‘ఝూం తక్ నకనఖ్.. ఝూం తక్ నకనఖ్.., ధన్నాక్ మిన్నాక్.. ధన్నాక్ మిన్నాక్, తరిగిడ తరిగిడ.. తరిగిడితా’ అంటూడప్పు వరుసలపై పట్టు సాధించారు. ‘జజ్జనకరి జనారె..’ శబ్దాలకు లయబద్ధంగా చిందులేస్తున్నారు. కదనానికి కాలు దూసినట్లు.. కణకణ మనే చెణుకులు తీస్తూ.. అబ్బురపరుస్తున్నారు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలానికి చెందిన మహిళా డప్పు వాద్యకారులు.
అది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక.. ఆ రోజు రాజ్భవన్ దేదీప్యమానంగా వెలుగుతున్నది. చుట్టూ వందలమంది.. వేదిక పక్కనే అతిథులు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలు. ఆ పక్కనే గరిడేపల్లి మండలానికి చెందిన మహిళా డప్పు బృందం. వ్యాఖ్యాతల నుంచి పిలుపు వచ్చిన వెంటనే.. వేదికమీదికి దూసుకెళ్లారు. వారు కొట్టే డప్పు దరువు.. గజ్జెకట్టి ఆడే చిందు, ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చూసి కరతాళ ధ్వనులు మారుమోగుతున్నాయి. కాలిపాదాలు లయబద్ధంగా చప్పుడు చేస్తున్నాయి. ఆ ప్రశంసలకు ఆ కళామతల్లుల కండ్ల వెంట ఆనంద బాష్పాలు. కారణం.. ‘మొగుళ్లను, పిల్లలను వదిలేసి ఈ డప్పులేంది? ఈ తిరుగుడేంది? ఆ గెంతుడేంది?’, ‘నువ్ కులంకాని కులంల జేరి, అట్ల డప్పు కొడుతుంటే మనోళ్లు మస్తు బాధవడుతుర్రు’, ‘చెక్క బజన్లు పోయినయ్.. కోలాటాలు పోయినయ్.. ఇప్పుడు డప్పుకొచ్చిందా యవ్వారం’.. ఇలాంటి ఎన్నో సూటిపోటి మాటలతో చిల్లులు పడిన గుండెలకు ఆ చప్పట్లు ఊరటనిచ్చాయి. ఆ రోజు సామాజిక మాధ్యమాలు, న్యూస్ చానెళ్ల ద్వారా ఆ కార్యక్రమాన్ని వీక్షించిన గరిడేపల్లి చుట్టుపక్కల గ్రామాల మగవారి నోళ్లు దెబ్బకు మూత పడ్డాయి. ‘శెభాశ్ మనూరి పేరు నిలబెట్టారు.. డప్పు కళకు కొత్త ఊపిరులిచ్చారు’ అంటూ గేలి చేసిన నోళ్లే పొగుడుతుంటే ఆ కళామతల్లులు సంబురంతో పొంగిపోయారు. అదో జీవితకాల జ్ఞాపకం.
వాద్యకళ సారథులుగా..
వీళ్లంతా పొలం పనులు చేసుకుంటూ.. రేల పాటలు పాడుకునే సాధారణ మహిళలు. ఒకప్పుడు గరిడేపల్లి మండలంలో డప్పు కళ ఓ వెలుగు వెలిగింది. పుట్టుక నుంచి చావు వరకు ఏది జరిగినా డప్పు దరువు వినిపించాల్సిందే. అలాంటిది తోలు డప్పులు అంతరించినయ్. డప్పులు కొట్టేవారే కరువయ్యారు. నాడు వందల సంఖ్యలో ఉన్న డప్పు కళాకారులు నేడు పదుల సంఖ్యలోకి వచ్చారు. పొలం పనుల సమయంలో అంతరించిపోతున్న ఈ కళ గురించి చర్చించేవాళ్లు. సేద్యం పనులకు ముఠాలు కట్టినవారే.. డప్పు కళను బతికించుకునేందుకు కూడా బృందాలుగా ఏర్పడే ఆలోచన చేశారు. ఉన్న ఊరి నుంచి పొరు గూరికి పొలం పనులకు వెళ్లినప్పుడు కూడా ఇదే చర్చ. ఆ చర్చల్లో భాగమైన పొరుగూరి స్త్రీలు కూడా డప్పు బృందాలుగా ఏర్పడాలని నిర్ణయించారు. డప్పు నేర్పే గురువుల కోసం వెతుకుతున్న క్రమంలో గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీశ్ తారసపడ్డారు. అంతరించిపోతున్న కళను బతికించు కోవాలని తపిస్తున్న సతీశ్కు.. నిండైన ఉత్సాహంతో ఉన్న మహిళల నుంచి పిలుపురావడంతో ఉచితంగానే డప్పు కళ నేర్పేందుకు ఒప్పుకొన్నారు.
ఉదయం కూలి.. రాత్రి విద్య ఈ మహిళలంతా ఉదయం కూలిపనులకు వెళ్లి.. రాత్రిపూట డప్పు నేర్చుకునేవారు. పీటలు, చెక్కలపై మొదలైన ప్రస్థానం.. నేడు రాజ్భవన్, రవీంద్రభారతి వేదికలపై ప్రదర్శించే స్థాయికి చేరింది. తమ భర్తల సహకారంతో విద్య నేర్పే గురువుకు వంతులవారీగా భోజనం ఏర్పాట్లు చేసేవారు. చెమ టోడ్చిన కష్టం నుంచి మిగిలిన సొమ్మును గురుదక్షిణగా ఇచ్చేవారు. ఒక ఊరితో మొదలైన ఈ డప్పు కళ ప్రస్థానం.. క్రమంగా చుట్టుపక్కల గ్రామాలకూ పాకింది. కులాలకు అతీతంగా మహిళలు డప్పు కళను నేర్చుకునేందుకు ముందుకొచ్చారు. ఒక్కో గ్రామం నుంచి సుమారు 20 మంది వరకు మహిళలు డప్పు విద్యను నేర్చుకున్నారు. రాత్రి నేర్చుకున్న విద్యను.. వరుసలను ఉదయం పనుల్లో వల్లెవేసేవారు. క్యారేజీలపై దరువులు ప్రాక్టీస్ చేసేవారు.
8 గ్రామాల నుంచి..
డప్పు కళను ఇప్పటివరకు పురుషులే అభ్యసించారు. అయితే, అంతరించిపోతున్న కళను బతికించుకునేందుకు, దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు డప్పు గురువు సతీశ్ తొలి సారిగా పురుషులకు దీటుగా మహిళా డప్పు బృందాన్ని తయారుచేశారు. వీరిలో కోలాటాలు నేర్చుకునే మహిళలు సైతం, కుల మతాలకు అతీతంగా జతకలవడంతో అనతి కాలంలోనే గరిడేపల్లి మండలంలోని ఎనిమిది గ్రామాల నుంచి సుమారు 200 మంది మహిళా డప్పు వాయిద్యకారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక బృందంగానూ ఏర్పడ్డారు. హైదరాబాద్లోని ప్రముఖ డప్పు ఆర్టిస్టు అందె భాస్కర్ వీరికి ప్రోత్సాహం అందిస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ.. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రోత్సహిస్తున్నారు. ఆ గౌరవానికి, గుర్తింపునకు మురిసిపోయి.. స్వయంగా భర్తలే డబ్బులిచ్చి ప్రోగ్రాములకు పంపుతున్న సంఘటనలూ ఉన్నాయి. సమయానికి తిన్నా.. తినకపోయినా కళను బతికించాలనే ఆశయం నరనరాన కనిపిస్తున్నదా నారీమణులలో! ఆ తపనే డప్పు కళకు పట్టం కట్టేలా చేసింది.
సాంస్కృతిక సారథి ద్వారా గుర్తిస్తే మేలు
సమాచారానికి, సంబురానికి ప్రతీక డప్పు. దరువు చెవినపడితే.. కాళ్లు తాళం వేస్తాయి. అప్రయత్నంగా ఒళ్లు పరవశిస్తుంది. కొందరికి శిగమొస్తుంది. అంత గొప్పకళ మాకు అబ్బింది. కళను బతికించాలన్న మా పట్టుదలే అందుకు కారణం. మా కంఠంలో ఊపిరున్నంత వరకు డప్పు కళను బతికిస్తాం. మా పిల్లలకు కూడా నేర్పి, బాల దళాలను తయారుచేస్తున్నాం. అయితే, మాకు ప్రభుత్వం తరఫున మరింత ప్రోత్సాహం ఉంటే మంచిగుంటది. సాంస్కృతిక సారథి నుంచి కొలువులిప్పిస్తే ఎంతో మేలు జేసినోళ్లు అవుతరు. మా బిడ్డలకు కూడా ఢోకా ఉండదు. సీఎం సారు దృష్టిపెడ్తరని ఆశ.
-అమరవరపు సంతోష, పరెడ్డిగూడెం గ్రామం, సూర్యాపేట జిల్లా
-రవికుమార్ తోటపల్లి
చిన్నయాదగిరి గౌడ్