Mother’s Day | శివపంచాక్షరి కన్నా మిన్న ఆ నామం. అష్టాక్షరీ కంటే శ్రేష్ఠం ఆ మంత్రం. హిందీలో ఏకాక్షరీ (ప్రణవం). తెలుగులో రెండక్షరాల పిలుపు… అదే అమ్మ! జనన మరణాలు లేని ఆ శ్రీహరి మాతృమూర్తి ప్రేమ కోరే మానవుడిగా అవతారం దాల్చాడంటే అతిశయం కాదు. వామనుడిగా వచ్చి అదితి ఆదరణ చూరగొన్నాడు. రామయ్యగా అవతరించి కౌసల్య పొత్తిళ్లలో ఆడుకున్నాడు. ఒక తల్లి వాత్సల్యం సరిపోదనుకున్నాడో ఏమో.. కృష్ణమూర్తిగా పుట్టి దేవకి, యశోదల గారాలపట్టి అయ్యాడు. దైవాన్ని సైతం అబ్బురపరిచే అమృతత్వం అమ్మది. అందుకే సృష్టికి ప్రతిసృష్టి చేసే అమ్మకు తొలి వందనం అంకితమిచ్చారు.
గర్భవాసం దుర్భరం అని చెబుతుంది పురాణ వాఙ్మయం. పాపపుణ్యాల లెక్కలు తేల్చుకొని ఓ గర్భంలో పడగానే ఆ జీవి తల్లడిల్లుతాడట. తనను మోస్తున్న తల్లి నవమాసాలూ పడే యాతన కన్నా.. గర్భస్థ శిశువు అనుభవించే వేదనే ఎక్కువట! పూర్వజన్మ వాసనల వల్ల మళ్లీ పుట్టడానికి అనుక్షణం జంకుతుంటుందట! అమ్మకు కాన్పు కాగానే.. బిడ్డ ఏడుపు మొదలు. బొడ్డు పేగు తెగడంతోనే కొత్త జన్మ ప్రారంభం. ఇన్నాళ్ల బాధలన్నీ.. అమ్మ చేతి స్పర్శతో మాయం. మాతృమూర్తి తనను గుండెలకు హత్తుకున్న క్షణంలో శిశువు హమ్మయ్య అని ఊపిరి తీసుకుంటుంది. అమ్మ స్పర్శ మహిమ అది. ఈ లోకానికి తొలి వాకిలి అమ్మే! ఆమె చల్లని చూపుతోనే మరో మేలైన జన్మ మొదలవుతుంది.
అమృతానికి, అర్పణకు అసలు పేరు అమ్మ
అనుభూతికి, ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ
ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మ
ఈలోకమనెడి గుడిజేరగ తొలివాకిలి అమ్మ
అమ్మ గొప్పదనాన్ని చెబుతూ సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన పద్యమిది. ఇందులో ప్రతి పాదమూ ప్రపంచాన్ని అమ్మకు పాదాక్రాంతం చేస్తుంది. ‘ఈ లోకంలోకి ప్రవేశించడానికి తొలివాకిలి అమ్మ’ అన్న ప్రయోగం ఈ సుకవి మాతృమూర్తికి చేసిన సిసలైన నమస్కృతి!
తల్లి పెంపకం ఎంత ఇంపుగా ఉంటే పిల్లల పెంపు అంత సొంపుగా ఉంటుంది. ఆర్యాంబ ఆలనాపాలనా శంకరుణ్ని… ఆదిశంకరుడిగా, జగద్గురువుగా తీర్చిదిద్దింది. ప్రపంచంలోని ఏ బంధానికీ చిక్కుబడని శంకరాచార్యులు అమ్మకు మాత్రం కట్టుబడ్డాడు. సన్యాసాశ్రమ నియమాలు పక్కనపెట్టి అవసాన దశలో ఉన్న తల్లి చెంతకు చేరుకుంటాడు. తనకు జన్మనిచ్చి, బుద్ధినిచ్చి, లోక కల్యాణానికి పురిగొల్పిన తన మాతృమూర్తికి తానే స్వయంగా ఉత్తరక్రియలు నిర్వహిస్తాడు. ఈ సందర్భంగా తన తల్లిపై మమకారంతో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు ‘మాతృపంచకం’గా లోక ప్రసిద్ధి చెందాయి.
శ్లో॥ ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుతత్వం
ఇత్యుక్తవత్యా స్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కం
‘అమ్మా! నీవు… నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా ఉండాలి. అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు’ అని తన తల్లిని వేడుకున్నాడు. మరోశ్లోకంలో ‘ఎంతటి గొప్పవాడైనా తల్లి రుణం తీర్చుకోగలడా?’ అని కీర్తించడం మహిని అమ్మను మించిన మహిమగల మనసు లేదని చాటిచెబుతుంది. అపర శంకరుడిగా భువిపై అవతరించిన ఆదిశంకరులు మరో శ్లోకంలో ‘నాయందు దేనితో సమానం కాని దయను చూపించు తల్లీ!’ అని వేడుకున్నాడంటే ‘మాతృదేవోభవ’ అన్న వేదోక్తి ఎంత నిక్కమైనదో తెలుస్తుంది.
అమ్మ యనంగ సకలాత్మల కామెయె కన్నతల్లి లో
కమ్మున నున్న భూతముల కమ్మని పాలిడి పెంచు తల్లి దై
వమ్ముల కాదిదైవమయి భాసిలు నోంకృతి శబ్దమందు నా
యమ్మ పదాబ్జయుగ్మమ్ము హృదంతరపీఠిక నుతింతు నెప్పుడున్
అష్టావధాని త్రిగుళ్ల రాధాకృష్ణశర్మ రాసిన పద్యమిది. లోకంలోని సకల జీవులను పాలించే తల్లి దైవాలకే ఆది దైవమనీ, ఓంకారంలో భాసిల్లుతుందనీ కవి భావన. అలాంటి తల్లి పాదాలను తన హృదయంలో నిలిపి, సదా పూజిస్తానని హృద్యంగా ప్రస్తావించారు.
తన రక్తాన్ని పాలధారలుగా చేసి బిడ్డకు ఆకలిని తీర్చే తల్లి… దైవాలకు దైవమే కదా! సృష్టిలోని ఏ పదార్థంలోనూ లేనన్ని పోషకాలు తల్లి పాలలో ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా! తన అందం పలుచబడుతుందనీ, ఆహార్యం రూపు మారుతుందని అమ్మ అనుకుంటే.. బిడ్డలు అర్ధాకలితో మాడాల్సిందే! కానీ, చంటిపాప ఏడవగానే పరుగున వచ్చి గుండెకు హత్తుకుంటుంది అమ్మ. మెరుపు వేగంతో తన స్తన్యాన్ని బిడ్డకు అందిస్తుంది. తల్లి ఆదరణే కదా బిడ్డకు ఆదరువు. అమ్మ అన్న పిలుపులో ఉన్న గొప్పదనాన్ని ఓ అజ్ఞాత కవి రాసిన కమ్మని ‘అమ్మ’ పద్యం.. లోకాలకు తల్లిని మించిన ఊతం లేదని చాటి చెబుతుంది.
అమ్మ యనెడి రెండగు వ
ర్ణమ్ములు విలసిల్లు గద ధర నిటుల; పలు లో
కమ్ముల కమ్మయె యూతము;
అమ్మను మించిన యమృతము యవనిన్ గలదే!
తల్లిని మించిన దైవం లేదనే కవితలు కోకొల్లలు. అమ్మ ఆర్తిని వివరించే సినీగీతాలూ ఎన్నెన్నో! మన మాతృభాషకు ప్రత్యేకమైన ఛందోరస పద్యాలు అమ్మకు అంకితమిస్తే.. కలిగే ఆనందం వీటన్నిటికన్నా ఓ మెట్టు పైనే ఉంటుంది. ఆనందాలను మనకు పంచడానికి అమ్మ ఎన్నో బాధలను సంతోషంగా భరిస్తుంది. అంతటి ఓరిమి గల తల్లి భూమ్మీద దైవమే. అమ్మ ప్రత్యేకతను చాటుతూ రచయిత్రి రావూరి వనజ రాసిన పద్య కుసుమం ఇది…
బాధలెన్ని యున్న భరియించి మాయమ్మ
గుండెలోన దాచుకొనెడి దెపుడు
బయట పెట్టకుండ భాసిల్లుచుండెను
అవనిలోన దైవ మగును జనని
అమ్మ మనసును ఎంత గొప్పగా చెప్పిందో కదా! ఒక కూతురుగా, ఇల్లాలుగా తన అసహనాన్ని వ్యక్తపరచ డంలో స్త్రీమూర్తి వెనుకాడదు. అలాంటి సమయం లోనూ ఇక తప్పదు అనుకుంటే తప్ప తన గళం వినిపించదు. కానీ, అదే స్త్రీ ఎప్పుడైతే అమ్మ పాత్రలోకి అడుగుపెడుతుందో.. ఆమె మనస్తత్వం వింతగా మారిపోతుంది. తన బిడ్డ దగ్గర ఎంత నిదానంగా ఉంటుందో.. ఆ బిడ్డ కోసం అంత ప్రమాదంగానూ మారుతుంది. అమ్మలో అబ్బురపరిచే కోణమిది.
రామాయణంలో కైకేయి రెండు వరాలు కోరింది తన కొడుకైన భరతుడి కోసమే! చరిత్ర తనను దోషిగా చూస్తుందన్న నిజం తెలిసి కూడా ఆమె తనలోని మాతృప్రేమకు లొంగిపోయింది. అదే సమయంలో సౌమ్యురాలు కౌసల్య తన సవతి కైకేయిని కర్కశంగా నిందిస్తుంది. భరతుడికి పట్టం కట్టినా ఫర్వాలేదు.. తన బిడ్డ అయిన శ్రీరాముణ్ని అయోధ్యలో దాసుడై ఉన్నా తనకు సమ్మతమే అని వేదన చెందుతుంది. ‘నా కొడుకు బిచ్చమెత్తుకొని జీవించినా… నా కండ్లముందు ఉంటే చాలు’ అని పరిపరి విధాలా శోకితురాలు అవుతుంది. తన బిడ్డలు యోగ్యులు కావాలని ప్రతి తల్లీ ఆరాటపడుతుంది. అందుకోసం తను రెక్కలు ముక్కలు చేసుకుంటుంది. కారణమేదైనా బిడ్డ తనను విడిచి వెళ్తున్నాడంటే మాత్రం ఆ మాతృ హృదయం అంత తేలిగ్గా ఒప్పుకోదు. పక్క ఊరి బడిలోకి వెళ్తున్నా, కొలువు కోసం దేశాంతరాలు దాటుతున్నా.. తల్లికి తగని ఆరాటం. పిల్లలు వృద్ధిలోకి వస్తున్నారన్న ఆనందం కన్నా.. తన కండ్లముందు ఉండరన్న సత్యం ఆమెను కలవరపెడుతుంది. రామాయణంలో కౌసల్య పరిస్థితే కాదు.. లోకంలోని అమ్మలందరి ఆరాటమూ ఇదే!
అమ్మ మనసు కాశీ గంగ కన్నా పవిత్రం, హిమవన్నగం కన్నా ఉన్నతం. కడుపున పడి కాలదన్నినా జన్మనిస్తుంది. సృష్టిలోని అత్యంత విలువైన సమయాన్నీ, ఆరోగ్యాన్నీ మన కోసం ధారపోస్తుంది. అలాంటి అమ్మ వైభవాన్ని చాటిచెప్పే మరో పద్యంతో ఈ మాతృవందనాన్ని పరిసమాప్తి చేసుకుందాం..
పొట్టను రూపమిచ్చి, పలు పోటుల నోర్చుచు తొమ్మిదిన్ నెలల్,
గట్టిగ వచ్చు నొప్పులను కాదనకుండ సహించి, బిడ్డకున్
పెట్టియు జన్మ భిక్ష, తగు పేరిడి, ప్రేముడి పంచి పెంచి తా
పట్టుచు పాలు, బువ్వ, గుణవంతుగ దీర్చెడి తల్లి! నీకు జై!
ఆచార్య ఫణీంద్ర రాసిన పై పద్యం అమ్మకు ఘనమైన నివాళి. తల్లి పురిటినొప్పులు కాదనుకుంటే మనకు జన్మలేదు. పాలు పట్టకపోతే మనకు ఆరోగ్యం లేదు. పెంపకం గాలికొదిలేస్తే బతుకు లేదు. సత్సంతానం కలగాలని దేవుణ్ని మొక్కి మనకు మంచి జన్మను ప్రసాదించిన అమ్మకు జై! మన కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్న అమ్మకు జైజై!!
మాతృత్వపు మాధుర్యాన్ని తెలిపే పురాణ పాత్రలు ఎన్నో ఉన్నాయి. అందులో మన్నికైనది యశోద. చిన్ని కృష్ణుడి చిలిపి పనులకు ఆమె ప్రత్యక్ష సాక్షి. బుడిబుడి అడుగుల నాడే బాలకృష్ణమూర్తి బరిలోకి దిగిన వైనాన్ని చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయేది. అల్లన మెల్లన నల్ల పిల్లిలా వెన్నను దొంగిలిస్తున్న నల్లనయ్యను చూసినప్పుడు ఆమెకు కోపం వచ్చేది కాదు! తన నందలాల లీలల్ని తనివితీరా ఆస్వాదించేది. మురళీకృష్ణుడి వేణు గానామృతానికి రేపల్లెలోని ఇంతులంతా ఇంటి ముందు వాలిపోయేవారు. అంతమంది సుందరుల కన్నులు తన కన్నయ్య మీద పడితే దిష్టి తగులుతుందేమో అని కలవరపడేది యశోద. తనను చాటుగా ఉంచి.. తరుణులను తరలి వెళ్లమని హెచ్చరించేది. ఆకతాయి కృష్ణుడి అల్లరి పనులను ఫిర్యాదు చేయడానికి వచ్చిన పడతులను వాకిట్లోనే నిలబెట్టి కడిగేసేది. ‘నా బిడ్డడు పసికూన.. వాడిపై నిందలేస్తే ఊరుకోను సుమా..’ అని సుతిమెత్తగా హెచ్చరించేది. ఈ వైనాన్ని పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు..
కం॥ ‘చన్ను విడిచి చనఁడిట్టటు
నెన్నఁడుఁ బొరుగిండ్ల త్రోవ లెరుఁగడు నేఁడుం
గన్నులు దెరవని మా యీ
చిన్ని కుమారుని రవ్వసేయందగునే?’
‘నా కొడుకు నా ఒళ్లో కూర్చుని చన్నుపాలు తాగడం తప్ప నన్ను విడిచి ఎన్నడూ పక్కకైనా పోడు. మా కన్నయ్యకు ఇంకా పొరుగిళ్లు, తోవలు తెలియవే. ఈ నాటికీ కళ్లు కూడా సరిగా తెరవని పసివానిని పట్టుకొని ఇలా నిందలు వేయడం మీకు తగునా?’ అని వారిని నిలువరించింది. అంతేకాదు, ‘మావాడిపై నిందలు మోపడం మాని మీరు మీ ఇండ్లకు వెళ్లిపోండి..’ అని చురకలంటించింది. అమ్మ ప్రేమ బిడ్డడిపై నింద పడనిస్తుందా! చెప్పండి.
– కణ్వస