లక్నో: మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిన సంఘటనలో 12 ఏండ్ల బాలుడు మరణించాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియనీయకుండా గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాట్వర్ గ్రామానికి చెందిన మోను ఆరవ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం మొబైల్ ఫోన్ బ్యాటరీని ‘జాడూ చార్జర్’లో ఉంచి చార్జింగ్ చేశాడు. గంట తర్వాత బ్యాటరీ చార్జింగ్ అయ్యిందా లేదా అన్నది పరీక్షించేందుకు నాలుకతో టచ్ చేశాడు. వెంటనే ఆ బ్యాటరీ అతడి ముఖంపై పేలిపోయింది.
శబ్దం విన్న కుటుంబ సభ్యులు గదిలోకి వచ్చి చూడగా ముఖానికి తీవ్రగాయాలతో రక్తం మడుగులో మోను పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియనీయకుండా గుట్టుగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.