Turkey inflation | తుర్కియే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. కరెన్సీ క్రమంగా బలహీనపడుతున్నది. ద్రవ్యోల్బణం రేటు 57 శాతానికి దగ్గరగా ఉన్నది. జీవన వ్యయం పెరగడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో సోమ, మంగళవారాల్లో సంభవించిన భూకంపం.. ఆర్థిక కష్టాలను మరింత పెంచింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు 4వేలకుపైగా జనం మృత్యువాత పడ్డారు. అమెరికా ఆంక్షల కారణంగా 2018 లో తుర్కియే ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసింది. ఎర్డోగాన్ ఆర్థిక సిద్ధాంతాలకు విరుద్ధంగా నడుస్తున్నందున రాబోయే రోజుల్లో తుర్కియేలో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. నిరంతరం వడ్డీ రేట్లను తగ్గిస్తూనే ఉన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. టర్కీ, సిరియాలను వణికించిన భూకంపం దాదాపు 1 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు రూ.8.2 వేల కోట్ల నష్టం కలిగించవచ్చు. మూడేండ్ల క్రితం సరిగ్గా ఇదే ప్రాంతంలో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు600 మిలియన్ డాటర్లు.. మన కరెన్సీలో దాదాపు రూ. 4.9 వేల కోట్లు నష్టం కలిగించింది. ప్రస్తుతం సంభవించిన భూకంపం కారణంగా భవనాలు, ఇతర నిర్మాణాలు దెబ్బతినడంతో భారీ నష్టం వాటిల్లింది. కర్మాగారాల ఉత్పత్తి నష్టం కారణంగా వస్తువుల ఎగుమతి ఆలస్యం అవుతుంది. విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా రాబడి తగ్గుతుంది. ప్రభుత్వ రంగ ఖర్చులు పెరుగుతాయి. గాయాలు, మరణం సంభవించడం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి కారణాలతో ఎక్కువ శాతం మంది ఆదాయం కోల్పోవడం వంటి చర్యలు కనిపిస్తున్నాయి.
గత ఏడాది డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్ అద్దె 4,500 లిరా (దాదాపు రూ.19,700) గా ఉండేది. ఆర్థిక సంక్షోభం కారణంగా అద్దెలను రెండింతలు చేశారు. ప్రస్తుతం ఇండ్లు కూలిపోవడదంతో నివాసాలు దొరకడం కష్టంగా మారింది. డబుల్ బెడ్రూం అపాప్ట్మెంట్ రెంట్ 30,000 లిరాలకు (దాదాపు రూ. 131,000) చేరుకున్నది. దాంతో చాలా మంది రోడ్లపైనే బ్రతుకులు నెట్టుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నవి. ఒక్కసారి తాము పేదలుగా మారామని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. తుర్కియేలో ఇప్పుడు ధనవంతులు లేదా పేదలు మాత్రమే ఉన్నారని, మధ్య తరగతి వర్గం లేకుండా పోయిందని ఇస్తాంబుల్లోని ఓ రెస్టారెంట్ మేనేజర్ చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి సాయం అందకపోవడంతో భవిష్యత్ అంధకారంలో పడిపోయిందని పలువురు దీనంగా పేర్కొంటున్నారు.