కొలంబో: శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో (Sri Lanka Elections) అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నది. ప్రాథమిక ఫలితాల ప్రకారం గురువారం జరిగిన ఓటింగ్లో ఆయన నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ (NPP) సంకీర్ణ పార్టీ 63 శాతం ఓట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే 225 మంది సభ్యుల సభలో ఎన్పీపీ దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ లీడింగ్లో ఉన్నట్లు లేటెస్టు సమాచారం. కాగా, ప్రస్తుత పార్లమెంటులో ఆ పార్టీ బలం మూగ్గురు సభ్యులే మాత్రమే గమనార్హం. ఇక సెప్టెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుర దిసనాయకే అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అవినీతిని ఎదుర్కోవడంతోపాటు దేశం కోల్పోయిన ఆస్తులను తిరిగి సంపాదిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
2022 శ్రీలంక ఆర్థిక సంక్షోభం తర్వాత తొలిసారిగా పార్లమెంటు ఎన్నికలు గురువారం జరిగాయి. మొత్తం 225 సీట్లలో 196 సీట్లకు నేరుగా పోలింగ్ జరిగింది. 8,821 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మిగిలిన 29 సీట్లను నేషనల్ లిస్ట్ ఆధారంగా నిర్ణయిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 13,314 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. సుమారు 65 శాతం ఓటింగ్ నమోదయింది. అయితే అధ్యక్ష ఎన్నికలతో పోల్చితే ఇది తక్కువే. సెప్టెంబర్లో జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.