టోరంటో, జూన్ 24: అమెరికా ఖండాన్ని ఆక్రమించుకున్న యూరోపియన్లు అక్కడి మూలవాసుల పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించారన్న దారుణ చరిత్ర మరోసారి బయటపడింది. మూలవాసుల (రెడ్ ఇండియన్ల) పిల్లలకు చెందిన వందలాది అవశేషాలను కెనడాలోని సాస్కచెవన్ రాష్ట్రంలో మెరీవల్ అనే ఓ గ్రామంలో ఓ పాత ‘ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్’ ఆవరణలో గుర్తించారు. దాదాపు 751 గుర్తింపు లేని సమాధులున్నాయని, ఇవన్నీ ఆ స్కూల్లో హింసలు, లైంగికదాడులపాలై మరణించిన మూలవాసుల పిల్లలకు చెందినవేనని ‘స్వతంత్ర మూలవాసుల జాతుల సమాఖ్య’ అధ్యక్షుడు బాబీ కెమరూన్ తెలిపారు. ఈమధ్యే కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న ఒకప్పటి రెసిడెన్షియల్స్కూల్ ఆవరణలో 215 మంది పిల్లల అవశేషాలను గుర్తించారు. ఈ విధంగా కెనడా వ్యాప్తంగా దాదాపు 10 వేల మందికిపైగా పిల్లలు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. నాగరికత నేర్పుతామనే పేరుతో మూలవాసుల నుంచి వారి పిల్లల్ని బలవంతంగా లాక్కొచ్చి ఈ స్కూళ్లలో ఉంచేవారు. కానీ నిజానికి వారిపై అక్కడి సిబ్బంది, మతాధికారులు లైంగికదాడులకు, చిత్రహింసలకు పాల్పడేవారు. దీంతో ఆ చిన్నారులు అనాథలుగా మరణిస్తూ ఉండేవారు.