Mahatma Gandhi | గ్వాలియర్: మహాత్మాగాంధీకి డిగ్రీ లేకపోయినా విద్యాధికుడిగా కనిపిస్తారని, జాతిపిత అయ్యారని జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు. శనివారం గ్వాలియర్లోని ఐటీఎమ్ వర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డిగ్రీ పొందడమే చదువుకున్నట్టు’ కాదని అర్థం వచ్చేలా ఆయన ప్రసంగించారు. ‘చాలా మంది గాంధీజీకి న్యాయ శాస్త్ర డిగ్రీ ఉందనుకుంటారు. ఆయన విద్యార్హత హై స్కూల్ డిప్లొమా మాత్రమే. ఆయన లా ప్రాక్టీస్కు అర్హత సాధించారు కానీ ఆయనకు డిగ్రీ లేదు. మీకు మార్క్ ట్వెయిన్ గురించి తెలుసా?’ అని సిన్హా అన్నారు. సిన్హా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): గాంధీని చంపిన గాడ్సేకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రచారం చేసినా ఆశ్చర్యపోనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వాట్సాప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అందరూ ఇదే రకమైన ప్రచారం చేస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. గాంధీ డిగ్రీ కూడా చదువుకోలేదంటూ జమ్ముకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వ్యాఖ్యానించిన వీడియోను టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ట్వీట్ చేయగా.. మంత్రి కేటీఆర్ స్పందించారు. గాడ్సేకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రచారం చేసినా తాను ఆశ్చర్యపోనని బీజేపీని ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు.