వాషింగ్టన్, ఏప్రిల్ 16: తుపాకీ చప్పుళ్లతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. ఇండియానా పోలిస్లో గురువారం అర్ధరాత్రి ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇండియానా పోలిస్ విమానాశ్రయానికి సమీపంలోని ఫెడ్ఎక్స్ కొరియర్ సంస్థ వద్ద ఈ ఘటన జరిగింది. ఘాతుకానికి పాల్పడిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని మరణించినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన ఐదుగురిని దవాఖానకు తరలించినట్టు చెప్పారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసు ప్రతినిధి గానె కుక్ పేర్కొన్నారు. తమ సంస్థలో పనిచేసే వారుకూడా మృతుల్లో ఉన్నట్టు ఫెడ్ఎక్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని కుక్ పేర్కొన్నారు. చేతిలో రైఫిల్ను పట్టుకొని వచ్చిన దుండగుడు కనిపించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా, ఈ ఏడాది అమెరికాలో జరిగిన మూడు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 20 మందికి పైగా మరణించారు.