కాట్మాండు: నేపాల్ వరద(Nepal Floods)ల్లో.. బురద నుంచి ఓ బామ్మను రక్షించిన ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. బురదమయం అయిన ఆ బామ్మను జేసీబీ మెషీన్లో తీసుకెళ్లిన దశ్యాలను యావత్ ప్రపంచం వీక్షించింది. అయితే ఆమె ఎవరో తెలిసిపోయింది. ఆ బామ్మ వయసు 97 ఏళ్లు. ఆమె పేరు గునా మాయా బోహరా. నేపాల్ జల ప్రళయానికి ఆ వృద్ధరాలు సజీవ సాక్ష్యం. బుధవారం నాటి విలయంలో వందల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ 97 ఏళ్ల బామ్మ ఆయుష్షు మాత్రం ఇంకా ఉంది. ఆమెతో ఉన్న వాళ్లు కొందరు మరణించారు. కానీ బురదలో ఇరుక్కున్న బామ్మ మాత్రం సజీవంగా బయటకు వచ్చింది.
బామ్మను కాపాడేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. గునా మాయా బోహరా మనవడు దీపక్ మోహరా మీడియాతో మాట్టాడాడు. యుద్ధం నుంచి విజేతగా తిరిగివచ్చిన ఓ యోధురాలిగా తన బామ్మ ఉన్నట్లు పేర్కొన్నాడు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ బామ్మను రక్షించుకునేందుకు దీపక్ బోహరా కాట్మాండు నుంచి త్రిశూలీ ప్రాంతానికి చేరుకున్నాడు. బురదలో చిక్కుకున్న ఆ వృద్ధురాలిని రక్షించేందుకు కనీసం 4 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని అతను చెప్పాడు.