నైపియితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ( Aung San Suu Kyi)ని గృహనిర్బంధంలోకి తరలించారు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా వెల్లడించింది. 80 ఏళ్ల నోబెల్ గ్రహీత సూకీ చాన్నాళ్ల నుంచి జైలులో ఉన్నారు. దేశరాజధాని నైపియితాలో ఉన్న జైల్లో ఆమెను ఇన్నాళ్లూ నిర్బంధించారు. 2021లో మిలిటరీ తిరుగుబాటు తర్వాత ఆమెను కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే శిక్షాకాలంలోని మిగితా సమయాన్ని సూకీ తన ఇంటిలోనే గడపనున్నట్లు మిలిటరీ నేత మిన్ ఆంగ్ హయింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
2015లో ఆంగ్ సాన్ సూకీ మయన్మార్ లో అధికారాన్ని చేపట్టారు. అంతకుముందు ఆమె ఆ దేశ ప్రజాస్వామ్య కార్యకర్తగా పోరాటం చేశారు. సుమారు 15 ఏళ్ల పాటు ఆమె హౌజ్ అరెస్టులోనే ఉన్నారు. సూకీ వద్ద ఇద్దరు సైనికాధికారులు ఉన్న ఫోటోను తాజాగా రిలీజ్ చేశారు. దానిపై ఆమె కుమారుడు కిమ్ ఆరిస్ స్పందించారు. తన తల్లి బ్రతికి ఉన్నట్లు తన వద్ద ఆధారాలు లేవని ఆరోపించారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫోటో 2022లో తీశారని, అది అర్థం లేని ఫోటో అని ఆయన అన్నారు. సూకీతో నేరుగా మాట్లాడేవరకు ప్రస్తుత పరిస్థితుల్ని నమ్మలేరన్నారు.
అవినీతి, ఎన్నికల ఫ్రాడ్కు పాల్పడిన కేసుల్లో ఆమెకు 27 ఏళ్ల శిక్ష పడింది. అయితే తగ్గించిన శిక్షా కాలాన్ని బట్టి ఆమె ఇంకా 18 ఏళ్లు శిక్షను అనుభవించాల్సి ఉన్నది.