అబిడ్స్ : రోడ్లపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులను నమోదు చేశారు.
గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర్ నేతృత్వంలో ట్రాఫిక్ ఎస్ఐలు, సిబ్బంది గోషామహల్ అలస్కా నుంచి పీల్ఖానా, ఎంజె మార్కెట్ నుంచి సిద్దంబర్బజార్ వరకు అక్రమంగా వాహనాలను పార్క్ చేసిన వారిపై కేసులను నమోదు చేయడంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఫుట్పాత్ ఆక్రమణలు చేస్తే సహించేది లేదని, ఫుట్పాత్ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ స్తంభించే అవకాశాలు ఉంటాయన్నారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని, వాహనాల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లను నిర్వహించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. గురువారం అక్రమంగా వాహనాలను పార్క్ చేసిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ఎంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో వాహనదారులు అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోందన్నారు.