చార్మినార్ : కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి పని చేస్తున్న సంస్థకే కన్నం వేయాలని ప్లాన్ వేశాడు. పోలీసులకు యజమాని ఫిర్యాదు చేయడంతో నిందితుని కథ అడ్డం తిరిగింది. డబ్బు కాజేయాలని ప్లాన్ వేసిన నిందితున్ని బహదూర్పుర పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం అనంతపూర్ గుంతకల్లుకు చెందిన ధూపం మనోహర్ (28) నగరంలో నివసిస్తూ అంబర్పేట్ గోల్నాక ప్రాంతంలోని నాయుడు ట్రాన్స్ఫోర్ట్ లో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తన యజమాని లక్ష్మీనారాయణ అలియాస్ హరీష్ ఆదేశాలతో నగరంలోని పలు చోట్ల వ్యాపార లావాదేవీల్లో వ్యాపారస్తుల నుండి నగదును వసూలు చేయడానికి పురమాయించాడు.
ఈ నెల 7న రాత్రి 8.30 గంటల సమయంలో బహదూర్ఫుర ప్రాంతంలోని అంబికా ఐరన్ అండ్ స్టీల్ నుండి నగదును వసూలు చేసు కుని తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పటికే మనోహర్ వివిధ ప్రాంతాల్లోని వ్యాపారస్తుల వద్ద వసూలు చేసిన మొత్తం పది లక్షల వర కు ఉంది. దీంతో వాటిని చోరీ చేయాలని ప్లాన్ వేసుకున్న నిందితుడు వాటిని తన ఇంటిలో దాచి తిరిగి యజమాని వద్దకు వెళ్లాడు.
అతను నగదు గురించి ప్రశ్నించడంతో బహదూర్పుర నుండి పురాణపూల్ మార్గంలో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని ఓ ద్విచక్ర వాహనదారుడు తనను ఢీ కొట్టి నగదు బ్యాగును తస్కరించాడని చెప్పాడు. వెంటనే లక్ష్మీనారాయణ బహదూర్పుర పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్థారించుకున్నారు. మనోహర్ నగదును కాజేయాలనే ప్లాన్లో భాగంగా నాటకం ఆడినట్లు గుర్తించిన డీ ఎస్సై శివకుమార్ నిందితున్ని అదుపులోకి తీసుకుని సాంకేతిక అంశాలతో విచారణ చేశాడు. దీంతో నిందితుడు నగదు తస్కరణ కోసం ఆడిన నాటకాన్ని బయటపెట్టాడు.
నిందతుని వద్ద నుండి పది లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని డీ ఎస్పీ శివకుమార్ తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. త్వరితగతిన కేసును పరిష్కరించిన డీ ఎస్సై శివకుమార్ను ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ అబినందించారు.