సుల్తాన్బజార్, ఆగస్టు 12 : ఓ వ్యక్తి పోగొట్టుకున్న నగదుతో కూడిన బ్యాగును కేవలం ఐదు గంటల్లోనే ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకొని రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో శనివారం జరిగింది. సుల్తాన్బజార్ డివిజన్ ఏసీపీ చిన్న బాలగంగి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అలంకార్ రోడ్కు చెందిన మమతా సిల్క్ సెంటర్ యజమాని సింగిరికొండ వంశీక్రిష్ణ ఈనెల 10వ తేదీన అనంతపూర్ ధర్మవరంలో పట్టు చీరలను కొనుగోలు చేసే క్రమంలో నగరానికి వచ్చాడు. కాగా, శనివారం ఉదయం 5 గంటల సమయంలో మహాత్మాగాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)కు వచ్చి అక్కడ టాయిలెట్లో ఫ్రెష్ అయ్యే క్రమంలో టాయిలెట్ వాల్పై నగదు ఉన్న బ్యాగును ఉంచి లోపలికి వెళ్లాడు.
తిరిగి వచ్చి చూసేసరికి బ్యాగు కన్పించలేదు. దీంతో కంగారుపడ్డ వంశీక్రిష్ణ అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో ఉదయం 10:30 గంటలకు ఫిర్యాదు చేశాడు. కాగా, కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.సంతోషం, డీఎస్ఐ పి.రామకిషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తక్షణమే రంగంలోకి దిగిన క్రైంటీం ఎంజీబీఎస్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి ఓ 55 ఏండ్ల గుర్తు తెలియని వ్యక్తి బ్యాగును తస్కరించి బస్సులో అక్కడి నుంచి వెళ్లినట్లు గుర్తించారు. కాగా, నిందితుడు అత్తాపూర్లో బస్సు దిగినట్లు సీసీటీవీ ఫుటేజీలను గుర్తించిన పోలీసులు అత్తాపూర్కు వెళ్లి పరిశీలించి నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు వనపర్తి జిల్లా ఖిల్లా ఘన్పూర్కు చెందిన జి.వెంకటేశ్(52)ని అదుపులోకి తీసుకొని రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఐదు గంటల్లోనే దొంగిలించిన నిందితుడిని పట్టుకున్న అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ ఎస్.సంతోషం, క్రైం సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ త్వరలోనే తగిన రివార్డులను అందిస్తామని ఏసీపీ తెలిపారు.