ఖైరతాబాద్, సెప్టెంబర్ 23 : వీడ్రీమ్ బిజ్ టెక్ ఆధ్వర్యంలో హైటెక్స్లో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో రోబోటిక్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు సెంథిల్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్స్పోకు సంబంధించిన బ్రోచర్లను డైరెక్టర్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (తెలంగాణ ప్రభుత్వం) రమాదేవి లంక, ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కిషన్ పీఎస్వీ, ఐహెచ్ఎన్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ శాస్త్రవేత్త డాక్టర్ కే జార్జ్ అబ్రహంతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే మొదటి సారిగా ఇలాంటి క్రీడలకు హైదరాబాద్ వేదిక కానున్నదన్నారు. వివిధ కళాశాలల విద్యార్థులు తయారు చేసిన రోబోలతో ఈ క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రమాదేవి మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలు సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతుందని, తెలంగాణ ప్రభుత్వం ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డ్రోన్స్ తదితర ప్రాజెక్టులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని చెప్పారు. రోబోటిక్స్పై ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ ఓ పాలసీని తయారు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిపారు. వీ డ్రీమ్ బిజ్టెక్ కో ఫౌండర్ ప్రతాప్రెడ్డి, టీ హబ్ సీఈవో శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.