సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మీరు నా విచారణ నుంచి తప్పుకొని.. నాకు ఫేవర్ చేయండి. లేదంటే మీ కుటుంబ సభ్యులు.. మీరు బతికి ఉండరంటూ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ నిందితుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, సాక్షులకు బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఇందులో భాగస్వాములైన జైలులో ఔట్సోర్సింగ్ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని జుబ్లీహిల్స్, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో సంచలనం రేపిన చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి ఇంకా చంచల్గూడ జైలులోనే ఉన్నాడు.
ఈ కేసు కోర్టులో ట్రయల్కు వచ్చింది. పోలీసులు పక్కాగా సాక్ష్యాలను కోర్టులో ఉంచడంతో శిక్ష తప్పదనే ఆలోచనలో రాకేశ్ రెడ్డి ఉన్నాడు. దీంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కేసులో సాక్షులుగా ఉన్న వారిని బెదిరించాలని జైలు నుంచే కుట్ర పన్నాడు. ఇందుకు ఔట్సోర్సింగ్లో నర్సు ఉద్యోగిగా పనిచేస్తున్న మహ్మద్ అక్బర్ అలీతో పరిచయం పెంచుకున్నాడు. దీంతో పాటు ములాఖత్లో కలిసేందుకు వచ్చిన స్నేహితులైన గుట్టల బేగంపేట్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కురపాటి మంగయ్య గుప్తా, నాగోల్లో నివాసముండే సివిల్ కాంట్రాక్టర్ కత్తుల శ్రీనివాస్తో చర్చించాడు. తన స్నేహితులతో సెల్ఫోన్, సిమ్ కొనిచ్చి అక్బర్కు ఇప్పించాడు.
అనంతరం ఈ ముగ్గురి సహకారంతో జైలు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, సాక్షులకు ఫోన్ చేసి బెదిరించడంమే కాకుండా లేఖలు రాసి అక్బర్ద్వారా పంపిస్తున్నాడు. ఈ విషయంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సాక్షులు చందానగర్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జుబ్లీహిల్స్ పోలీసులు, వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి ఈ కేసు వివరాలను ఆరా తీశారు. నిందితుడు రాకేశ్ రెడ్డి జైలు నుంచి బెదిరింపు లేఖలు పంపిస్తున్నట్లు గుర్తించి అక్బర్, మంగయ్య, శ్రీనివాస్లను మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు రాసిన ఐదు లేఖలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో వెస్ట్జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.