మెహిదీపట్నం జూన్ 9 : కూలీ కోసం వెళ్లిన ఓ మహిళ హత్యకు గురైంది. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన ఆంజనేయులు, చెన్నమ్మ(47)దంపతులు షేక్పేట్ సక్కుబాయి నగర్లో నివాసముంటూ.. భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. మంగళవారం చెన్నమ్మ కూలీ పని కోసం మణికొండ లేబర్ అడ్డాకు వెళ్లింది. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో పని ఉందని ఆమెను తీసుకువెళ్లాడు. రాత్రి అయినా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. బుధవారం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా.. మధ్యాహ్నం షేక్పేట్ సక్కుబాయి సొసైటీ సమీపంలోని శ్మశాన వాటిక వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్లు గోల్కొండ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వెళ్లి విచారణ చేపట్టి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. వారు వచ్చి గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.