జీడిమెట్ల, మే 11 : నవ మాసాలు మోసి పెంచి పెద్దచేసిన తల్లి పాలిట కన్న కొడుకే కాలయముడయ్యాడు. తన జల్సాల కోసం అత్యంత దారుణంగా కడతేర్చాడు. ఆ తల్లి ఎంత ప్రాధేయ పడినా.. వినలేదు. కండ్లు, నోటి నుంచి రక్తం కారుతున్నప్పటికీ కనికరం లేకుండా మెడచుట్టూ తువ్వాల బిగించి హతమార్చాడు. ఈ హృదయ విదారక సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్సింగ్నగర్లో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని చింతల్ భగత్సింగ్నగర్కు చెందిన ముప్పిడి మల్లేశ్, సువర్ణ(48) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కూతుర్ల పెండ్లి కాగా.. కుమారుడు హరి(24)కి వివాహం కాలేదు. మల్లేశ్ సనత్నగర్లో టైలర్ షాపు నిర్వహిస్తుండగా.. సువర్ణ ఇంట్లోనే టైలరింగ్ చేస్తున్నది. ఈ క్రమంలో కుమారుడు హరి ప్రతిరోజు తండ్రి మల్లేశ్ను చింతల్ నుంచి సనత్నగర్కు తీసుకువెళ్లి దింపేసేవాడు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం మల్లేశ్ను దింపడానికి హరి టైలర్ షాపునకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేయగా ఎత్తలేదు. షాపు మూసిన అనంతరం రాత్రి 8గంటల ప్రాంతంలో మల్లేశ్ ఇంటికి వచ్చేసరికి బయటినుంచి గడియపెట్టి ఉన్నది. తన భార్య సువర్ణ ఎక్కడికి వెళ్లిందని అదే ఇంట్లో ఉంటున్న అద్దె దారులను ఆరా తీయగా తెలియదని చెప్పారు. గడియ తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా సువర్ణ విగతజీవిగా పడి ఉన్నది. మెడ చుట్టూ తువ్వాల చుట్టి ఉండటంతో పాటు కంటి నుంచి, నోటి నుంచి రక్తస్రావం జరిగింది. అదే సమయంలో పక్కనే ఉన్న బీరువా తెరిచి ఉండటంతో అందులో ఉన్న సుమారు ఐదు లక్షల విలువ చేసే నగలు, రూ.50 వేల నగదు కన్పించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి భర్త మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తమ దర్యాప్తులో పోలీసులు సువర్ణ కొడుకు హరి(24) హంతకుడిగా గుర్తించినట్లు సమాచారం. గత కొన్నేండ్లుగా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డారు. గత రెండు నెలల నుంచి ఉద్యోగం చేస్తున్నానంటూ టిఫిన్ బాక్స్ పెట్టుకొని బయటకు వెళ్లి తిరిగి రాత్రి పొద్దుపోయే వరకు ఇంటికి చేరుకోలేడు. ఇదే క్రమంలో తన తండ్రిని సనత్నగర్లో టైలర్ షాప్ వద్ద దింపిన హరి ఇంటికి వచ్చి తల్లితో గొడవకు దిగినట్లు సమాచారం. ఇదే క్రమంలో తల్లి సువర్ణ మెడకు తువ్వాల బిగించి హతమార్చాడు. అనంతరం బీరువాలో ఉన్న నగలు, నగదుతో పారిపోయినట్లు తెలుస్తున్నది. అయితే నిందితుడు హరి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.