ఖైరతాబాద్, జూన్ 25 : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు కొంగుబంగారమై పూజలందుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది పంచభూతాల స్వరూపుడిగా…సంకటహరుడిగా రూపుదిద్దుకోనున్నారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు….28 అడుగుల వెడల్పుతో మట్టి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. గురువారం నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బడా గణేశ్ మండప ప్రాంగణంలో కర్ర పూజ నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా మహాగణపతి విగ్రహ నమూనాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్ కుమార్, కన్వీనర్ సందీప్ రాజ్, శిల్పి రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ సంకట హర మహాగణపతిగా రూపుదిద్దుకోనున్న ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఐదు పడగల ఆదిశేషుడి నీడలో..ఐదు ముఖాలు..ఎనిమిది హస్తాలతో..పద్మంపై ఆశీనులై ఉంటారు.
కుడి వైపు అంకుశం, త్రిశూలం, కమలం, అభయం, ఎడమవైపు పాశం, పరుషు, మాల, మొదకం ఉంటుంది. స్వామి వారి ఐదు ముఖాలు పంచభూతాలు (ఆకాశం, పృథ్వీ, అగ్ని, జలము, వాయువు)కు ప్రతిరూపంగా చెబుతున్నారు. అలాగే స్వామి వారి కుడివైపు 20 అడుగుల ఎత్తులో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథుడి లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతున్న నేపథ్యంలో శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి దర్శించుకోవడం ద్వారా శాంతి నెలకొంటుందని, పంచభూతాలు అనుకూలిస్తాయని దివ్యజ్ఞాన సిద్ధాంతి తెలిపారు.