సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 ( నమస్తే తెలంగాణ) : పేద, మధ్య తరగతి పౌరులకు క్రీడలు దూరం కానున్నాయి. ఊహించినట్టుగానే ప్రజా సౌకర్యాల కంటే ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే అంశాలకే కమిటీ సభ్యులు ప్రాధాన్యత ఇచ్చారు. క్రీడా మైదానాల నుంచి శ్మశాన వాటికల వరకు అన్నింటినీ ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు కమిటీ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేపీహెచ్బీ కాలనీ (5వ ఫేజ్)లోని క్రికెట్ ప్రాక్టీస్ పిచ్ల నిర్వహణకు నెలకు రూ. 59,639 బేస్ ప్రైస్తో ఈవోఐ ఆహ్వానించనున్నారు. కేపీహెచ్బీ (9వ ఫేజ్)లోని ఇండోర్ షటిల్ కోర్టు నిర్వహణ ఫీజును 15 శాతం పెంచి, నెలకు రూ. 59,513గా ఖరారు చేసి ప్రతిపాదించారు.
బాలానగర్ ఫ్లై ఓవర్ కింద ఖాళీ స్థలాన్ని ఏడాది పాటు స్పోర్ట్స్ ఎరీనాగా మార్చనున్నారు. అలాగే నెక్సస్ మాల్ ఫ్లై ఓవర్ కింద ఉన్న స్పోర్ట్స్ ఎరీనా నిర్వహణకు నెలకు రూ. 1.14 లక్షల బేస్ ప్రైస్తో టెండర్లు పిలించేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో మేయర్ అధ్యక్షతన 12వ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎజెండాలోని 9 ప్రధాన అంశాలతో పాటు మరో 11 అదనపు అంశాలకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
కీలక నిర్ణయాలు ఇవే..
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఉన్న ఎలివేటెడ్ కారిడార్కు ‘బండారి రాజిరెడ్డి కారిడార్’గా పేరు పెట్టాలని నిర్ణయించి, తుది అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.