వికారాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో ఎర్రమట్టి, సుద్ద గనుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు లీజు గడువు ముగిసినా.. అనుమతులు ఒకచోట తీసుకోని మరో చోట తవ్వకాలు జరుపుతున్నా మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణ లున్నాయి. మూమూళ్ల మత్తులో జోగుతూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు.
అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తమకు సంబంధం లేదంటూ మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం గమనార్హం. తాండూరులో ఏండ్ల కిందట లీజు పొంది, దాని గడువు తేదీ ముగిసినా గనుల తవ్వకాలు జరుపుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ దందాలకు అనుమతులివ్వడం తప్ప, అది అక్రమమా..? సక్రమమా..? అని విచారణ కూడా చేయడంలేదని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. మామూళ్లు ఇవ్వకపోతేనే తనిఖీలు చేస్తారని, డబ్బులందితే వారి ఊసే ఎత్తరని మైనింగ్ అధికారులపై జిల్లా ప్రజానీకం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.
అక్రమ సుద్ద గనులు, ఎర్రమట్టి, కంకర దందాలు నడిపించే వారు ఓవర్ లోడ్తో వాహనాలను తరలిస్తున్నా మైనింగ్, రవాణా, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గతేడాది మీర్జాగూడ వద్ద కంకర ఓవర్ లోడ్తో వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టి కంకర బస్సులోని ప్రయాణికులపై పడి 19 మంది మృతి చెందిన ఆ ప్రమాదం అనంతరం వారం, పది రోజులపాటు తనిఖీల పేరిట హల్చల్ చేసిన రవాణా శాఖ అధికారులు తదనంతరం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిత్యం జిల్లా కేంద్రం మీదుగా, మన్నెగూడ, తాండూరు తదితర ప్రాంతాల్లో ఓవర్ లోడ్ కంకర, ఎర్రమట్టి, బండరాళ్లను తరలిస్తున్నా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
జిల్లాకు మణిహారంగా మారుతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోమిన్పేట మండలంలోని ఎన్కతలలో చేపట్టిన మొబిలిటీ వ్యాలీ అక్రమ దందాకు కేంద్రంగా మారిందనే ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్కు పేరొస్తుందని భూసేకరణ పూర్తైనా కంపెనీల ఏర్పాటులో కాంగ్రెస్ సర్కార్ తాత్సారం చేస్తున్నది. గత మూడేండ్లుగా గుంతలు తవ్వే పనిలోనే ఉన్నది. ఎన్కతలలో మొబిలిటీ వ్యాలీ కోసం భూసేకరణ పూర్తి చేసిన ప్రాంతం నుంచి గతేడాదిన్నరగా రాత్రయితే చాలు వందల టిప్పర్లు అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నట్టు సమీప గ్రామ ప్రజలు చెబు తున్నారు. రోడ్ల నిర్మాణం పేరిట గుట్టలను తవ్వుతూ ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ దండు కుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
ఈ దందాను వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు నడిపిస్తున్నట్టు.. ఈ విషయం స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. మరోవైపు కొడంగల్ సెగ్మెంట్, దుద్యాల మండలంలోని గౌరారం రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ గనుల తవ్వకాలు రెవెన్యూ-అటవీ శాఖల అధికారుల నిర్లక్ష్యంతోనే గత కొన్నేండ్లుగా సాగుతున్నట్టు ఆరోపణలున్నాయి. లీజు గడువు ముగిసినా రెన్యువల్కు ఆ నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవడం.. గతంలో మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులకు గౌరారం రిజర్వ్ ఫారెస్ట్లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై అటవీ శాఖ అధికారులు సమాచారమందించినా గనుల శాఖ అధికారులు లీజును రెనన్యువల్ చేశారు. కోర్టు స్టే ఉన్న సమయంలో లీజును రెన్యువల్ చేయడంపై జిల్లా మైనింగ్ అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇందుకు వారు రూ.లక్షల్లో వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.