కొండాపూర్, ఆగస్టు 28 : ఓ బ్యాండ్ గ్రూప్ నిర్వాహకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. అయితే మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని బాధిత కుటుంబసభ్యులు చెబుతుండగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గచ్చిబౌలి పీజేఆర్ కాలనీకి చెందిన వడ్ల వీరేశం ఇంట్లో వివాహ వేడుక జరిగింది. బరాత్ కార్యక్రమానికి సికింద్రాబాద్ సరస్వతి బ్యాండ్ గ్రూప్ను మాట్లాడుకున్నారు. నిర్వాహకుడు నరేశ్తో పాటు అతని బృందం పాల్గొంది. రాత్రి 11.20 గంటలకు స్థానికులు బ్యాండ్ సౌండ్ వల్ల నిద్రపట్టడం లేదని డయల్ 100 కు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వచ్చి బరాత్ను నిలిపివేయాలని చెప్పి వెళ్లిపోయారు. వారు బేఖాతర్ చేసి బరాత్ను అలానే కొనసాగించారు. మరో సారి డయల్ 100కు ఫోన్ రావడంతో పోలీసులు మళ్లీ వచ్చారు. ఇది చూసిన బ్యాండ్ బృందం వారి సామాన్లు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు బ్యాండ్ తో కూడిన ఆటోను వేగంగా ముందుకు నడిపారు. అదే సమయంలో ఆ వైపున వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. బ్యాండ్ ఆటోలో ఉన్న గుండప్ప, సంతోష్ గాయాలయ్యాయి. ధ్వంసమైన తన ఆటోను చూసిన నరేశ్ ఒక్కసారిగా ఆవేదనకు గురై కిందపడిపోయాడు. ఆ సమయంలో బ్యాండ్ ఆటోకు ఉన్న ఇనుప హుక్ అతని తలకు తాకింది.
గాయంతోనే కొద్ది దూరం నడిచిన తర్వాత నరేశ్ కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అయితే మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తామని వివరించారు. ఈ ఘటన పై విచారణాధికారిగా మాదాపూర్ ఏసీపీ రఘునందన్ను నియమించినట్లు తెలిపారు.