సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): కరోనా ఆపత్కాలంలో నగరవాసులకు తలెత్తుతున్న పలు సందేహాలను నివృత్తి చేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఎంతో మంది బాధితులకు బాసటగా నిలుస్తుంది. సార్.. ఎలాంటి లక్షణాలు ఉంటే కొవిడ్ పరీక్షలు చేసుకోవాలి? పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు? టీకాలు ఎక్కడ ఇస్తున్నారు? ఐసొలేషన్ కేంద్రాలకు వెళ్లాలంటే ఎలా? ఇలా పలు సందేహాలు ప్రజలను వేధిస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికే జీహెచ్ఎంసీ ప్రత్యేంగా కంట్రోల్ రూం ‘040-2111 1111’ను ఏర్పాటు చేసింది. కొవిడ్కు సంబంధించి ఎవరికి ఎలాంటి సందేహాలున్నా సహాయ కేంద్రం సభ్యులు నివృత్తి చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే.. సభ్యులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన సాయం అందిస్తున్నారు. ఫోన్ చేసిన వారికి మళ్లీ కాల్ చేసి పరీక్షల్లో ఏం ఫలితాలు వచ్చాయి? కొవిడ్ కిట్లు అందాయా? క్వారంటైన్ ఎక్కడ ఉంటున్నారు? తదితర విషయాలపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. ఇలా రోజుకు కంట్రోల్ రూమ్కు వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వారి సందేహాలను శ్రద్ధగా వింటున్న సిబ్బంది వాటి నివృత్తికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
గ్రేటర్లో కొవిడ్ సంబంధిత వైద్య సహాయాన్ని, పాజిటివ్ వస్తే చేపట్టాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు తదితర సలహాలు, సూచనలు అందించేందుకు జీహెచ్ఎంసీ కొవిడ్ కంట్రోల్ రూం నుంచి వైద్యులు పనిచేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిప్టులలో ఈ వైద్యులు కంట్రోల్ రూం నుంచి ఫోన్ల ద్వారా కొవిడ్ నివారణకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. బాధితులకు ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా వెంటనే సమాచారం చేరవేస్తున్నారు. కరోనా పరీక్షలు, అనుమానాలు, రెండోసారి పరీక్షలు, సందేహాలు, ఆక్సిజన్ కావాలని, టీకాలు వేసుకున్నాక ఇబ్బందులు, రెమ్డెసివిర్ కావాలని, వెంటిలేటర్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.