తెలుగుయూనివర్సిటీ, మార్చి 28 : తెలుగు సాహిత్యమంటే తనకు అత్యంత ఇష్టమని, ఆ రంగానికి విశేష సేవలందిస్తున్న ప్రముఖులను సత్కరిస్తున్న సభలో తాను పాల్గొనడం సంతోషాన్ని కలుగజేస్తుందని ఓయూ వైస్ చాన్సలర్ ఆచార్య డి.రవీందర్ అన్నారు. మంగళవారం నాంపల్లిలోని ఎన్టీఆర్ కళామందిరంలో నిర్వహించిన తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల సభలో 2020 ఏడాదికి గాను వివిధ రంగాల్లో నిష్ణాతులైన 22మంది ప్రముఖులకు కీర్తి పురస్కారాల పేరిట ప్రశంసాపత్రంతోపాటు రూ.5116 నగదును అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ పని ఒత్తిడితో బాధ్యత కలిగిన హోదాలో ఉన్నవారికి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వలన గొప్ప ఉపశమనం కలుగుతుందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్రావు మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా యోగ్యత కలిగిన వ్యక్తులు శ్రమ చేస్తే ఉన్నతస్థాయికి ఎదిగి సమాజంలో గౌరవ మర్యాదలతోపాటు పేరు ప్రతిష్టతలను సంపాదించవచ్చన్నారు. కరోనా విపత్కర పరిస్థితులతో మూడేళ్లపాటు నిలిచిపోయిన వివిధ పురస్కారాలను దశలవారీగా సాహిత్య, సాంస్కృతిక, లలిత కళారంగాలకు చెందిన ప్రముఖులను సత్కరిస్తున్నట్లు వివరించారు. అంతకుముందు వర్సిటీ జానపద కళల శాఖాధిపతి డాక్టర్ నీరడి లింగయ్య ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులు జానపద కళలను ప్రదర్శించారు. సంగీత శాఖ విద్యార్థిని కుమారి భవ్య తన ప్రార్థనాగీతంతో సభికులను ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమానికి విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రింగు రామ్మూర్తి సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈనెల 31న జరుగబోయే ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరుకాలేకపోతున్న ధూళిపాల శ్రీనివాస్(సంగీతం), బండా సరోజన(ఉత్తమ రచయిత్రి)లకు రూ.20,116 నగదుతో ప్రతిభా పురస్కారాలను అందజేశారు.