బంజారాహిల్స్, అక్టోబర్ 27 : స్థలం అమ్మకంలో తనకు ఇవ్వాల్సిన కమీషన్ను ఎగ్గొట్టాడన్న కక్షతో రియల్టర్పై కత్తితో దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం 78లోని అంజనీస్ ఒయాసిస్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న బిల్డర్ రెడ్డిగారి రవీందర్రెడ్డి ఇటీవల బేగంపేటలో 600 గజాల స్థలం కొనుగోలు చేశాడు. ఈ స్థలాన్ని కొనడంలో రవీందర్రెడ్డికి దగ్గరి బంధువైన మోహన్రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించాడు. దానికోసం తనకు రూ.6లక్షల కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని మోహన్రెడ్డి పలుమార్లు రవీందర్రెడ్డికి తెలిపినా పట్టించుకోలేదు.
కనీసం తనకు రావాల్సిన కమీషన్లో సగమైనా ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రాధేయపడినా ముఖం చాటేయడంతో కక్ష పెంచుకున్న మోహన్రెడ్డి అతడిని హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్లోని రవీందర్రెడ్డి ఇంటికి వచ్చి సెల్లార్లో మాటు వేశాడు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఇంట్లోనుంచి బయటకు వచ్చిన రవీందర్రెడ్డి కారులో ఎక్కుతుండగా మోహన్రెడ్డి కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రవీందర్రెడ్డి కుప్పకూలాడు. రవీందర్రెడ్డి కేకలు విని ఆయన భార్య అమూల్యరెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆపేందుకు యత్నించింది. దీంతో మోహన్రెడ్డి అక్కడినుంచి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికు చేరుకుని రవీందర్రెడ్డిని జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడిలో గాయపడిన రవీందర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.