Lukemia | పిల్లల్లో వచ్చే క్యాన్సర్లలో లుకేమియా అత్యంత సాధారణమైనదిగా చెప్పవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చిన్నారుల్లో కనిపించే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (ఏఎల్ఎల్)ను ప్రారంభ దశలో గుర్తించి, వైద్యుల సూచనల మేరకు చికిత్సను పూర్తిగా కొనసాగిస్తే నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం, చికిత్సను మధ్యలోనే ఆపేయడం వంటి కారణాల వల్లే ఫలితాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు లక్షణాలపై అవగాహన కలిగి ఉండటం, అనుమానం వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఇతర క్యాన్సర్లతో పోలిస్తే లుకేమియా కొంత భిన్నంగా ఉంటుంది. సాధారణంగా కొన్ని క్యాన్సర్లు శరీరంలోని ఒక ప్రాంతంలో కణితిగా ఏర్పడి క్రమంగా పెరుగుతాయి. కానీ లుకేమియా ఎముక మజ్జలో ప్రారంభమవుతుంది. ఇక్కడే శరీరానికి అవసరమైన రక్తకణాలు తయారవుతాయి. అసాధారణమైన తెల్ల రక్తకణాలు వేగంగా పెరగడంతో ఎర్ర రక్తకణాలు, ప్లేట్లెట్లు, ఆరోగ్యకరమైన తెల్ల రక్తకణాల తయారీకి ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా చిన్నారుల్లో రక్తహీనత, ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం వంటి సమస్యలు కనిపిస్తాయి.
లుకేమియా వేగంగా విభజించే కణాలతో సంబంధం ఉన్న వ్యాధి కావడం వల్ల కీమోథెరపీకి మంచి స్పందన కనిపిస్తుంది. చికిత్స ప్రారంభించిన తర్వాత చాలా మంది చిన్నారుల్లో నాలుగు నుంచి ఆరు వారాల్లోనే రిమిషన్ దశకు చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే పరీక్షల్లో లుకేమియా కణాలు గుర్తించలేని స్థితికి చేరుకోవడం. దేశంలో దాదాపు 2,700 మంది ఏఎల్ఎల్ చిన్నారులపై నిర్వహించిన ఒక విస్తృత అధ్యయనంలో, ప్రారంభ దశలో స్టాండర్డ్ రిస్క్గా గుర్తించిన పిల్లల్లో నాలుగేళ్ల మొత్తం జీవించే అవకాశాలు సుమారు 88 శాతంగా ఉన్నట్లు తేలింది. వ్యాధిని సకాలంలో గుర్తించి, సరైన చికిత్స అందించినప్పుడు మంచి ఫలితాలు సాధించవచ్చని ఇది సూచిస్తోంది. లుకేమియాను ఆలస్యంగా గుర్తిస్తే వ్యాధి ఎముక మజ్జలో మరింతగా విస్తరించడంతోపాటు రక్తప్రవాహం ద్వారా శరీరంలోని ఇతర ప్రాంతాలకు చేరే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేంద్ర నాడీ వ్యవస్థ లేదా ఇతర అవయవాలపైనా ప్రభావం చూపిస్తుంది. దీంతో చికిత్సకు స్పందించడం కష్టమవుతుంది, తిరిగి వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆసుపత్రికి చేరుకునే సమయానికి కొంతమంది పిల్లల్లో తీవ్రమైన రక్తహీనత, ప్లేట్లెట్ల కొరత, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఉండటంతో చికిత్స ప్రారంభించడం కూడా సవాలుగా మారుతుంది.
భారత్లో పిల్లల క్యాన్సర్ విషయంలో ఆలస్యంగా గుర్తించడం ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది. దేశంలో ప్రతి ఏడాది 75వేల మందికి పైగా చిన్నారులకు క్యాన్సర్ వస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే వీరిలో దాదాపు సగం మందికి వ్యాధి నిర్ధారణే జరగడం లేదని ప్రజారోగ్య అంచనాలు తెలియజేస్తున్నాయి. అవగాహన లేకపోవడం, పెద్ద నగరాల వెలుపల పిల్లల క్యాన్సర్ చికిత్స అందుబాటులో లేకపోవడం, క్యాన్సర్ లక్షణాలను సాధారణ చిన్ననాటి అనారోగ్యాలుగా భావించడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా కొంతమంది పిల్లలు చికిత్సను పూర్తిగా కొనసాగించలేకపోతున్నారు. చికిత్స ఖర్చులు, ఎక్కువ కాలం పాటు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం, ఇంటికి దూరంగా చికిత్స పొందడం వంటి కారణాలతో చికిత్స మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లుకేమియా ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు చాలాసార్లు సాధారణ అనారోగ్యాల మాదిరిగానే ఉంటాయి. పిల్లల్లో నిరంతర అలసట, సాధారణం కంటే ఎక్కువగా పాలిపోయినట్లు కనిపించడం, చిన్న దెబ్బకే ఎక్కువగా గాయాలు లేదా నీలిమచ్చలు రావడం, చర్మంపై తగ్గకుండా ఉండే చిన్న ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలు కనిపించడం వంటి లక్షణాలను గమనించాలి. తరచూ జ్వరం రావడం, ఇన్ఫెక్షన్లు పదేపదే రావడం కూడా పరిశీలించాల్సిన లక్షణాలే.
ఎముకలు లేదా కీళ్లలో నొప్పి, నొప్పి కారణంగా పిల్లలు సరిగ్గా నడవలేకపోవడం లేదా నడవడానికి నిరాకరించడం, మెడ, చంకలు వంటి ప్రాంతాల్లో లింఫ్ నోడ్స్ వాపు, పొట్ట అసాధారణంగా ఉబ్బినట్లు లేదా గట్టిగా అనిపించడం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కాలేయం లేదా ప్లీహం పెరగడం వల్ల పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. కారణం తెలియకుండా బరువు తగ్గడం లేదా అకస్మాత్తుగా ఆకలి తగ్గడం కూడా గమనించాల్సిన అంశాలే. అయితే ఈ లక్షణాల్లో ఒక్కటి కనిపించినంత మాత్రాన లుకేమియా ఉందని అర్థం కాదు. చాలా సందర్భాల్లో ఇలాంటి లక్షణాలకు సాధారణ కారణాలే ఉంటాయి. కానీ ఒక లక్షణం రెండు వారాలకు మించి కొనసాగితే, లేదా ఒకేసారి అనేక లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది. సాధారణంగా పూర్తి రక్తపరీక్ష (ఫుల్ బ్లడ్ కౌంట్) వ్యాధి గురించి ప్రాథమికంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష సులభంగా, తక్కువ ఖర్చుతో చేయించుకోవచ్చు. ఇందుకోసం తప్పనిసరిగా పెద్ద నగరంలోని ప్రత్యేక ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు, సమీపంలోని క్లినిక్ లేదా ఆసుపత్రిలో కూడా ప్రారంభ పరీక్ష చేయించుకోవచ్చు. చిన్నారుల్లో ఏఎల్ఎల్ చికిత్స సాధారణంగా రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు వివిధ దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో ఇంటెన్సివ్ ఇండక్షన్ చికిత్స ద్వారా రిమిషన్ సాధించడమే లక్ష్యంగా ఉంటుంది. ఆ తర్వాత శరీరంలో మిగిలి ఉండే వ్యాధి కణాలను తొలగించేందుకు కన్సాలిడేషన్ దశ కొనసాగుతుంది. అనంతరం రిమిషన్ను కొనసాగించేందుకు తక్కువ తీవ్రత కలిగిన మెయింటెనెన్స్ చికిత్స ఉంటుంది. చికిత్స సుదీర్ఘంగా ఉన్నప్పటికీ, చాలా మంది పిల్లలు చికిత్సతో పాటు చదువు, స్నేహాలు, సాధారణ బాల్య జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.
వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే పిల్లలు చికిత్సను మెరుగ్గా తట్టుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి విస్తృతంగా వ్యాపించకముందే గుర్తించడం వల్ల దీర్ఘకాలిక ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ప్రతి చిన్నారి లుకేమియాకు ఒకే రకమైన చికిత్స ఉండదు. వ్యాధి స్వభావం, రిస్క్ స్థాయి, ఇతర వైద్య వివరాల ఆధారంగా చికిత్సను వైద్యులు నిర్ణయిస్తారు. సరైన రిస్క్ వర్గీకరణ, ముందస్తు నిర్ధారణ, చికిత్సను పూర్తిగా కొనసాగించడం వల్ల దేశంలోని అనేక చికిత్సా కేంద్రాల్లో పిల్లల జీవించే అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రతి జ్వరం, ప్రతి గాయం లేదా ప్రతి నీలిమచ్చను చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్నారుల్లో ఇలాంటి సమస్యలు సాధారణంగానే కనిపిస్తాయి. అయితే ఏదైనా లక్షణం తగ్గకుండా కొనసాగడం, లేదా ఒకేసారి అనేక లక్షణాలు కనిపించడం గమనించినప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా చికిత్స ప్రారంభమైన తర్వాత పిల్లలు కోలుకున్నట్లు కనిపిస్తున్నారని భావించి మధ్యలో మందులు లేదా చికిత్సను ఆపకూడదు. వైద్యులు సూచించిన పూర్తి చికిత్సను పూర్తి చేయడం చాలా కీలకం. చిన్నారుల్లో లుకేమియా చికిత్స రంగంలో సాధించిన పురోగతి ఆశాజనకంగా ఉంది. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించడం, సరైన చికిత్స అందించడం, చికిత్సను పూర్తిగా కొనసాగించడం ద్వారా ఎంతోమంది చిన్నారులు సాధారణ జీవితాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అందుకే భయపడటం కంటే అవగాహన పెంచుకోవడం, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరీక్షలు చేయించడం, వైద్యుల సూచనలను పాటించడం అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.