గొంతెత్తి కిన్నెర రాగం ఎత్తుకుంటే.. ఆయన కంచు కంఠం ఆమడదూరం వినిపిస్తది. ‘ఎరుకల నాంచారి కథ’ చెప్పినా, ‘పండుగ సాయన్న కథ’ చెప్పినా మొగులయ్య ఆ చారిత్రక పాత్ర ఐతడు. ఆకలి తీర్చుకోవటానికి దేవదారి ఆకులనే ఉడకబెట్టి తిని పానం నిలుపుకొన్నడు. పొట్టకూటి కోసం పలుగు పార పట్టి కాల్వలు తవ్వడానికి మట్టిపనికి పోయినా కిన్నెర వదలని మొగులయ్య అరుదైన కళాకారుడు. ‘సై తెలంగాణ’ అన్నందుకు పోలీసులు కిన్నెర బూరలు పగులగొట్టిన చోటనే.. ఇవ్వాళ నీరాజనాలందుకుంటున్న మొగులయ్య జీవితం, కళా ప్రస్థానం ఆయన మాటల్లోనే …
తాత ముత్తాతల నుంచి కిన్నెరపాట నా ఒంటబట్టింది. మా అయ్యగూడ పాడేటోడు. ఐదుతరాల కింద మా ముత్తాత కాశీమయ్య మొదటిసారి కిన్నెర తయారుచేసిండట. అప్పుడు గుండ్రటి ఆనంకాయ (సొరకాయ)బుర్రలు, దుసరి తీగ, నల్లదీగలు, పెద్దజీవాల నరాలతోని కిన్నెర చేసేదట. నా దగ్గరికి వచ్చేటప్పటికి.. కొబ్బరి చిప్పలు, ఆనంబుర్రలు, ఉక్కుతీగలతో ‘పన్నెండు మెట్ల కిన్నెర’ తయారుచేస్తున్న. ఈ మెట్ల మీద రాగాలు పలికించటమే కిన్నెరపాట గొప్పతనం.
పాలమూరు జిల్లా, అచ్చంపేట తాలూకా లింగాల మండలం అవుసలికుంట మా ఊరు. మా నాయిన ఎల్లయ్య, అమ్మ రాములమ్మ. చిన్న పూరి గుడిసెలో.. ఉంటూ కట్టెలమ్ముకొని బతికేది. తిండి ఉండేది కాదు. ఆకలి తీర్చుకోవటానికి దేవదారి చెట్టాకులు ఉడకపెట్టుకొని తిన్నరోజులెన్నో ఉన్నయి. కడుపు కోసమే తిప్పలు పడేది. బతకటాన్కి నాగర్కర్నూల్ జిల్లా గట్టురాయిపాకుల వలస పోయిన. నెలకు రూ.30 లకు జీతమున్న. పసులు కాసేది. పన్నెండేండ్లకే పెండ్లి అయ్యింది. తొమ్మిదిమంది పిల్లల్ని కన్నా.. ఐదుగురే దక్కిన్రు. బీదరికమే మిగతా నా నలుగురు పిల్లల్ని మింగింది. ఇప్పుడు ముగ్గురు మొగోళ్లు, ఇద్దరాడోళ్లు. అందరి పెండ్లీలైనయ్. కూలీ పనిచేసుకొని బతుకుతున్రు.
నా కళ గురించి ఇప్పుడు అందరడుగుతున్నరు. అది ఎట్ల నేర్చుకున్ననో చెప్పుమంటున్నరు. నిజానికి నా కిన్నెర, నా పాట ఓ అరుదైన కళ అని నాకు తెల్వదు. కాయకష్టం చేసి ఇంటికొచ్చినంక, ఉన్నదింత కడుపులేసుకొని రాత్రిళ్లు కన్నుమూత పడేదాకా పాడుకోవటం నాకలవాటు. ఆ అలవాటే.. నన్నిప్పుడు అందరిముందు ఓ కళాకారుడిగా నిలబెట్టింది. పండుగ సాయన్న లాంటి వీరుల పాట పాడి.. నా గుండె గుబులును దూరం చేసుకుంట. నా కన్నీటి జీవితమే నా పాట. కిన్నెరే నాకు తోడు.
ఎండకాలంలో ఊర్లల్ల పనులు లేనప్పుడు నన్ను పిలిచి కథ చెప్పించుకుంటరు. ‘మియాసాబ్ కథ’, ‘ఎండబెట్ల పకీరయ్య కథ’, ‘పండుగ సాయన్న కథ’, ‘ఒట్టెం రంగనాయకమ్మ కథ’, ‘ఎరుకల నాంచారమ్మ కథ’లు చెప్త. కిన్నెర కథలో ‘వంత’ఉండదు. కథలో కిన్నెరే ‘వంత’ పాడ్తది. కిన్నెర వాయిస్తూ.. అన్ని పాత్రలు నేనే అయిపోత. కథ అయిన తర్వాత తలా ఇంత ఇస్తే.. అదే నాకు జీవనాధారం. దాంతోనే బతుకు.
మా పాలమూరులో కరువు ఎక్కువ. పనిదొర్కదు. పొట్టచేత పట్టుకొని కాల్వలు తవ్వటానికి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఊరూరు తిరిగి మట్టిపని చేసిన. మేస్త్రీలు బువ్వపెట్టి మూడొందలు ఇచ్చేటోళ్లు.
ఓసారి అచ్చంపేట కోర్టు దగ్గర పెద్ద పెద్ద సదువుకున్నోళ్లు, వకీళ్లు, టీచర్లు మెడలో దండలేసుకొని నిరహారదీక్ష చేస్తున్నరు. తెలంగాణ కోసమట. ఎవలో గుర్తుపట్టి నన్ను పిలిసిండ్లు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్ల కొట్లాడాల్నో ఒకరెనుక ఒకరు మాట్లాడిండ్లు. అందరి మాటలిన్న. నేను కిన్నెర మీద ‘సై సై తెలంగాణ’ అని పాట పాడిన. ఎక్కడ్నించి వచ్చిన్రో పోలీసోళ్లు.. అందర్ని లాఠీలతో కొట్టి చెల్లాచెదురు చేసిండ్లు. ఓ పోలీసోడు లాఠీతో.. నా కిన్నెర బుర్రలను పగులకొట్టిండు. పానమోలె చూస్కొనే కిన్నెర బద్దలైపోయింది. కండ్లల్ల నీళ్లతో ఇంటికిచేరిన.
తెలంగాణ కోసం ఎక్కడ మీటింగ్ జరిగినా పోయేటో న్ని. ‘సై తెలంగాణ’ పాడేటోన్ని. తెలంగాణ వచ్చినంక కేసీయార్ సారు కిన్నెర పాటను ఆదుకున్నడు. రవీంద్రభారతిలో నాకు శాల్వ గప్పిండు. ఇల్లు జాగ ఇచ్చిండు. కిన్నెర గొప్పతనం ఢిల్లిదాక పాకింది. ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది. ఇది నాకొచ్చిన గౌరవం కాదు. తరతరాల కిన్నెర పాటకు వచ్చింది. నేనున్నా పోయినా.. కిన్నెర పాట పదికాలాలు బతుకాలె. ఇప్పుడు చాలమంది కిన్నెర నేర్చుకుంటమని నా దగ్గరికి వస్తుండ్లు. ఆసక్తి ఉన్నోళ్లకు కిన్నెర నేర్పిస్త. తెలంగాణ జానపద కళ వారసత్వాన్ని నిలుబెడుత.
-సాహితి