Telangana | భారతదేశంలో సుమారు 58 శాతం మంది ప్రజలు ప్రధానంగా వ్యావసాయిక ఆదాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య 2 శాతానికి అటూ ఇటూగా (జర్మనీ 1.2 శాతం, అమెరికా 2 శాతం, జపాన్ 2 శాతం) ఉంటుంది. ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ అనివార్యంగా, ఎలాంటి మినహాయింపుల్లేకుండా వ్యవసాయం మీదే ఆధారపడి బతికేవారి సంఖ్య అంతకంతకూ తగ్గుతూ వస్తుంది. అన్ని సంపన్న దేశాల్లోనూ సాధారణంగా కనిపించే పరిస్థితి ఇదే. రేవుల మీద ఆధారపడ్డ, ఖనిజ సంపద అధికంగా ఉన్న దేశాలు మాత్రమే ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. చైనాలో వ్యావసాయికుల సంఖ్య ఈ సరికే 25 శాతం కంటే దిగువకు పడిపోయింది.
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా మన దేశంలో అధిక సంఖ్యాకులు వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారనేది వాస్తవం. వారిలోనూ ఎక్కువ మంది చేసేది జీవనాధార వ్యవసాయమే. ఇదొక పేదరికపు విష వలయం. తమ జీవితకాలంలో వారు దీన్నుంచి విముక్తులు కాలేరు. ఎందుకంటే బయటపడేందుకు వారి దగ్గర మిగులు, పొదుపు, వెసులుబాటు, అవకాశాలు తగినంతగా ఉండవు.
భారతదేశంలో సగటున రైతుకు 2.6 ఎకరాల భూమి మాత్రమే ఉంది. 67 శాతం మందికి రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటుంది. చాలామందికి వ్యవసాయం విశ్వసనీయంగా, సురక్షితంగా, స్థిర ఆదాయవనరుగా ఉండదు. మరైతే సాగును వదిలేసి మరి దేనినో రైతు ఎందుకు వెతుక్కోడు? అని చాలా మంది అడుగుతుంటారు. వినడానికి నమ్మశక్యంగా ఉండదు కానీ, పేదరికపు ఉచ్చు నుంచి బయటపడేందుకు ఒక వృత్తిని వదిలిపెట్టి మరో వృత్తిని చేపట్టడం అంత సులభమైన విషయమేమీ కాదు. పొదుపు సొమ్ము, ఇతర సాధనాలు అందుబాటులో ఉంటేనే అది సాధ్యం. అందుకే దీన్ని విషవలయం అనేది. వేరే ఏదైనా చేపట్టేందుకు తగిన పెట్టుబడీ ఉండదు, చదువూ లేదా నైపుణ్యాలూ ఉండవు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకు మనమే ఒక సాదా సీదా ప్రశ్నను వేసుకోవాలి.
సగటు భారతీయ రైతుకు, సగటు నెలజీతం ఉద్యోగికి మధ్య మౌలికమైన తేడా ఏమిటి?
జవాబు: ఆదాయపరమైన విశ్వసనీయత (ఇంకా భరోసా).
భారతీయ రైతుల్లో అత్యధికుల చేతుల్లో ఉన్న భూమి రెండున్నర ఎకరాల లోపు కావడం వల్ల ఆదాయ స్థిరత్వం లోపిస్తుంది. కొన్నిసార్లు జరుగుబాటు ఉండొచ్చు, కొన్నిసార్లు లేకపోవచ్చు. తగినంత పెట్టుబడి వెసులుబాటు అనేది ఉండదు. నమ్మకమైన ఆదాయమూ ఉండదు. దీని ఫలితమే విష వలయం. సమస్యలు, కడగండ్లు, అనూహ్యమైన పరిస్థితులను భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటుంటారు. రెండేండ్లపాటు ఓ రైతు కష్టపడి పెట్టుబడి కూడబెట్టాడనుకుందాం. మూడో ఏడాది అనుకోకుండా వచ్చిపడిన కష్టంతో అది ఎగిరిపోవచ్చు. ఈ కష్టాలను స్థూలంగా ప్రకృతి వైపరీత్యాలు (అయితే అధిక వర్షం లేదా లోటు వర్షం), నీటివసతి లేకపోవడం, పంటలు పాడైపోవడం, మార్కెట్ ఎగుడు దిగుడులు (ధరలు పడిపోయి గిట్టుబాటు కాకపోవడం)గా వర్గీకరించుకోవచ్చు.
ఈ విషయమై సీఎం కేసీఆర్ వైఖరి చాలా సూటిగానూ, అదే సమయంలో మహోన్నతంగానూ ఉన్నది. రైతు ఆదాయాన్ని ఆయన విశ్వసించదగినదిగా (ఒక భరోసాగా) మారుస్తున్నారు. ఇది పైకి అతి సాధారణమైన లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నో సంక్లిష్ట సమస్యలు దీనితో ముడివడి ఉన్నాయి. ఎన్నో చువ్వలు.. అన్నిటిని కలిపి ఒక చక్రంగా మలచడం గొట్టుగా ఉంటుంది. ఇదెంత కష్టసాధ్యమంటే ఈ ఒక్కదానికే అర్థశాస్త్ర నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు.
1.రైతుబంధు: ఇది విశ్వసనీయత మొదటి పొర. నగదు వెసులుబాటు. రైతు ఏం చేస్తాడు, రైతుకేం జరుగుతుందనే దానితో ప్రమే యం లేకుండా మొత్తం రైతుకు అందుతుందని సందేశం ఇవ్వడమన్నమాట. ఇది నగదుకు సంబంధించిన మొదటి పొర అవుతుంది. దీంతో రైతు పరికరాలు లేదా పనిముట్లు కొంటాడో లేదా కూలీలకు జీతంగా ఇస్తాడో లేదా విత్తనాలే సేకరిస్తాడో, లేదా గడ్డు రోజుల్లో పిల్లలను పోషించుకునేందుకు ఖర్చు చేసుకుంటాడో రైతు ఇష్టం అని చెప్పడం.
2.కాళేశ్వరం, మిషన్ కాకతీయ, నీటిపారుదల, మిషన్ భగీరథ: ఇది విశ్వసనీయతలోని రెండో పొర. ఇదివరకు తెలంగాణ రైతులకు ఇది అందుబాటులో ఉన్న వ్యవహారం కాదు. తెలంగాణ రైతు ఎల్లప్పుడూ నీటి ఎద్దడితో కొట్టు మిట్టాడుతుండే వాడు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు ఎండిపోయేవి. కాలువల పారకం లేదు. సరైన ఆలనాపాలనా లేక చెరువులు ఎండిపోయి బీటలు వారేవి. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, తదితర నీటి పారుదల కార్యకలాపాల వల్ల ఇప్పుడు నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నది. రైతుకు ఇదొక విశ్వసనీయమైన వనరుగా నిలుస్తున్నది. ఇప్పుడు కాలువలు, చెరువులు, బోరుబావుల (కాళేశ్వరం, మిషన్ కాకతీయతో భూగర్భ నీటి మట్టాలు పెరిగాయి) నుంచి నీరు లభిస్తున్నది.
3.రోజుకు 24 గంటలు ఉచిత విద్యుత్తు: ఇది విశ్వసనీయతలో మూడో పొర. రోజులో ఎప్పుడైనా ఉచిత కరెంటు అందుబాటులో ఉంటుంది, రైతు సౌకర్యాన్ని బట్టి సాగు పనులు చూసుకోవచ్చునని చెప్పడమన్న మాట. ఉదయం నిద్రలేచిన తర్వాత పశువులకు దాణా వేసి, పిల్లలను బడి వద్ద దింపి, ఆ తర్వాత రైతు పొలానికి వెళ్లవచ్చు. ఉచిత విద్యుత్తు వల్ల పంపులో ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లుంటాయి. రాత్రి రైతు బాయికాడికి వెళ్లి పంపు వేయలేడు కాబట్టి నీరు లేక పంట ఏమవుతుందనే చింత అక్కర లేదు.
4. కనీస మద్దతు ధర, రైతువేదిక: ఇది విశ్వసనీయతలో నాలుగో పొర. ఇదిచ్చే సందేశమేమంటే… మార్కెట్లో ధరలు ఎంత లోతుకు పడిపోయినా రైతు సజావైన, గిట్టుబాటు ధరకు ఇది భరోసా కల్పిస్తుంది. సాగు వల్ల నష్టం వచ్చిందని రైతు అనుకోవాల్సిన పనిలేదు. ధరల దెబ్బ తీవ్రతను ఇది తగ్గిస్తుంది. మార్కెట్ అటూ ఇటూ అయినా మంచిరోజుల్లో అధిక ఆదాయం లభించేలా చూస్తుంది. దాంతో రైతు పొదుపు చేసుకోవచ్చు. రేపటి సంవత్సరాల్లో మంచి పంటలు తీయడానికి పథకాలూ వేసుకోవచ్చు.
5.రైతుబీమా: జీవితంలో ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. రైతు దురదృష్టవశాత్తు చనిపోతే రైతు కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోదని ధీమా ఇవ్వడం. ప్రతి నెలవారీ వేతన ఉద్యోగి తన కుటుంబానికి ఇచ్చే భరోసా ఇది. ఇదివరకు రైతుకు లేనిది ఇప్పుడు వచ్చి చేరిందన్న మాట.
6.ధరణి: ఇది విశ్వసనీయతలో ఆరో పొర. శతాబ్దాలుగా చట్టపరమైన రీతిలో, తగినవిధంగా ధ్రువీకరించిన పత్రాలు లేకపోవడం వల్ల భూమి అసలు యజమాని ఎవరనే విషయం ఈ గడ్డపై ఎప్పుడూ సమస్యగానే ఉండేది. జీతాల మీద బతికే ఉద్యోగి తగిన పత్రాలతో ఆస్తి పొందడం వల్ల కొనడం, అమ్మడం, తాకట్టు పెట్టడం, వీలునామా రాయడం సులభంగా ఉంటుంది. కానీ రైతు పరిస్థితి అలా కాదు. ధరణి వ్యవస్థ విశ్వసనీయతను, భరోసాను సమకూర్చింది. చట్టపరమైన మార్గాన్ని ఆవిష్కరించింది. చట్టబద్ధమైన రీతిలో లీజు ఒప్పందాలు రాసుకునేందుకు, బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు, రైతు తర్వాత ఆయన పిల్లలు ఎలాంటి చిక్కులు లేకుండా వారసత్వం పొందేందుకు వీలు కల్పించింది.
భారతీయ రైతుకు ఆదాయపరమైన విశ్వసనీయత, భరోసా కల్పించడం అనేది సుమారు 75 సంవత్సరాలుగా, అన్ని ప్రభుత్వాలకూ అసాధ్యమైన సమస్యగా ఉండింది. ఒక ఆర్థికవేత్తకు అదొక పీడ కల. రాజకీయ నాయకునికి ఎంతకూ వీడని చిక్కుముడి. అధికారికి అంతుచిక్కని పజిల్. ఈ వ్యవస్థతో మహామహా మేధావులు, ఉద్ధండులు కుస్తీలు పట్టినా అది కొరుకుడు పడలేదు. ఒక సర్వ సమగ్రమైన పరిష్కారమంటూ ఎవరూ చూపలేకపోయారు. తెలంగాణ వ్యవసాయరంగంలో ఆవిష్కృతమవుతున్న కేసీఆర్ మహోన్నత దార్శనికత ఈ భూగోళంపై ఒక సామాజిక, ఆర్థిక అద్భుతం తప్ప మరోటి కాదు. అది అత్యంత సంపూర్ణమైన, అత్యంత సమగ్రమైన, అత్యంత సమ్మిళితత్వంతో కూడిన సామాజికార్థిక పరిణామ సాధనం. చక్రంలో ఒక్కో చువ్వనే వంచుతూ అంతిమంగా భారతీయ రైతు ఆదాయాన్ని విశ్వసనీయమైనదిగా, భరోసానిచ్చేదిగా కేసీఆర్ మారుస్తున్నారు.
రైతు ఆదాయం విశ్వసనీయతను, భరోసాను సంతరించుకుంటే అతడు తన పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపగలడు, సమష్టి వ్యవసాయంలో పాల్గొనడం గురించి ఆలోచించగలడు, భవిష్యత్తులో బహుశా పారిశ్రామిక స్థాయి వ్యవసాయాన్ని చేపట్టగలడు. తగిన పత్రాలుంటేనే తన భూమిని ఇతర రైతులకు లీజుకు ఇచ్చుకోగలడు, తాకట్టుపెట్టి రుణం తీసుకుని కొత్త వ్యాపారమూ ప్రారంభించగలడు. ఇప్పడు ఆ ప్రయాణంలో సరిగ్గా మధ్యలో ఉన్నాం మనం. అందువల్ల మనలో చాలామందిమి చక్రంలోని చువ్వల గురించి అవగాహన చేసుకోలేకపోవచ్చు. లోపలి నుంచి వస్తున్న మార్పును గమనించలేకపోవచ్చు. కానీ చక్రం తిరుగుతున్నది.
మనం వరి ఉత్పత్తిలో నంబర్ 1. దేశంలో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రం మనది. వేగంగా అభివృద్ధి చెందుతున్న జీడీపీ మనది. మహత్తరమైన ఆదాయ అవకాశాలకు ఇది తొలి మెట్టు. ఈ కీలకమైన అడుగు లేకుండా పైనుంచి దిగువకు సంపద ప్రవహిస్తుందనే ఆర్థిక సిద్ధాంతం ఎంత రుద్దినా పనిచేయదు. నిజానికి ఈ పైనుంచి దిగువకు అనేదే ఓ పిచ్చిమాట. మిల్టన్ ఫ్రీడ్మన్ తప్పు. జెఫ్ బెజోస్ తప్పు. రోనాల్డ్ రీగన్ తప్పు.
కేసీఆర్ ఒక్కనికే అది సరిగ్గా అర్థమైంది. మనం ఈ చక్రాన్ని పూర్తిస్థాయిలో తిప్పగలిగితే 2032 నాటికి 12 వేల డాలర్ల తలసరి ఆదాయం, 2040 నాటికి 20 వేల డాలర్ల తలసరి ఆదాయం అందుకోగలం.
అనువాదం: తుమ్మలపల్లి రఘురాములు
-ద్రమిళ