సలికి గజగజా అనుకుతున్నయి దౌడలు. ‘గీ ఇగంల ఇప్పుడు వొయ్ ఏం జేద్దాం తియి’ అని మబ్బుల నాలుగ్గంటలకే మోగిన అలారాన్ని బంజేసి నిండా శెద్దరి కప్పుకున్న. కన్నంటుకున్నదంటే కతం ఇగ తెలివి గాలె. అసలైతే ఆరు గంటలకే ఎక్కాలె కన్నారం బస్సు. ఇంటికాన్నుంచి అమ్మ ఫోన్జేత్తె లేసి గడియారం మొకాన సూసేసరికి సిన్న ముల్లు ఏడు మీదాగింది. పెద్ద ముల్లు ఒక్కటిదాటి మెల్లగ వోతున్నది. సన్నముల్లేమో ఒక్కటేమొకాన ఉర్కుతున్నది.
జేబీఎస్… బస్సులు బాగనే ఉన్నయి కన్నారం మొకాన వొయ్యేటియి. అన్నీ ఖాళిగనే ఉన్నా ఒక్కదాంట్ల మాత్రం మంది నిండి రెండు మూడు సీట్లు ఖాళిగున్నయి. సీద వొయ్యి సీట్ల గూసున్న. ‘ఆ… టిక్కెట్, టిక్కెట్’ అనుకుంటా డ్రైవర్ నా దగ్గర్కి రాంగనే పర్సుదీసి దీత్తే గాని పర్సుల పైసల్లెవ్వనేది తెలువలే. ‘అన్నా… గూగుల్ పే గానీ, ఫోన్ పే గానీ ఉందానే..?’ డ్రైవరన్ననడిగిన. ‘లేదే’ అన్నడు. పక్కగ్గూసున్నోళ్లను, ఎన్కసీట్లోళ్లనడిగిన వాళ్లూ లెవ్వన్నరు. జేబీఎస్ బస్టాండుల ఎప్పుడ్జూసినా పైసలుండయనే విషయం తెల్సు గని, జల్ది బస్సెక్కాలన్న ఆగంల తొవ్వలున్న ఏటీఎంల పైసల్ తీసుడు మర్శిపోయిన. దేవుడా… ఈ సారన్నా ఏటీఎంలల్ల పైసలుండాలని నేన్గూసున్న సీట్ల బ్యాగు వెట్టి ఏటీఎంల దగ్గర్కి వోయ్న. ఒక్కదాంట్ల పైసల్లేవు. ఎంత తొందరుంటె ఏం లాభం..? బ్యాగు దీస్కొని బస్సు దిగుడే మంచిదనుకొని బస్సు దిక్కు వోతున్న. బస్సు చాల్జేసి డ్రైవరన్నా నా దిక్కే ఎదిరిసూత్తున్నడు ఎప్పుడొస్తడా అని. ఆయ్నను సూసుకుంట నేను బస్సు మొకాన నడుస్తుంటే… 2016, నవంబర్ 24వ తారీఖు జేస్కున్న నా దోస్తు శ్యాంగాని పెండ్లి గుర్తుకొచ్చింది.
శ్యాంగాడు నాకు వరుసకు కాకయితడు. చెడ్డీ దోస్తు గూడ. కల్సి సదువుకున్న క్లాస్మేట్లం గూడ. కానిస్టేబుల్ పన్జేసే మా కాక గానికి మ్యాన పిల్లతోనే పెండ్లి. పెండ్లి దగ్గర వడ్డదనే మోపు పిల్లనిచ్చే అత్తకు పాతరోగాలు తిర్గవడి మంచానవడ్డది. మామనేమో ముసలాయ్నె. వీడే పెద్దమన్సు జేస్కొని వాళ్ల పని, వీళ్ల పని ఆకం మీదేస్కున్నడు. కరెక్టు అదే టైంల పెద్ద నోట్లు రద్దయినయి. ఇగ వానికేం జెయ్యాల్నో సమజ్ గాలె. ఏడికివోయినా పాత పైసల్ని లెక్కజేసుడు లేదు. చేస్కోబోయే పిల్లను ఎంబడివెట్కొని బంగారం కొందామని వోతే ‘ఎహె గీ పాత నోట్లెక్కడ చెల్లుతయి’ అని దుక్నమాయ్నె అన్నడట. ఇట్ల వాడు వడ్డ తిప్పలెన్నో.. బ్యాంకుకు వోతె రెండు వేలకన్న ఎక్కువిచ్చుడు లేదు. పాపం వైభోగంగా పెండ్లి జేస్కుందామని అకౌంట్ల దాసిపెట్టుకున్న ఆరు లచ్చల రూపాలు అక్కెరకు రాకపాయెనని కొద్ది బాధ వల్లే. ఇగ పెండ్లే క్యాన్సిల్ చేస్కుందామనుకునే మోపున ‘ఎత్తిపోయిన పెండ్లి ఏడేండ్లయినా గాదురా..’ అని వాళ్ల పెద్దనాయిన ఎతిరాజం చెప్పిన మాట గుర్తుకొచ్చి కతకతోలె కార్యం ఒడ్డెక్కిచ్చుకున్నడు. ఒక్క మా కాక గాడే గాదు, దేశం మొత్తంల ఇదే పరిస్థితి. ఎంతోమంది పేదలు పైసల కోసం తిప్పల వడ్డరు. లైన్ల నిలవడి ఉన్నకాన్నే కూలవడి కాలం జేసిర్రు. బల్శినోనికి ఎక్కన్నుంచో మా అచ్చినయి గని పైసలు, బక్కపల్సనోడే పాపం సంటర్ సర్కార్ తీస్కున్న నిర్ణయానికి బలైండు..
ఎప్పుడు వోయినా ఏటీఎంల పైసలుంటయనే నమ్మకం 2016 నవంబర్ 8తోనే వోయింది. అప్పట్నుంచి ఇప్పటిదాన్క గూడ దేశం బాగువల్లే అని మనుసులనుకుంటా బ్యాగుదీస్కొని బస్సు దిగుతున్న. ‘ఎటువోతున్నవే’ అన్నడు డ్రైవరన్న రాజిరెడ్డి. కన్నారం-2 డిపోల పన్జేస్తడు. ‘ఏ ఏటీఎంల జూసినా పైసల్లెవ్వే.. ఏడన్న ఏటీఎంల పైసలు దొరికితె వేరే బస్సులొస్తా’ అన్న. ‘పైసల్లేకుంటేందే…? నువ్వైతే టిక్కెట్ జేబుల వెట్కో’ అని టిక్కెట్ కొట్టిండు. ‘బస్సు కన్నారం బస్టాండ్లకు వొయ్యేసరికి పైసలిస్తే సాలు, నువ్వొయ్యి ఓ కునుకు తీయి పో’ అని ధైర్నంగా లోపలికి దోలిండు.
బస్సు జేబీఎస్లకెళ్లి బైలెల్లింది. పదిన్నర కల్లా కొమురెల్లి కమాన్ కాడికి చేరింది. కొమురెల్లి కాడ మల్లన్నకు రెండుచేతులా దండం వెట్టుకున్న. బస్సు కొమురెల్లి దాటి దుద్దెడ టోల్గేట్ కాడికి చేరుకున్నది. ఒక్కసారి సిద్దిపేటల ఉండే ఆకుల భాస్కరన్న యాదికొచ్చిండు. భాస్కరన్నకు ఫోన్ గొట్టి ‘వెయ్యి రూపాలు వట్టుకొని సిద్దిపేట మేన్రోడ్డు మీదికి రాయె’ అని జరిగిన ముచ్చట జెప్పిన. పది నిమిషాల తర్వాత భాస్కరన్న నుంచి ఫోన్ ‘తమ్మీ సిద్దిపేట బైపాస్ల తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ఎదురుసూత్తున్న’ అన్నడు. ఎన్కసీట్ల గూసున్న నేను డ్రైవరన్న దగ్గరికి వొయ్యేసరికి స్థూపం రానె అచ్చె. డ్రైవరన్నకు చెప్తె స్థూపం పక్కపొంటి స్లో జేసిండు. బస్సు దగ్గరికచ్చిన భాస్కరన్న వెయ్యి రూపాలు చేతిల వెట్టిండు. ఆ వెయ్యిల కెల్లి డ్రైవరన్నకు టికెట్ పైసలిచ్చిన. డ్రైవరన్న ఎన్కసీట్లనే గూసొని ఆయ్నతోని ముచ్చట మొదలువెట్టిన.
‘అన్నా పైసల్లేకుండనే టిక్కెట్ ఇచ్చినవ్.. నేనెగ్గొడితేనో లేకపోతె మర్శిపోతెనో ఎట్లుంటుండెనే’ అని డ్రైవరన్ననడిగిన. ‘అవ్వి దండి పైసాలానె, జేబులకెల్లి కట్టుకుందు, అసొంటియెన్ని కర్సుగావు… అయినా నువ్వు నియ్యతిగిచ్చినవ్ గదనె… నువ్విచ్చినవ్ కావట్టి నా వల్ల టీఎస్ఆర్టీసీకి కొంత న్యాయం జరిగినట్టే కదా! నేను తీసుకునే జీతానికి న్యాయం చేస్తున్నట్టే కదా’ అని ఉల్టా నన్నే అడిగిండు.
‘తెలిసో, తెలియకనో సమ్మె జేసినం. నౌకర్లు ఇగూడిపోతయనుకునే మోపున సీఎం సార్ పెద్ద మనసు జేస్కొని మళ్లా నౌకర్లకు తీసుకున్నడు. సమ్మె కాలం జీతం గూడ ఒక్కరోజు వోకుంటిచ్చిండు. కార్మికుల మనిషి కావట్టే కార్మికుల కట్టాలను అర్థం చేసుకున్నడే.
ఇప్పుడు సంటర్ సర్కార్ అన్నింటిని ప్రైవేటోనికి అప్పజెప్తుంటె సూస్కుంట ఉంటలేమా? అప్పుడే ఆర్టీసీని కూడా ప్రైవేటు జేస్తే ఏం జేసేటోళ్లం? అందుకే కార్మికుల జీవితాలు బాగుండాలంటే, ఆర్టీసీ లాభాల బాట వట్టాలె, అందుకు నా వంతు పని నేన్జేస్తున్న.’ అని బంగారమసొంటి ముచ్చట జెప్పిండు రాజిరెడ్డి. డ్రైవరన్న మాటిన్న నాకు ‘కార్మికుల నియ్యతికి జిందాబాద్’ అని గట్టిగ అరువబుద్దయింది.
9959059041