ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2022-23 రెండవ త్రైమాసికానికి సంబంధించిన అర్థిక సమాచారాన్ని విడుదల చేసింది. ఈ కాలంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉందని, ఇది ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ అంచనాలకు దగ్గరగా ఉందని ప్రకటించింది. దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ, కొవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన సమస్యలను దేశం అధిగమించే దారిలో ఉందని, ఈ ఆర్థిక సంవత్సరానికి 6.8 నుంచి 7 శాతం జీడీపీ పెరుగుదల సాధ్యమవుతుందని, ఇది మోదీ ప్రభుత్వ విజయమని తెలిపారు. ఈ మాటలు ఎంత సత్య దూరమో, మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారుతున్నదో కేంద్ర ప్రభుత్వ గణాంకాలను లోతుగా పరిశీలిస్తే తెలిసిపోతుంది.
2022-23 అర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో జీవీఏ పెరుగుదల జీడీపీ పెరుగుదల కన్నా తక్కువ:
జీడీపీ వస్తు సేవల మొత్తానికి సూచిక కాగా, అదే జాతీయ ఆదాయాన్ని సరఫరాల కోణంలో జీవీఏ లెక్కిస్తుంది. జీడీపీకి, జీవీఏకు సంబంధాన్ని ఈ కింది సమీకరణం తెలియచేస్తుంది.
జీడీపీ = జీవీఏ + ప్రభుత్వం పొందిన పన్నులు – ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు
ఈ సమీకరణం ప్రకారం ప్రభుత్వం వసూలు చేసే పన్ను, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కంటే ఎక్కువ ఉంటే జీవీఏ కన్నా జీడీపీ ఎక్కువ నమోదు అవుతుంది.
2022-23 అర్థిక సంవత్సరంలో జీవీఏ పెరుగుదల 5.6 శాతంగా ఉండగా జీడీపీ పెరుగుదల 6.3 శాతంగా ఉంది. అంటే ప్రభుత్వం వసూలు చేసిన పన్ను ఇదే కాలంలో సబ్సిడీల కంటే 0.7 శాతం ఎక్కువ. కొనుగోలు శక్తి లేక డిమాండ్ పడిపోతూ కొవిడ్ అనంతరం ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఉంటే, మోదీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం పెంచి, సబ్సిడీలు తగ్గించిందని స్పష్టమవుతున్నది. 2014-17లో మూడు ఆర్థిక సంవత్సరాల మధ్యలో జీడీపీ 28.8 శాతం వృద్ధి చెందగా జీవీఏ 27.3 శాతం ఎక్కువగా ఉంది. పెట్రోల్/డీజిల్/ఎల్పీజీ పై సబ్సిడీ తగ్గడంతోపాటు, వాటిపై గణనీయంగా ట్యాక్స్ పెరుగుదల ఇందుకు కారణం కావచ్చు. అంటే ఈ మూడేండ్ల కాలంలో ట్యాక్స్ పెరుగుదల సబ్సిడీల కన్నా 1.5 శాతం ఎక్కువగా ఉంది. 2017-20లో మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో జీడీపీ పెరుగుదల 16.8% గా ఉండగా జీవీఏ పెరుగుదల 16.6 శాతం. జీవీఏ జీడీపీతో దాదాపు సమానంగా ఉంది. ఇదే కాలంలో ఎన్నికల సందర్భంగా మోదీ పీఏం కిసాన్, తదితర ఉద్దీపనలను ప్రకటించడం వల్ల ట్యాక్స్ పెరుగుదలకు దాదాపు సమానంగా సబ్సిడీ ఉందని భావించవచ్చు. జీడీపీ, జీవీఏలు 2014-17, 2017 -20 మధ్య కాలంలో సు మారు 12 శాతం తగ్గాయి. అంటే నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ అమలు, ఇతర కారణాల వల్ల దేశ వృద్ధి కొవిడ్కు ముందే భారీగా పడిపోయిందని స్పష్టమవుతున్నది. ఇక 2020-23 కొవిడ్ ప్రభావిత ఆర్థ్ధిక సంవత్సరాలలో జీడీపీ, జీవీఏ రెండింటి పెరుగుదల 7.6శాతంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పిన ఉద్దీపన వట్టి జుమ్లా అని, ట్యాక్స్ ఎంత వసూలు అయ్యిందో సబ్సిడీ అంతే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఉత్పత్తి రంగం మైనస్ 4.3 శాతంగా ఉంది. అంటే ఉత్పత్తిలో 4.3 శాతం తగ్గుదల ఉన్నట్టు. 2014-17లో ఉత్పత్తి పెరుగుదల 31.3 శాతం గా ఉండగా అది 2017-20 లో 10.6 శాతంగా ఉంది. అంటే కొవిడ్కు ముందే ఉత్పాదక రంగం 20.7 శాతం తక్కువ పెరుగుదల (నోట్ల రద్దు, జీఎస్టీ తరువాత- గతంతో పోలిస్తే) కలిగి ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే మేక్ ఇన్ ఇండియా అని మోదీ గొప్పగా ప్రారంభించిన స్కీమ్ పూర్తిగా విఫలమైంది. 2020-23లో ఉత్పత్తి పెరుగుదల (కొవిడ్ సమయంలో) 6.3 శాతంగా నమోదు కాగా, 2022-23 రెండవ త్రైమాసికంలో -4.3% గా నమోదైంది. అంటే మోదీ ప్రభుత్వం గొప్పగా ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏమాత్రం ప్రభావం చూపలేదని తెలుస్తున్నది.
ఉత్పత్తి రంగం కృశించి పోవడం వల్ల ఉద్యోగ కల్పన జరగకపోగా, నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ వలన 2016-18 లో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోయాయని అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయంలోని స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా గ్రూప్ 2019 నివేదికలో తెలిపింది. దేశంలో నిరుద్యోగం 6.1 శాతానికి చేరుకుందని, ఇది 45 ఏండ్లలోనే అత్యధికమని భారత ప్రభుత్వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2019 మే నివేదికలో తెలిపింది. ఇక కొవిడ్ తర్వాత పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. 2022 అక్టోబర్లో ప్రచురితమైన సీఎంఐఈ డేటా ప్రకారం దేశంలో నిరుద్యోగం 8.1 శాతంగా ఉంది. 2011తో పోలిస్తే దేశంలో నిరుద్యోగం 2022 నాటికి 300% పెరిగిందని ఇది దేశ ఆర్థిక పరిస్థితికి ప్రమాదకరమని భారత ప్రభుత్వ మాజీ చీఫ్ స్టాటిస్టీషియన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
గృహ సముదయాలు, నాన్ఫ్రాఫిట్ ఇన్స్టిట్యూషన్స్ సెర్వింగ్ హౌజ్ హోల్డ్స్ వస్తు, సేవల కోనుగోలుకు వినియోగించే మొత్తం ఖర్చును పీఎఫ్సీఈ అంటారు. ఈ ఖర్చు పెరుగుదల 2014-17 లో 22.7 శాతం ఉంటే, 2017-20 లో 20.9 శాతంగా ఉంది. ఈ పెరుగుదల నోట్ల రద్దు తరువాత తగ్గడం గమనించవచ్చు. 2020-23 లో మరింత తగ్గి పెరుగుదల 11.2 శాతంగా నమోదైంది. అంటే ప్రజల కొనుగోలు శక్తి వృద్ధి రేటు క్రమంగా తగ్గింది. గృహ సముదాయాల పొదుపు రేటు గణనీయంగా ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి చేరుకుందని మింట్ పత్రిక తన నివేదికలో తెలియచేసింది. పొదుపు రేటు 2021 మార్చి నాటికి 15.9 శాతం ఉంటే 2022 మార్చికి 10.8 శాతానికి తగ్గిపోయిందని తెలిపింది. ద్రవ్యోల్బణం, జీతాల పెరుగుదల తగినంత లేకపోడం ఇందుకు కారణమని నివేదిక అభిప్రాయపడింది. ఈ నివేదికను పీఎఫ్సీఐ వృద్ధి రేటుకు అనువదిస్తే ప్రజల కొనుగోలు శక్తి, పొదుపు శక్తి గణమీయంగా పడిపోయిందని స్పష్టం అవుతుంది.
ప్రభుత్వం సముదాయ అవసరాలకు, వస్తు, సేవల కొనుగోలుకు ఖర్చు చేసే వ్యయాన్ని జీఎఫ్సీఈ అంటారు. జీఎఫ్సీఈ పెరుగుదల 201 4-17 లో 22.8 శాతం ఉంటే అది 2017-20 నాటికి తగ్గి 21.9 శాతానికి చేరుకుంది. 2020-23 నాటికి మైనస్ 19.7గా నమోదైంది. అంటే 19.3 శాతం ప్రభుత్వ ఖర్చు తగ్గింది. కొవిడ్ కాలంలో ప్రభుత్వం తక్కువగా ఖర్చు చేసింది.
మౌలిక వసతులు, ఆస్తుల పెంపుదలకు ఉద్దేశించిన ప్రభుత్వ పెట్టుబడులను జీఎఫ్సీఫ్ అంటారు. 2014-17లో జీఎఫ్సీఎఫ్ పెరుగుదల 17.2 శాతంగా ఉంది. 2017-20లో ఆర్థిక వ్యవస్థ నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాన్ని పూరించడానికి జీఎఫ్సీఎఫ్ను 19.7 శాతానికి పెంచక తప్పలేదు. ఇక 2020-23లో జీఎఫ్సీఎఫ్ పెరుగుదల 20.8 శాతంగా ఉంది. ఈ పెరుగుదల ఆశాజనకంగా ఉన్నా ఆర్థిక చక్రాన్ని గాడిలో పెట్టేంతగా లేదు. అంటే కొవిడ్ ఉద్ద్దీపన, ప్రధాన మంత్రి గతి శక్తి వట్టి డంబాచారాలే అని జీఎఫ్సీఎఫ్ పెరుగుదల చూస్తే అర్థమవుతున్నది. మోదీ ప్రభుత్వం 8 ఏండ్లలో చేసిన 100 లక్షల కోట్ల అప్పు జీఎఫ్సీఎఫ్ అభివృద్ధిలో కేంద్రం డప్పు కొట్టుకునే అంతగా లేని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఇక రాష్ర్టాల విషయానికి వస్తే ఎఫ్ఆర్బీఎం పరిధిలో అప్పులకు కేంద్రం అనేక ఆంక్షలు పెట్టడం వల్ల రాష్ర్టాలు అభివృద్ధి కార్యక్రమాల కోసం తగినన్ని నిధులను సమకూర్చుకోలేక పోతున్నాయి.
బడ్జెటేతర రుణాలపై ఆంక్షలను రిట్రాస్పెక్టివ్గా అమలు చేసి, రాష్ర్టాల ఎఫ్ఆర్బీఎం రుణాల్లో కోత విధించారు. ఈ విధంగా రాష్ర్టాలను బడ్జెట్లో సూచించిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకోలేని దుస్థితికి కేంద్రం నెట్టింది. అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు కుంటుబడేలా మోదీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, ఇలాంటి నిర్ణయం రిట్రాస్పెక్టివ్గా అమలుచేసి ఎఫ్ఆర్బీఎం నిధుల్లో కోతలు విధించి ఉండక పోవాల్సిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో కూడా మోదీ ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు చేపట్టకపోగా మతం, హిజాబ్, పాకిస్థాన్, చైనా అంటూ ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నది. డంబాచారపు ప్రగల్భాలు, సత్య దూరపు మాటలతో ప్రభుత్వాన్ని ‘ఈవెంట్ మనేజ్మెంట్ సంస్థ’ లాగా నడపడం శోచనీయం.
పెండ్యాల మంగళాదేవి