వ్యాఖ్యాన రచనతో కాళిదాసాది కవుల కావ్యాలకు దీప్తినిచ్చిన మల్లినాథుడు వ్యాఖ్యానమనే ప్రక్రియకు ఆద్యుడు కాదుకానీ, వ్యాఖ్యానమంటే వినిపించే మొదటి పేరు ఆయనదే.వ్యాఖ్యానానికి పదచ్ఛేదః పదార్థోక్తిః విగ్రహో వాక్యయోజనాః పూర్వపక్ష సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం. పదాలవిరుపు, పదాలకు అర్థం, సమాసాలకు విగ్రహవాక్యాలు, తాత్పర్య,(భావ) నిర్ణయం, ఆక్షేపణలకు సమాధానాలు ఈ ఐదు లక్షణాలు ప్రధానమైనవి. ఈ అయిదింటినీ పాటిస్తూనే తనదైన ముద్రతో వ్యాఖ్యాన రచన చేశాడు మల్లినాథుడు. టీకా, వృత్తి, భాష్య లాంటి పదాలు కూడా వ్యాఖ్యానానికి దగ్గరగా వినిపిస్తాయి. ఇవన్నీ రచనలోని అంశాన్ని, కళను ఉద్దీపితం చేసేవే.అందువల్లే మల్లినాథుడు వ్యాఖ్యాన చక్రవర్తి అయ్యాడు. మల్లినాథుని వ్యాఖ్యానాలు
పండితులను మెప్పించాయి. ఉత్తమ మైనవిగా నిలిచాయి.
ప్రతి పండితుని విషయంలో ఉండే కాలం, ప్రాంతానికి సంబంధించిన వివాదాలు మ ల్లినాథునికి సంబంధించి కూడా ఉన్నాయి.కానీ మల్లి నాథుడు తన వ్యాఖ్యానాలలో రచనలలో ఇచ్చిన వివరాల వల్లే ఆయన కోలాచల నివాసి అని రూఢీ అయింది. మల్లినాథుని ఇంటిపేరు కోలాచల, కోలాచెల, కోలంచెల్మ, కోలచెర్ల అనే పేర్లతో దీనికి రూపాంతరాలు కనిపిస్తున్నాయి. ప్రాచీన గ్రంథాలు పటాన్చెరువుకు దగ్గరివిగా మెదక్ జిల్లాకు చెందినవిగా రాశాయి. మల్లినాథుని వంశీకుల్లో అందరూ పండితులే.మల్లినాథుని తాత కాకతీయులనుండి కనకాభిషేకాన్ని పొందినట్టు పండితులు చెబుతారు. ఈ వంశంలో తొమ్మిదవవాడైన నారాయణ పండితుడు చంపూ రామాయణానికి వ్యాఖ్యాత. కాకతీయులకు, రాచకొండ వంశానికి ఈ వంశంవారు దగ్గరివారు. ప్రతాపరుద్రుని నుంచి కనకాభిషేకం తాత తీసుకుంటే, మల్లినాథుడు రాచకొండ ప్రభువులనుంచి మహామహోపాధ్యాయ బిరుదును స్వీకరించినట్టు ఆధారాలున్నాయి.
మల్లినాథుని వంశంలోనూ ఇద్దరు మల్లినాథులున్నారు. మొదటి మల్లినాథునికి కపర్ది అనే కుమారుడున్నాడు.కపర్దికి ఇద్దరు కుమారులు మల్లినాథుడు,పెద్దిభట్టు.ఈ రెండవ మల్లినాథుడే కావ్యవ్యాఖ్యాత. ఈ రెండవ మల్లినాథునికి కుమారస్వామి సోమ పీథి. పెద్దయార్యుడు అని కుమారులు. ఈ విషయాలు ఆయన కుమారుడు కుమారస్వామి సోమ పీథి విద్యానాథుని ప్రతాపరుద్రీయానికి రాసిన రత్నాపణ వ్యాఖ్యవల్ల తెలుస్తున్నాయి.
ఈ పెద్దిభట్టుకు మల్లినాథునికి సంబంధాలను ఏర్పరచి మల్లినాథుడు కాదు వ్యాఖ్యాత పెద్దిభట్టే అన్నవాళ్ళున్నారు.మాఘుని శిశుపాల వధ వ్యాఖ్యానంలో ప్రాచీన ప్రతిలో పెద్దిభట్టు రాసిన అనే పదంవల్ల ఈ గందరగోళం మొదలైంది.తరువాతి ప్రతుల్లో పెద్దిబొట్టు ప్రస్తావనలు పండితులు ఉపసంహరించారు.
రఘువంశకావ్యానికి సంజీవని వ్యాఖ్య రాస్తూ వాణీం కణ భుజీంఅని ఒకశ్లోకాన్ని రాశాడు మల్లీనాథుడు. ఈ శ్లోకం మల్లీనాథుని పాండిత్యం ఎలాంటిదో చెబుతుంది. కణాదుడు రాసిన వైశేషిక సూత్రాలు, పతంజలి వ్యాకరణం,వ్యాసుడు రాసిన పద్దెనిమిది పురాణాలు, గౌతమ న్యాయ సూత్రాలు మొదలైన వాటిపట్ల తనపాండిత్యాన్ని గురించి తానే చెప్పుకున్నాడు. అంతే కాదు.-భారతీ కాళిదాసస్య దుర్వ్యా ఖ్యా విషమూర్ఛితా/ఏషా సంజీవని టీకా తామద్యోజ్జీవయిష్యతి కాళిదాసుకవిత్వం దుర్వాఖ్యలవల్ల మూర్చపోయింది. ఈ సంజీవనీ వ్యాఖ్యతో ప్రాణం పోస్తానన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలే కాదు.రచనలోనూ వేదం, వ్యాకరణం, తంత్రశాస్త్రం మొదలైన అనేక విషయాలను కోశాలను అలవోకగా సమన్వయం చేయ డం కనిపిస్తుంది.ఇలాంటి అంశాలు చూస్తే మల్లినాథుని పాండిత్యం,పూర్వాశ్రమంలో ఉన్న దుర్మేధసత్వం అన్నీ కల్పిత కథలేనని అర్థమవుతుంది.
మల్లినాథుని వంశంలో కుమారస్వామి సోమ పీధి లాగానే వ్యాఖ్యాతలు మరికొందరున్నారు. వారిలోనారాయణ పండితుడు ఒకడు. ఈయన ఒక్కడు మాత్రమే పెద్దిబొట్టు అనే సోదరుడు మల్ల్లి నాథునికున్నాడని రాశాడు. మరికొందరు మల్లినాథునికి కుమారస్వామి సోమ పీధి,పెద్దయార్యుడు ఉన్నాడని పెద్దయార్యుడే పెద్దిబట్టు అని అన్నారు. సర్వమనోజ్ఞ మంజరి అనే పుస్తకానికి వ్యాఖ్య రాసిన గిరినాథుడు మల్లినాథుని కుమారుడని రాశాడు. చివరగా తేల్చుకునేదేమిటంటే వ్యాఖ్యాత అయిన మల్లినాథుడే నిజమైన వ్యాఖ్యాత అని ఆయనే ఈ వ్యాఖ్యానాలూ రచనలు చేశాడని నమ్మవచ్చు.అదే సత్యం కూడా.
మల్లినాథుని కాలం కూడా చాలా చర్చనీయాంశంగానే ఉండిపోయింది. దానికి కారణం మల్లినాథుని కాలాన్ని సుమారుగా క్రీ.శ.1133నుండి క్రీ.శ. 1450 మధ్యదిగా ఊహించారు. మల్లినాథుడు తాను రాసిన వ్యాఖ్యల్లో ఒక శ్లోకాన్ని సాధారణంగా ఉదహరించేవాడు. అది హర్షచరితాన్ని రాసిన బాణభట్టు శ్లోకం. ఇదేశ్లోకం విజయనగర రాజైన అచ్యుతరాయల కాలం నాటి శాసనాల్లో కూడా కనిపిస్తుంది. అచ్యుతరాయల కాలం క్రీ.శ.1533-1534. అందువల్ల మల్లినాథుడు ఈ కాలానికన్నా ముందువాడని నిర్ణయించారు.
గ్రంథాలలో పేర్కొన్న ఆధారాలవల్ల మల్లినాథుని రచనలు సుమారుగా ఇరవై అని అర్థమవుతుంది. ఇందులో వ్యాఖ్యానాలు స్వీయ గద్య పద్య రచనలు ఉన్నాయి. మల్లినాథుడు ప్రసిద్ధుడైంది వ్యాఖ్యాతగానే.ఒక్కో వ్యాఖ్యానానికి ఒక్కో పేరు పెడతాడు మల్లినాథుడు. రఘువంశ కుమార సంభవాలకు,ఖండ కావ్యం మేఘ సందేశానికి రాసిన వ్యాఖ్యానాలకు సంజీవనీ వ్యాఖ్య అని పేరు పెట్టాడు. పైన చెప్పుకున్నట్టు దుర్వ్యాఖ్యానాలవల్ల మూర్చిల్లిన కాళిదాస వాక్కుకు సంజీవనినిస్తున్నానని తానుగానే చెప్పుకున్నాడు. కానీ కాళిదాసు మరో ఖండకావ్యమైన ఋతుసంహారాన్ని ముట్టుకోలేదు. అంతే కాదు ప్రాచీన గ్రం థాల్లోని సూత్రాలను కాదని మహకావ్యాది నిర్మాణ సూత్రాలను పునస్సమీక్షించాడు. మేఘ సందేశానికి అక్కడక్కడా నగర నదీ సంద్ర వర్ణనలవల్ల మహాకావ్యత్వం సిద్ధించిందన్నాడు. భారవి కావ్యానికి ఘంటాపథ వ్యాఖ్య అని పేరు పెట్టుకున్నాడు. ‘ఘంటాపథం కమపి నూతనమాతనిష్యే’ అని చెప్పుకున్నాడు. ఘంటాపథం అంటే ఘంటలుగ దారి. అంటే నిసందేహమైన రాజమార్గము లాంటిదని అర్థం. అంతే కాదు నూతన ఆవిష్కరణలు చేస్తానని మాట ఇచ్చాడు.
స్వాదయంతు రసగర్భ నిర్భరం సార మస్య రసికా యథేప్సితం-రసికులైన వాళ్ళు రసగర్భ నిర్భరమైన ఈ కావ్య సారాన్ని ఇష్టంవచ్చినట్లుగా ఆస్వాదించమని అన్నాడు.ఈ ఘంటపథ శబ్దం చాలా వరకు అనేకమంది పండితులు తమ వ్యాఖ్యానాల్లో వాడుకున్నారు. మాఘుని శిశుపాల వధకు సర్వంకషా వ్యాఖ్య అని పేరుపెట్టుకున్నాడు. సర్వంకషా అంటే అన్నిటినీ పరీక్షించి, వాటికన్నా మేలైన,లోతైన సరైన అర్థాన్నిచ్చినది అని అర్థం. దీని ప్రారంభంలోనే ఒకశ్లోకంలో శబ్దార్థాలను ప్రేమించే వారు, గుణాలను అలంకారాలను ఇష్టపడేవారు, శిక్షాది శాస్ర్తాల ఆధారంగా కుతూహలంగా పరీక్షించే వాళ్ళు, ధ్వని మార్గంలో పరీక్షించే వాళ్ళు,కలతపెట్టే భావాలవల్ల రససిద్ధినిపొందేవారు.వారందరికోసం ఈ మాఘకావ్యాన్ని సర్వంకషావ్యాఖ్యానంతో అందిస్తున్నానని చెప్పాడు. మాఘ కావ్యానికి అనేకమైన వ్యాఖ్యానాలున్నాయి.అందులో మేటివ్యాఖ్య మల్లినాథునిదని పరిశీలకుల అభిప్రాయం. నైషధీయకావ్యం శ్రీహర్షుని రచన. దీనికి జీవాన్ని పోసానని చెప్పుకుని, జీవాతువ్యాఖ్యగా పేరుపెట్టాడు.
భట్టి కవి కావ్యానికి రాసిన వ్యాఖ్యానానికి సర్వపథీనవ్యాఖ్య అని పేరు పెట్టాడు. అంటే అన్ని మార్గాలను వ్యాపించింది అని అర్థం.ఇవన్నీ కావ్యాలకు రాసిన వ్యాఖ్యానాలు రెండు శాస్త్ర గ్రంథాలకూ వ్యాఖ్యానాన్ని రాశాడు. అవి ఏకావళి,రెండవది తార్కిక రక్ష. విద్యాధరుని ఏకావళి అనే గ్రంథానికి రాసిన వ్యాఖ్యకు తరళ వ్యాఖ్యానమని పేరు పెట్టాడు.తనప్రకాశంతో కదిలే దానిని తరళం అంటారు. వరద రాజు తార్కిక రక్షకు రాసిన వ్యాఖ్యానానికి నిష్కంటక వ్యాఖ్య అని పేరు పెట్టాడు.అంటే శత్రువులు లేనిది అని అర్థం.
మల్లినాథుడి వ్యాఖ్యలుగా కొంతమంది అంగీకరించని పుస్తకాలున్నాయి. ఈ వ్యాఖ్యలు అనేకమంది అంగీకరించినా ఇవి మల్లీనాథునివి కాదని కొందరిభావన. అవి సిద్ధాంజన వ్యాఖ్య పేరుతో తంత్రవార్తికానికి రాసిన వ్యాఖ్య, పరిమళ వ్యాఖ్య పేరుతో స్వరమంజరికి రాసిన వ్యాఖ్య, నిష్కంటక పేరుతో ప్రశస్త పాద భాష్యకు రాసిన వ్యాఖ్యానం. ఇవి ఆయన కుమారులు రాసినవా? ఆయన రాసినవా? అనే సందేహాలున్నాయి.కొన్ని గ్రంథాలలో వేర్వేరుగా చెప్పడ మూ ఒక కారణం. తన తరళవ్యాఖ్యలో మల్ల్లినాథుడే ఈ వ్యాఖ్యానాలను రాసినట్టు పేర్కొన్నాడు. ఇవి కాక మల్లినాథునివిగా గుర్తించిన పుస్తకాలు కొన్ని ఉన్నా యి. కొందరు విమర్శకులు వీటిని మల్లినాథునివేనన్నారు. న్యాస వ్యాఖ్య పేరుతో రాసిన న్యాసోద్ధ్యోతము, వైమల్య విధాయిని పేరుతో కావ్యాదర్శానికి రాసిన వ్యాఖ్య, తరళ వ్యాఖ్యానం పేరుతో రాసిన నలోదయకావ్య వ్యాఖ్య. తరువాతి కాలాల్లో ఈ పుస్తకాలన్నీ ఆయన రాసినవేనని పరిశీలకులు భావించారు. మల్లినాథుడు వేదం, వ్యాకరణం, మీమాంస శాస్ర్తాల్లో పండితుడు.ఆయన వ్యాఖ్యానాల్లో వీటి ప్రతిఫలనాలు కనిపిస్తాయి.
మల్లినాథుని స్వీయ రచనలు ఐదు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో మనకు దొరికినవి చాలా తక్కువ. అక్కడక్కడ కావ్యాల్లో, వ్యాఖ్యానాల్లో అలంకార శాస్త్ర గ్రంథాల్లోని ఉటంకింపులవల్ల ఈ గ్రంథాలున్నాయని నమ్మకం. ఇవి వైశ్యవంశ సుధాకరం, రఘువీర చరితం, ఉదార కావ్యం, భక్తి రహస్యం, నక్షత్రపాతాధ్యాయము. చివరి మూడింటి కర్తృత్వం విషయంలో సందేహాలున్నాయన్నారు. వ్యాఖ్యానాలు కూడా పన్నెండుమాత్రమే మల్లినాథునివని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మల్లినాథుడు మూడు జ్యోతిష గ్రంథాలు రాశా డంటారు. నక్షత్ర పాతాధ్యాయ రచన అలాంటిదే. అయితే ఇది పూర్తి జ్యోతి ష గ్రంథం కాదు. ఖగోళ శాస్ర్తాన్ని ఆధారం చేసుకున్న గ్రంథం. సుప్రసిద్ధ పరిశోధకులు బీరామరాజు సంస్కృత వాజ్మయంలో తెలుగువారి స్థానం అనే వ్యాసంలో ఈ పుస్తకాన్ని గురించి రాశారు. కానీ పుస్తకం వివరాలేమీ తెలియవు. మల్లినాథుని గురించి ఇంకా అన్వేషించాల్సిన అవసరం ఉన్నది.
ఎం.నారాయణ శర్మ: 98483 48502