(సెప్టెంబర్ 18న మడిపల్లి భద్రయ్య ప్రథమ వర్ధంతి )
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహేత, కవి,గాయకులు, నటులు, మహా మానవతావాది శ్రీమడిపల్లి భద్రయ్యను స్మరించుకోవడమంటే ఒక్కమాటలో చెప్పాలంటే ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా సాహితీసాంస్కృతిక వైభవాన్ని స్మరించుకున్నట్టే.. సుమారు అర్ధశతాబ్దం పాటు నిర్విరామంగా తమ కలాన్ని, గళాన్ని సామాజిక హితం కోసమే వినియోగించిన అసలు సిసలైన ప్రజాకవి.
ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన భద్రయ్య సహజ కవి. సామాన్య ప్రజలు కూడా పాడుకునే విధంగా తన రచనలు ఉండాలన్నది వీరి ఉద్దేశం కాబట్టి సరళసుందరమైన శైలిని అవలంబించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాహితీ,సాంస్కృతిక స్ఫూర్తి భద్రయ్య. వారు జన్నారంలో మిత్రకళాసమితి, ఇచ్చోడలో ప్రత్యూష మొదలైన సంస్థల ద్వారా ఎనలేని సాహితీ సాంస్కృతిక సేవ చేసారు. ఆదిలాబాదు జిల్లా అడవుల తల్లి జిల్లా ..జిల్లంటే జిల్లా కాదూ ఆదిలాబాదు జిల్లా.. అంటూ తొలి జిల్లా గీతాన్ని అందించారు. వారు ఈ గీతాన్ని గొంతెత్తి పాడుతుంటే ఉత్సాహం ఉరకలెత్తేది. సభాప్రాంగణాలు చైతన్యంతో పరిమళించేవి.
భద్రయ్య ఉపాధ్యాయ వృత్తి విరమణ పొందాక వయోభారాన్ని, వ్యయ ప్రయాసాలను కూడా లెక్క చేయకుండా ఆదిలాబాదు జిల్లాలోని 52 మండల కేంద్రాలను పర్యటించి, ఆయా ప్రాంతాల భౌగోళిక, రాజకీయ,సాహితీ సాంస్కృతిక విశేషాలన్నింటినీ విపులంగా వివరిస్తూ మన ఆదిలాబాదు అనే గ్రంథాన్ని వెలువరించారు. ఇది ఆధునిక యాత్రా చరిత్ర. ఈ పర్యటనలో తాను సేకరించిన సుమారు పదివేల పదాలతో మన భాష -మన యాస అనే పేరుతో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రజల వ్యావహారిక పదకోశాన్ని నిర్మించారు.
ఇందులో ప్యాదోన్ని గొట్టెరా పెద్దపులీ, బల్మీకి లింగం గడితే భక్తుడైతడా వంటి సామెతలూ, జాతీయాలూ, కడతాల్, యాపల్, బబ్బెర చెలక, వటోలి, హంగిర్గ వంటి అనేక గ్రామాల పేర్లూ, కచ్రూలాల్, యాకయ్య వంటి వ్యక్తుల పేర్లూ ఎన్నెన్నో కనిపిస్తాయి. నిజానికిది ఏ అకాడమీయో పూనుకొని చేయాల్సిన మహత్కార్యం. భద్రయ్య ఒంటరిగా తమ భుజస్కంధాల మీదకు ఎత్తుకున్నారు.
భద్రయ్య శ్రీ శివభక్తచరితం, శ్రీ హరిలీలలు, శ్రీ శివలీలలు, శ్రీరామ చరితం, శ్రీ శిరిడీ సాయి త్రిశతి, శ్రీ సత్యసాయి భజన గీతాలు, శ్రీ మెహర్ భజన గీతాలు, శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ శతకం వంటి ఆధ్యాత్మిక భక్తి ప్రధాన రచనలతో పాటు కర్తవ్యం, నాలోని నాదాలు, మనోవేదన, మనోవిలాసం బ్రతుకుబాట శతకం మొదలైన సామాజిక రచనలు కూడా చేశారు. వారి రచనల్లో పరమత సహనం, కుల వ్యతిరేకత, దేశభక్తి, మహిళాసాధికారికత, వ్యక్తిత్వ వికాస విషయాలు కనిపిస్తాయి. మానవత్వ మిలను మసిబారుచుండగ – మారుచుండె జగతి మర్వలేము (శ్రీ సాయి త్రిశతి) అంటారు. కులమత విచక్షణను ప్రశ్నిస్తూ కులమేన్ది- మతం మరేన్ది? మనుష్యులం కామా ? అంటూ నీ రగతం నా రగతం ఎర్రగున్నదీ బర్రె నల్లగున్న పాలు తెల్ల గున్నయీ అంటూ సత్యాన్ని చాటి చెపుతారు. చదువుకున్నది నౌకరీలు చేయడానికే కాదు- చదువన్నది నడిమంత్రపు సిరి కానే కాదు- చదువంటే చైతన్యం- చదువంటే స్వాతంత్య్రం- చదువే మనిషికి రూపం అని చదువు ప్రాముఖ్యతను అద్భుతంగా వివరిస్తారు. వీరి సేవలకు గాను ఆదిలాబాద్ సాంస్కృతిక సమాఖ్య వారు విశిష్ట కళారత్న బిరుదును, తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారాన్ని (2011), రంజని తెలుగు సాహిత్య సమితి వారు విశ్వనాథ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించుకున్నాయి. 2015లో జిల్లాఉత్తమకవి పురస్కారం. 2017 ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారం, ఇంకా ఎన్నెన్నో సన్మాన సత్కారాలు పొందారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు డా.వానమామలై వరదాచార్యులు, యాది సదాశివ మాస్టారుతో కలిపి చెప్పుకోవాల్సినవారు భద్రయ్య. ఈ ముగ్గురినీ ఆదిలాబాదు జిల్లా సాహిత్య త్రయంగా అభివర్ణించవచ్చు. భద్రయ్య గతేడాది సెప్టెంబర్ 18న కన్నుమూశారు. వారి కాంస్య విగ్రహన్ని ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం రోజున నిర్మల్ పట్టణంలో ఆవిష్కరించుకున్నారు.
– డా. ఎం.వి.పట్వర్ధన్
అసిస్టెంట్ ప్రొఫెసర్,ప్రభుత్వ డిగ్రీ కళాశాల,మంచిర్యాల