గ్రీష్మ ఊష్మం బుసలుకొడుతున్న వేళ.. తొలకరి జల్లుల హేల.. కలగలసిన మాసం జ్యేష్ఠం. పగళ్లు రోకళ్లు పగిలే మండుటెండలు, చల్లని సాయంత్రాల్లో కొల్లలుగా మల్లెలు, మందారాలు గుబాళించే కాలమిది. పేరులో పెద్దతనం (జ్యేష్ఠ) కలిగిన మాసమిది. జ్యేష్ఠత్వం అంటే పెద్దరికం. అందుకే, జ్యేష్ఠ మాసానికి విధాతకు ప్రియమైన మాసంగా పేరున్నది. ఈ నెలలో బ్రహ్మదేవుడిని అర్చిస్తే శీఘ్రంగా సత్ఫలితాలు పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి. చాంద్రమానం ప్రకారం మూడో నెల జ్యేష్ఠం. ఈ మాసంలో పౌర్ణమి తిథినాడు జ్యేష్ఠ నక్షత్రం పరివ్యాప్తమై ఉంటుంది కాబట్టి, దీనికి జ్యేష్ఠం అని పేరువచ్చింది. జ్యేష్ఠ మాసంతో మొదలయ్యే గ్రీష్మ రుతువు ఆషాఢం పూర్తయ్యేవరకూ ఉంటుంది.
మనుషులతోపాటు జీవజాలమంతా దాహార్తితో అలమటించే మాసం ఇది. అందుకే జ్యేష్ఠంలో జలదానం విశేషమైనదిగా మన పూర్వికులు నిర్దేశించారు. మన ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉన్నట్లే, జలదానం జీవకారుణ్యాన్ని చాటిచెప్తుంది. గ్రీష్మ తాపానికి విరుగుడుగా చలివేంద్రాలు విధిగా నిర్వహించాలని పెద్దలు నిర్దేశించారు. పశుపక్ష్యాదుల కోసం నీటితొట్టెలు ఏర్పాటుచేయాలని సూచించారు. నీటి విలువ అనుభవపూర్వకంగా తెలియజేయడం కోసం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని ‘నిర్జల’ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినం సందర్భంగా మంచినీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉంటారు. ఏడాది పొడవునా ఏకాదశి తిథి నాడు ఉపవాసం చేయలేనివారు, నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండటం ద్వారా, సంవత్సరంలోని అన్ని ఏకాదశి తిథుల్లోనూ ఉపవాసం ఆచరించిన ఫలితం దక్కుతుందని నమ్మకం. వృకోదరుడైన భీముడు వ్యాస భగవానుడిని ప్రార్థించి ఈ వరాన్ని పొందాడని మహాభారత గాథ. అందుకే నిర్జల ఏకాదశిని ‘భీమసేన ఏకాదశి’ అని కూడా పిలుస్తారు.
జ్యేష్ఠ శుద్ధ తదియనాడు పెండ్లికాని యువతులు ‘రంభా తృతీయ’ వ్రతాన్ని ఆచరించి మంచి భర్త రావాలని కోరుకుంటారు. ఈ నెలలో మొదటి పదిరోజులు దీక్షగా నదీస్నానాలు ఆచరించే సంప్రదాయం ఉంది. జ్యేష్ఠ శుద్ధ దశమిని ‘దశపాపహర దశమి’ అని పిలుస్తారు. ఈ రోజు నదీస్నానం ఆచరించడం వల్ల దశవిధ పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. నదిలో మునిగినంత మాత్రాన పాపాలు ప్రక్షాళన అవుతాయని భావించొద్దు. మనం గతంలో చేసిన పాపాలను నదీ స్నానంతో కడిగేసుకొని, మళ్లీ పాపాలు చేయకుండా సన్మార్గంలో నడవాలన్నది ఇందులోని అంతరార్థం. జ్యేష్ఠ పౌర్ణమినాడు మహిళలు వటసావిత్రీ వ్రతాన్ని ఆచరిస్తారు. యమధర్మరాజును ఎదిరించి భర్త ప్రాణాలు దక్కించుకున్న సతీసావిత్రిని ఆదర్శంగా తీసుకొని, సౌభాగ్యం కోసం ముత్తయిదువలు గౌరీదేవిని అర్చిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి, నూతన వస్ర్తాలు ధరించి, గౌరీదేవిని పూజిస్తారు. తోటి స్త్రీలతో కలిసి మర్రిచెట్టుకు పూజలు చేస్తారు. మర్రిమానుకు తోరాలుకట్టి, పూలు, గాజులు, పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. కొందరు రాత్రి చంద్ర దర్శనమయ్యేంత వరకు ఉపవాసం ఆచరిస్తారు. మర్రిచెట్టు విస్తరించినట్లుగా తమ వంశం వృద్ధిచెందాలని, ఆ మహావృక్షం నీడలాగా తమ సంసారం చల్లగా ఉండాలని కోరుకుంటారు. మనకు ఐశ్వర్యం ప్రసాదించే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను వటసావిత్రీ వ్రతం గుర్తుచేస్తుంది.
జ్యేష్ఠ పౌర్ణమిని ‘ఏరువాక పున్నమి’గా పిలుస్తారు. ఇది రైతుల పండుగ. వర్షాకాలానికి స్వాగతం పలుకుతూ భూమిని సిద్ధం చేస్తారు. భూమిని దున్నే నాగలి, వ్యవసాయ ఉపకరణాలు, ఎద్దులను పూజించి ‘ఏరువాక’ పనులకు సన్నద్ధమవుతారు. జ్యేష్ఠమాసంలోనే రుతు పవనాలు విస్తరించడం మొదలవుతుంది. తొలకరి జల్లులు పలకరిస్తుంటాయి. వేసవి తాపంతో నెర్రెలు వారిన నేలతల్లి చినుకు కబురు అందుకొని మత్తయిన పరిమళం వెదజల్లి మనసుకు హాయినిస్తుంది. యువతులకు, మహిళలకు, రైతులకు, సమస్త జీవజాలానికి మేలు చేయాలనే ప్రబోధాన్ని అందించే జ్యేష్ఠ మాసం నిజంగా శ్రేష్ఠ మాసం.
– మరుమాముల దత్తాత్రేయ శర్మ
94410 39146